Telangana Group 1 :  తెలంగాణలో మరోసారి గ్రూప్‌వన్‌ పరీక్ష ప్రిలిమ్స్‌ రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన  తీర్పును సవాల్ చేస్తూ.. ప్రభుత్వం  దాఖలు చేసిన రిట్  పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. దీంతో గ్రూప్ 1 పరీక్ష  మరోసారి నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది.  జూన్‌ 11న గ్రూప్‌ వన్‌ ప్రిలిమ్స్‌ రెండోసారి నిర్వహించారు. అందులో కూడా అక్రమాలు జరిగాయని కొందరు అభ్యర్థులు కోర్టు మెట్లు ఎక్కారు. 503 పోస్టులతో విడుదల చేసిన నోటిఫికేషన్‌ కోసం రెండుసార్లు ఎగ్జామ్ రాశారు.  లీకేజీ ఆరోపణలతో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మొదటి సారి గ్రూప్‌ - 1 పరీక్షను రద్దు చేసింది. పకడ్బంధీగా రెండోసారి నిర్వహించాలని భావించారు.  రెండోసారి పరీక్ష నిర్వహణలో కూడా లోపాలు తలెత్తాయి. వీటిని పాయింట్‌ అవుట్ చేస్తూనే కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని... హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం పరీక్షను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ కూడా సమర్థించింది. 


గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దుతో అభ్యర్థులతోపాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే రెండుసార్లు పరీక్ష రాశామని, మూడోసారి రాయడమంటే తట్టుకోలేని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ప్రిలిమినరీ పరీక్ష అంటే లక్షల మంది అభ్యర్థులు మానసికంగా ఇబ్బందులకు గురవుతారని కమిషన్‌ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై డివిజన్‌ బెంచ్‌కు టీఎస్‌పీఎస్సీ అప్పీలు చేసింది. కానీ లోపాల్లేకుండా పరీక్షను నిర్వహించామని టీఎస్‌పీఎస్సీ నిరూపించుకోలేకపోయింది. 


తెలంగాణ ఏర్పడిన తర్వాత  తొలిసారిగా గతేడాది అక్టోబరు 16న తొలిసారి ప్రిలిమ్స్‌ నిర్వహించారు. తరువాత ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో కమిషన్‌ ఆ పరీక్షను రద్దు చేసింది. తరువాత మళ్లీ ఈ ఏడాది జూన్‌ 11న ప్రిలిమ్స్‌ నిర్వహించగా.. ఈ పరీక్షను కూడా కోర్టు రద్దు చేసింది.   ఇచ్చింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రెండుసార్లు రద్దవడంతో ఇటు అభ్యర్థులతోపాటు కమిషన్‌లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. 2022 ఏప్రిల్‌ 26న ఏకంగా 503 పోస్టులతో తెలంగాణలో తొలి గ్రూప్‌-1 ప్రకటనను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. తెలంగాణ  వ్యాప్తంగా 3,80,202 మంది దరఖాస్తు చేశారు. అదే ఏడాది అక్టోబరు 16న ప్రిలిమ్స్‌ నిర్వహించగా 2,85,916 మంది హాజరయ్యారు. 


టీఎస్‌పీఎస్సీ వీరి నుంచి 1:50 నిష్పత్తిలో 25 వేల మందిని ఈ ఏడాది జనవరిలో మెయిన్స్‌కు ఎంపిక చేసింది. జూన్‌లో ప్రధాన పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూలు వెలువరించింది. అనూహ్యంగా ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో కమిషన్‌ ఆ పరీక్షను రద్దు చేసింది. తిరిగి జూన్‌ 11న ప్రిలిమ్స్‌ నిర్వహించగా 2,33,506 మంది అభ్యర్థులు హాజరయ్యారు.  ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుందా లేకపోతే..  మళ్లీ పరీక్షను నిర్వహిస్తుందా అన్నదనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.