ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూ(Night Curfew) ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయినా కరోనా ఆంక్షలు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌(Mask)లు తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించింది. ఒకవేళ పెట్టుకోకపోతే చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. షాపింగ్ మాల్స్(Shopping Malls), బహిరంగ ప్రదేశ్లాల్లో కచ్చితంగా కరోనా జాగ్రత్తలు పాటించాలని ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్‌ సర్వే(Fever Survey) కొనసాగించాలని సూచించింది. కరోనా లక్షణాలు ఉన్నవారికి పరీక్షల చేయాలని ఆదేశించింది. వైద్య ఆరోగ్య శాఖ(Health Department)లో పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది. 



రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై సీఎం వైఎస్‌ జగన్‌(CM Jagan) సమీక్షించారు. రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులను, వ్యాక్సినేషన్‌(Vaccination) ప్రక్రియను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో కోవిడ్‌ విస్తరణ గణనీయంగా తగ్గిందని, పాజిటివ్‌ కేసులు(Positive Cases) కూడా గణనీయంగా తగ్గాయని అధికారులు సీఎంకు తెలిపారు. రాష్ట్రంలో 0.82 శాతానికి పడిపోయిన కోవిడ్‌ యాక్టివిటీ రేటు తగ్గిందన్నారు. గత వారం సమావేశం నాటికి 1,00,622 పాజిటివ్‌ కేసులు ఉండగా, ఇప్పుడు 18,929కి పడిపోయాయని అన్నారు. ఇందులో ఆస్పత్రిలో చేరిన కేసులు 794 కాగా, ఐసీయూలో ఉన్నవారు కేవలం 130 మంది, వీరిలో కూడా దాదాపుగా కోలుకుంటున్నారని తెలియజేశారు. 794లో 746 మందికి ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్నామన్నారు. 



గత సమావేశం నాటికి డైలీ పాజిటివిటీ రేటు(Positive Rate) 17.07శాతం కాగా, ప్రస్తుతం డైలీ పాజిటివిటీ రేటు 3.29 శాతం ఉందని వైద్యశాఖ అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. 9,581 సచివాలయాల్లో కేసులు లేవని తెలిపారు. అన్ని జిల్లాల్లో గణనీయంగా కేసులు తగ్గాయన్నారు. రాష్ట్రంలో 3,90,83,148 మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్(Two Doses Vaccination) ఇచ్చామన్నారు. 39,04,927 మందికి ఒక డోసు మేర కోవిడ్‌ వ్యాక్సిన్లు అందించామన్నారు. మొత్తంగా ఉపయోగించిన వ్యాక్సిన్లు 8,32,55,831 డోసులు అని వివరించారు. 45 ఏళ్లు పై బడిన వారిలో 96.7 శాతం మందికి రెండుడోసుల వ్యాక్సిన్లు అందించామన్నారు. 18–44 ఏళ్ల మధ్యవారిలో 90.07 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్లు ఇచ్చామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రికాషనరీ డోస్‌ల విషయంలో టార్గెట్‌ 15,02,841 కాగా వీరిలో 11,84,608 మంది వ్యాక్సిన్లు వేశామన్నారు. 15–18 ఏళ్ల వయస్సు మధ్యనున్న వారిలో 24.41 లక్షల మందికి టార్గెట్‌ కాగా అందరికీ మొదటి డోసు(First Dose) పూర్తి చేశామన్నారు. వీరిలో 12.48 లక్షల మందికి రెండో డోసు పూర్తి చేశామని వెల్లడించారు. 


సీఎం జగన్ మాట్లాడుతూ... రాత్రిపూట కర్ఫ్యూ(Night Curfew) తొలగించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా మార్గదర్శకాలు కొనసాగాలన్నారు. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్‌ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఫీవర్‌ సర్వే కొనసాగించాలన్న సీఎం... లక్షణాలు ఉన్నవారికి టెస్టుల ప్రక్రియ కొనసాగించాలన్నారు. వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా కొనసాగాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్‌మెంట్‌ను త్వరగా పూర్తిచేయాలన్నారు. సిబ్బంది తప్పనిసరిగా ఆస్పత్రుల్లో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రుల్లో పరిపాలనా బాధ్యతలను, చికిత్స బాధ్యతలను వేరు చేయాలన్నారు. పరిపాలనా బాధ్యతలను అందులో నిపుణులైన వారికి అప్పగించాలని సీఎం జగన్ ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే స్పెషలిస్టు వైద్యుల(Specialist Doctors)కు, వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. స్పెషలిస్టు వైద్యులకు ఇస్తున్న మూలవేతనంలో 50 శాతం, వైద్యులకు 30 శాతం మేర ప్రత్యేక ప్రోత్సాహకంగా ఇచ్చేలా మార్గదర్శకాలు తయారు చేశామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.