ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, దక్షిణ కుంభమేళాగా ప్రసిద్ధమైన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పిస్తున్నామని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు మేడారం జాతర జరగనుంది. ఇప్పటికే మూడుసార్లు సమీక్ష చేశామని, ఇటీవలే ముగ్గురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సమీక్ష చేసి వసతుల కల్పన, కరోనా జాగ్రత్తలు, జాతరను విజయవంతం చేయడంపై సుదీర్ఘంగా చర్చించామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. భక్తులు జాతరకు ఎక్కువగా వస్తున్న కారణంగా ఈ నెల 8వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జాతర మార్గాల్లో భారీ వాహనాలు రాకుండా ఆదేశాలు జారీ చేశామన్నారు. హనుమకొండ జిల్లా, ఆత్మకూరు మండలం, గుడేప్పాడ్ నుంచి భూపాలపట్నం మార్గంలో ములుగు జిల్లా చివరి వరకు భారీ వాహనాలు ప్రయాణించవని, కేవలం భక్తులు, స్థానికుల వ్యక్తిగత, ప్యాసింజర్ వాహనాలు మాత్రమే తిరుగుతాయన్నారు. ఈ మార్గంలో వచ్చే వాహనాలు చర్ల, కొత్తగూడం, ఖమ్మం, సూర్యాపేట, హైదరాబాద్, మణుగూరు మార్గాలకు మళ్లించినట్లు తెలిపారు. 


పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక ఏర్పాట్లు


పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపర్చేందుకు ప్రతి గంటకొకసారి పర్యవేక్షించే విధంగా సిబ్బందిని అధిక సంఖ్యలో ఏర్పాటు చేసినట్లు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. పారిశుద్ధ్యంలో ఎలాంటి ఫిర్యాదు రాకుండా నిర్వహణ జరపాలని కచ్చితమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, మేడారం జాతర మార్గాలు, మేడారంలో భక్తుల వసతులు, సదుపాయాలపై ఎప్పటికప్పుడు భక్తులకు సమాచారం అందించేందుకు వీలుగా సోషల్ మీడియా, యాప్స్, సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా వినియోగిస్తున్నామన్నారు. అధికారుల మధ్య సమన్వయం చేసి బాధ్యతలు పటిష్టంగా నిర్వహించేందుకు వీలుగా మేడారాన్ని 8 జోన్లుగా, పలు సెక్టార్లుగా విభజించి, మండల స్థాయి నుంచి జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి అధికారులను ఇంఛార్జీలుగా నియమించామన్నారు. 


నిరంతర నిఘా 


మేడారం వచ్చే భక్తుల భద్రత, దొంగతనాల నివారణ చర్యల కోసం భారీ సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. నిరంతర నిఘా ఉంటుందని, షీ టీమ్స్, మఫ్టీ పోలీసులు విధుల్లో ఉన్నారని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతర అప్రమత్తంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. గద్దెల వద్ద భక్తులకు ఇబ్బందులు జరగకుండా క్యూలైన్ విధానం పటిష్టంగా రూపొందించామని, భక్తులకు క్యూలైన్ లో అసౌకర్యం కలగకుండా చలువ పందిళ్లు, తాగునీరు, వైద్య సదుపాయాలు ఎక్కడికక్కడ ఏర్పాటు చేశామన్నారు. కరోనా నేపథ్యంలో కూడా వైద్య సిబ్బంది గతం కంటే రెండింతలు పెంచామని, పరీక్షలు చేసేందుకు కేంద్రాలను పెట్టామని, పాజిటివ్ తేలితే వెంటనే వారికి చికిత్స చేసేందుకు ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడికక్కడ మాస్కులు, శానిటైజర్ల అందుబాటులో ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇంత పెద్ద జాతరలో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు భక్తులు కూడా సహకరించాలని, మాస్కులు ధరించి, నిబంధనల మేరకు దర్శనాలు చేసుకోవాలని ఎలాంటి ఇబ్బందులున్నా వెంటనే అక్కడున్న అత్యవసర నంబర్లకు, సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సాయం పొందాలని కోరారు.