Ponnam Prabhakar vows to unveil Rajiv Gandhi statue slams KTR | సిద్దిపేట: తెలంగాణ సెక్రటేరియట్ ముందు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి తీరుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రాజీవ్ విగ్రహాన్ని టచ్ చేసే దమ్ము, ధైర్యం ఉందా ? అని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మంత్రి పొన్నం సూచించారు. రుణమాఫీ కానీ వారు ఆందోళన చెందవద్దని, దేశంలో ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వం తమ కాంగ్రెస్ సర్కార్ అన్నారు. హుస్నాబాద్ లో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలామాల వేసి నివాళులు అర్పించారు. దివంగత ప్రధాని దేశానికి చేసిన సేవల్ని గుర్తుచేసుకున్నారు.


సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి తీరుతాం. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసే దమ్ము, ధైర్యం ఉందా ?. సెక్రటేరియట్ ముందు మేం ఎవరి విగ్రహం తొలగించలేదు. కేటీఆర్ తన విగ్రహం పెట్టుకోవాలనుకున్నాని డౌట్ వస్తుంది. తన ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ విగ్రహంపై కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. టెక్నాలజీ విప్లవాన్ని తెచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ. త్వరలోనే సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాం. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ వీలు కాకపోవడం వల్లే రాజీవ్ గాంధీ విగ్రహం ప్రారంభం కాలేదు. హైదరాబాద్ ఇంచార్జి మంత్రిగా సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహ పనులను పొన్నం పరిశీలించారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు అందిస్తామని,ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని హామీ ఇచ్చారు.


కేటీఆర్ సిరిసిల్లలో నిన్న మాట్లాడుతూ.. సర్వాయి పాపన్న విగ్రహం పెట్టాలన్నారు. తెలంగాణలో గత 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు విగ్రహం ఎందుకు పెట్టలేదనీ కేటీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. తప్పకుండా పాపన్న విగ్రహం పెడతామన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ పథకాలు ఎవరికైనా అమలు అవకపోతే మండల కార్యాలయాల్లో వివరాలు సమర్పించాలని సూచించారు. కేసీఆర్ ట్యూనింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మ్యూజిక్.. ఇద్దరు కలిసి కాంగ్రెస్ ని విమర్శిస్తే మిమ్మల్ని మీరే అవమానించుకున్నట్లే అన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పార్లమెంటు ఎన్నికల్లో వారి సీట్లు 8 దాటలేదని ఎద్దేవా చేశారు. 






ఆర్టీసి చరిత్రలోనే తొలిసారిగా నిన్న ఒకరోజే 64 లక్షల మంది ప్రయాణం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రయాణికుల ద్వారా ఆర్టీసీకి ఒక్కరోజు 15 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. సంస్థ కోసం శ్రమించిన ఆర్టీసి సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు. ఆర్టీసీలో అక్కాచెల్లెమ్మలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే.. బీఆర్ఎస్, బీజేపీ నేతలు మహిళల్ని అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు. ఆర్టీసీలో ప్రయాణిస్తూ కొందరు కావాలనే ఈ పథకాన్ని తప్పుగా చూపించేలా రీల్స్, ఆ వీడియోలపై చర్యలు తీసుకోవాలని  చర్చించామన్నారు.

Also Read: Telangana: సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉండటమే న్యాయం- రాహుల్ గాంధీకి తెలంగాణ మేథావుల బహిరంగ లేఖ