TSRTC good news for women on the occasion of Rakhi: 


అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు ఎంతో సంతోషంగా జరుపుకునే రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు TSRTC శుభవార్త చెప్పింది. ఆడపడుచుల కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించాలని సంస్థ నిర్ణయించింది. ఈ ల‌క్కీ డ్రాలో గెలుపొందిన మ‌హిళ‌ల‌కు ఆక‌ర్షణీయ‌మైన రూ.5.50 లక్షల విలువగల బ‌హుమ‌తులు అందించి.. వారి ప‌ట్ల సంస్థకున్న గౌర‌వభావాన్ని ప్ర‌క‌టించనున్నారు. ప్రతి రీజియన్ పరిధిలో ముగ్గురికి చొప్పున మొత్తం 33 మందికి బహుమతులను ఇవ్వాలని సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. 
లక్కీ డ్రాలో వీరికి ఛాన్స్..
టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఈ నెల 30, 31 తేదిల్లో ప్రయాణించే మహిళలందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నంబర్ ను రాయాలి. వివరాలు రాసిన ఆ టికెట్ ను బస్టాండ్లలో ఏర్పాటు చేసిన  డ్రాప్ బాక్స్ లలో వేయాలని మహిళా ప్రయాణికులకు సూచించారు. ఆ డ్రాప్ బాక్స్ లను ఒక చోటికి చేర్చి.. ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి ముగ్గురి చొప్పున విజేతలను ఎంపికచేస్తారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులను అందజేయనున్నామని సజ్జనార్ ట్విట్టర్ (ఎక్స్)లో పేర్కొన్నారు. 


మహిళలకు రాఖీ పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైందని, అత్యంత పవిత్రంగా ఈ పండుగను వారు జరుపుకుంటారని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి మరీ తమ సోదరులకు బాలికలు, మహిళలు రాఖీలు కడుతుంటారు. కనుక సోదర సోదరీమణుల ఆత్మీయత, అనురాగాలతో కూడిన ఈ పండుగ నాడు.. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో (TSRTC Bus) ప్రయాణించే మహిళలకు లక్కీ డ్రా నిర్వహించాలని సంస్థ నిర్ణయించింది. ఆగస్టు 30, 31 తేదిల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు అని చెప్పారు. 


మహిళా ప్రయాణికులు ఈ రెండు రోజుల్లో మరిచిపోకుండా టికెట్ వెనకాల పేరు, ఫోన్ నంబర్ రాసి డ్రాప్ బాక్స్ లలో వాటిని వేయాలని వారు సూచించారు. ప్రతి బస్టాండ్, ప్రయాణికుల రద్దీ ప్రాంతాల్లో డ్రాప్ బాక్స్ లను సంస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.. మహిళా ప్రయాణికులందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొని విలువైన బహుమతులను గెలుచుకోవాలని సంస్థ కోరుతోంది. సెప్టెంబర్ 9లోగా లక్కీ డ్రాలు నిర్వహించి, విజేతలకు బహుమతులను అందజేస్తామని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ సజ్జనార్ తెలిపారు. 


ఈ రాఖీ పౌర్ణమి లక్కీ డ్రాకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని వారు సూచించారు. 


రాఖీ పౌర్ణమికి టి-9 టికెట్ల తాత్కాలిక నిలిపివేత
రాఖీ పౌర్ణమికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టి-9 టికెట్లను తాత్కాలికగా  నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. ఆగస్టు 29 (నేటి) నాలుగు రోజుల పాటు నిలుపుదల అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ఈ టికెట్లు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణికులకు టి-9 పేరుతో రెండు టికెట్లను సంస్థ జారీ చేస్తోంది. 60 కిలో మీటర్ల పరిధిలో రానుపోను ప్రయాణానికి టి-9-60ని, 30 కిలో మీటర్లు టి-9-30ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. టి-9 60 టికెట్ ను రూ.100కు, టి-9 30ని రూ.50కి ప్రయాణికులకు అందజేస్తోంది.