కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. అవినీతి గురించి రాహుల్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. 'టికెట్లు అమ్ముకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలే ఈడీకి ఫిర్యాదు చేశారు. ఓటుకు నోటు కేసులో ఆయన ఇప్పటికే పట్టుబడ్డాడు. స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ అవసరం లేదని గాంధీజీ అన్నారు. ఇలాంటి వారు కాంగ్రెస్ లో ఉంటారని ఆయన ఆనాడే ఊహించారేమో.? పీసీసీ పోస్టును రూ.50 కోట్లకు అమ్మారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఒకరు పీసీసీ పోస్టును విక్రయిస్తే మరొకరు కొనుగోలు చేశారు. ఇంతటి అవినీతి పార్టీలో ఉన్న రాహుల్ గాంధీ, అక్రమాలపై మాట్లాడడం హాస్యాస్పదం.' అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.










బస్సు యాత్రపై సెటైరికల్ ట్వీట్స్


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు బస్సు యాత్ర చేపట్టారు. అయితే, దీనిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సెటైరికల్ ట్వీట్స్ చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నెలకొంది. 'సంక్షేమంలో స్వర్ణ యుగానికి కేరాఫ్ అడ్రస్ తెలంగాణ అని, కాంగ్రెస్ బస్సు యాత్ర తుస్తుమనడం ఖాయం. చీకటి పాలనకు కర్ణాటక చిరునామా.' అని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. విభజన హామీలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్ కు తెలంగాణలో పర్యటించే అర్హతే లేదని మండిపడ్డారు. 


'ఇవ్వని హామీలనూ నెరవేర్చాం'


బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను నెరవేర్చిందని కేటీఆర్ తెలిపారు. కర్ణాటకలో ప్రజలకిచ్చిన హామీలన్నీ వంద రోజుల్లోనే బొంద పెట్టిన పార్టీ కాంగ్రెస్ అని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. రైతులకు 24 గంటలు నిరంతర ఉచిత కరెంట్ అందిస్తూ, తెలంగాణలో సాగును సంబరంగా మార్చిన పాలన సీఎం కేసీఆర్ దని ప్రశంసించారు. శ్రీకాంతాచారిని బలి తీసుకున్న కాంగ్రెస్ కు, ఆ అమరుడి పేరెత్తే హక్కు లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటులో పదేళ్ల జాప్యమే, వందల మంది బలిదానాలకు కారణమైందని అన్నారు. అయితే, ఈ విమర్శలపై కాంగ్రెస్ నేతలు సైతం ట్విట్టర్ వేదికగా ఘాటుగా రిప్లై ఇస్తున్నారు.