Telangana CM KCR: వరి కోనుగోలుపై కేంద్రం ఆసక్తి చూపడం లేదని, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ విషయంలో ఎవరి మెడలు వంచుతాడంటా.. ప్రధాని నరేంద్ర మోదీ మెడ వంచుతాడా మరి చెప్పాలంటూ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో ప్రశ్నించారు. తనను టచ్ చూస్తే చూస్తూ కూర్చునే వారు లేరని.. బండి సంజయ్ ‌ది తన స్థాయి కాదని ఇన్ని రోజులు పట్టించుకోలేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ కలిసే తెలంగాణ రైతులకు ఉరి తాళ్లు పేనుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


ప్రగతి భవన్ లో ప్రెస్ మీట్ పెడితే... రైతుల సమస్యకు పరిష్కారం చూపిస్తారని ఆశించాం, కానీ ఇకపై తెలంగాణ  నుంచి బాయిల్డ్ రైస్ కొనాల్సిందిగా కోరబోమని తానే స్వయంగా కేంద్రానికి లేఖ ఇచ్చినట్టు కేసీఆర్ మీడియా సమక్షంలో బహిరంగంగా ఒప్పుకున్నారు. నీ కేసుల విషయంలో ప్రధాని మోదీ సహకారం కావాలి... అందుకు ప్రతిఫలంగానే రైతుల ప్రయోజనాలకు ఉరి బిగించేలా కేంద్రానికి కేసీఆర్ లేఖ ఇచ్చారని ఆరోపించారు. బాయిల్డ్ రైస్ తీసుకోవాలని ఎట్టి పరిస్థితుల్లోనూ అడగబోమంటూ కేసీఆర్ కేంద్రం ముందు మోకరిల్లి లేఖ ఇచ్చారన్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీకి గులాంగిరీ చేసే నువ్వు కేంద్రంపై పోరాటం చేస్తానంటూ బూటకపు ప్రకటనలు చేసి తెలంగాణ రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు.
Also Read: వరుసగా రెండో రోజు పెరిగిన పసిడి ధర.. వెండి మాత్రం స్థిరంగా.. నేటి ధరలు ఇలా..


రైతులకు మద్దతుగా నిలుస్తున్నట్లు ప్రకటించుకునే కేసీఆర్.. ఢిల్లీ వెళ్లి కేవలం ప్రధాని మోదీతో ములాఖత్ కు, టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు శంకుస్థాపనలకు సమయం ఉంది కానీ కేంద్ర వ్యవసాయ చట్టాలపై ఏడాదిగా కొట్లాడుతున్న రైతులను పరామర్శించాలనే సోయి కూడా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల గురించి కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం లేని కేసీఆర్.. కేంద్రంపై యుద్ధమంటూ రైతులను ఇంకా ఎన్నిసార్లు మోసం చేస్తాడో తనకు అర్థం కావడం లేదన్నారు. వరి కొనేది లేదని ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అధికారం ఎవరిచ్చారంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు. రైతులు, రైతు సంఘాల నేతలతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని కేంద్రానికి లేఖలు రాయడం సరికాదన్నారు.



ఇటీవల కామారెడ్డి జిల్లాల్లో రైతు బీరయ్య పది రోజుల పాటు కొనుగోలు కేంద్రంలో ఉండి చివరికి వరికుప్పపైనే ప్రాణాలు వదిలారు. బీరయ్య కుటుంబాన్ని ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, కనీసం జిల్లా కలెక్టర్ కానీ పరామర్శించ లేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పంటకోతకు టోకెట్ల విధానాన్ని తీసేసి పరిష్కారం చెబుతారని, ధాన్యం సేకరణ పై స్పష్టమైన విధివిధానాలు ప్రకటిస్తారేమోనని ఎదురు చూశామని.. కానీ కేంద్రంతో కయ్యం అంటూ కేసీఆర్ మళ్లీ పాతపాటే పాడారంటూ ఎద్దేవా చేశారు. 
Also Read: కేసీఆర్‌ని టచ్‌ చేసి బతికి బట్టకడతారా... రేపట్నుంచి కేంద్రానికి చుక్కలు చూపిస్తాం.... 


కేంద్రం రైతుల నుంచి వరి కొనుగోలు చేస్తే దళారీ పాత్ర పోషించేందుకు మాత్రమే కేసీఆర్ బాధ్యత వహిస్తారని అర్థమైందన్నారు. కేంద్రం, రాష్ట్రం కలిసి రైతులను మోసం చేస్తున్నాయి. రాష్ట్రంలో మిగతా 4000 కొనుగోలు కేంద్రాలు ఎప్పటిలోగా తెరుస్తారో చెప్పలేదు. రైతులను ఎట్లా ఆదుకుంటారో చెప్పలేదు. మద్యం షాపుల లైసెన్సుల రెన్యూవల్ పై ఉన్న శ్రద్ధ రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రాలపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదు. వరి పంట వేయొద్దు అనోటోడివి లక్షల కోట్లు ఖర్చు చేసి సాగునీటి ప్రాజెక్టులు ఎందుకు కట్టినట్టు అని కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వరి వద్దన్నప్పుడు 24 గంటల విద్యుత్ తో పనేంటి, ఆరు తడి పంటలు పండిస్తే అంత కరెంట్ ఎవరికి అవసరం ఉంటుంది. పంటలు వేస్తే కొనే నాథుడు ఉంటాడో లేదో తెలియని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కేంద్రంపై పోరాటం చేసేటోడివైతే వ్యవసాయ చట్టాలకు మద్ధతు ఎందుకిచ్చారు. హంతకుడే ... బాధితుడి అవతారం ఎత్తి డ్రామాలాడుతున్నట్టు కేసీఆర్ తీరు ఉందన్నారు.
Also Read:  పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించకపోతే ప్రజలకే కాదు ప్రభుత్వానికీ నష్టమే..! ఎలాగో తెలుసా ?


ఇంధన ధరలపై అబద్ధాలు..
పెట్రోలియం ఉత్పత్తులపై తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పెంచలేదని కేసీఆర్ చెప్పడం పచ్చి అబద్ధం. ఒక దఫా రెండు రూపాయలు, మరో దఫా రెండు రూపాయలు పెంచారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పంజాబ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ సైతం లీటర్‌పై రూ.10 తగ్గించారు. కేసీఆర్‌ను బంగాళాఖాతంలో కలిపితే తప్ప తమ సమస్యలు పరిష్కారం కావని రైతులు భావిస్తున్నారు. వాళ్ల పక్షాన నిలబడి అటు కేంద్రం, ఇటు నీ సంగతి ప్రజాకోర్టులో తేల్చే విధంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోందన్నారు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి