Governor Vs TS Governament :   తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య  సంబంధాలు పూర్తి స్థాయిలో సామరస్యంగా మారలేదని మరోసారి స్పష్టమయింది. అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ ఆమోదం కోసం పంపిన బిల్లులపై గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీనిపై గతంలో తెలంగాణ మంత్రులు విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నేరుగా  సుప్రీంకోర్టుకు వెళ్లింది. గవర్నర్ బిల్లులను ఆమోదించడంలేదని.. వెంటనే నిర్ణయం తీసుకునేలా గవర్నర్ ను ఆదేశించాలని కోరింది. మొత్తం పది బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది. 


రాజ్ భవన్‌లో నెలల తరబడి పెండింగ్‌లో అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు


గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలు ఆమోదముద్ర వేసిన 8 బిల్లుల్లో ఒక్క  బిల్లును మాత్రమే ఆమోదించారు. ఏడు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించిన బిల్లుల్లో  ద్రవ్య వినిమయ బిల్లుకు వెంటనే ఆమోదముద్ర వేసిన గవర్నర్‌ తమిళి సై మరో మూడు   బిల్లులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  దీంతో పది బిల్లులపై గవర్నర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. బడ్జెట్‌ సమావేశాల ముందు రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌ మధ్య విభేదాలు తలెత్తాయి. బడ్జెట్‌ను ఆమోదించకపోవడంతో తెలంగాణ సర్కార్ హైకోర్టుకెు వెళ్లింది.   హైకోర్టు సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది, రాజ్‌భవన్‌ తరఫున న్యాయవాది చర్చల జరిపారు. ఇరువురి మధ్య సఖ్యత కుదరడంతో  బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ ప్రసంగానికి తెలంగాణ సర్కార్ ఆమోదం తెలిపింది. 


ఇటీవల పరిస్థితులు మెరుగుపడినట్లుగా కనిపించినా బిల్లులను ఆమోదించని గవర్నర్ తమిళిసై


ప్రభుత్వం, గవర్నర్ మధ్య ఉన్న వివాదాలు ఇక కొలిక్కి వచ్చినట్లేనని కొన్నినెలలుగా పెండింగ్‌లో ఉన్న  బిల్లులకు కూడా ఆమోద ముద్ర పడుతుందని ప్రభుత్వం భావించింది. కానీ ఇప్పటికీ గవర్నర్‌ ఆమోదం తెలుపలేదు. పైగా మరో మూడు బిల్లులపైనా నిర్ణయం తీసుకోలేదు.  విశ్వవిద్యాలయాల్లో నియామకాల కోసం తెచ్చిన కామన్‌ రిక్రూట్‌మెంట్‌బోర్డు ఏర్పాటు కోసం , సిద్దిపేట జిల్లా ములుగులో ఏర్పాటు చేసిన అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను అటవీ విశ్వవిద్యాలయంగా మారుస్తూ తెచ్చిన బిల్లు. ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ, జీహెచ్‌ఎంసీ, పురపాలక చట్టాలకు సవరణ, పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ చట్ట సవరణ, అజామాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా చట్ట సవరణ, జీఎస్టీ చట్ట సవరణ ఇలా ఏడు బిల్లులను ప్రభుత్వం తెచ్చింది. వీటిని అసెంబ్లీ, మండలిలో ఆమోదించి గవర్నర్‌ ఆమోదం కోసం పంపింది.వీటిలో జీఎస్టీ చట్ట సవరణ బిల్లును మాత్రమే గవర్నర్‌ ఆమోదించడంతో చట్టంగా రూపుదాల్చింది. మిగిలినవి పెండింగ్‌లో ఉన్నాయి.  తాజాగా ఉభయ సభలు వ్యవసాయ విశ్వవిద్యాలయం, పురపాలక, పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లులు ఆమోదం తెలిపాయి. వీటికి గవర్నర్‌ ఆమోదం తెలపలేదు. బడ్జెట్‌కు సంబంధించిన రెండు ద్రవ్య వినిమయ బిల్లులకు నిన్న గవర్నర్‌ ఆమోదం తెలిపారు. గత సమావేశాల్లోని 7, తాజాగా 3 కలిపి మొత్తం పది బిల్లులపై గవర్నర్‌ ఆమోదించలేదు. వీటి కోసం సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్ వెళ్లింది. 


పంజాబ్ గవర్నర్ వ్యవహారంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో  చురుకుగా స్పందించిన తెలంగాణ ప్రభుత్వం


ప్రస్తుతం పంజాబ్ గవర్నర్ వ్యవహారం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.  రాష్ట్ర క్యాబినెట్‌ సిఫార్సు చేసిన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను న్యాయసలహా మేరకే నిర్వహిస్తానని గవర్నర్ మంకుపట్టు పట్టారు. దీనిపై పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గవర్నర్‌ రాజ్యాంగం ప్రకారం పనిచేయాలని స్పష్టం చేసింది.  క్యాబినెట్‌ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని సిఫారసు చేసినప్పుడు.. గవర్నర్‌ దానికి కట్టుబడి ఉండాలని   క్యాబినెట్‌ సలహాలను స్పష్టంగా పాటించాలని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం చురుకుగా ఆలోచించి.. వెంటనే తెలంగాణ గవర్నర్ వ్యవహారశైలి కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉందని.. పిటిషన్ వేసింది.