DK Sivakumar Sensational Comments on CM KCR: ఈ నెల 3న తెలంగాణ ఎన్నికల ఫలితాలు (Telangana Elections Resluts 2023) వెలువడనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు (Telangana Exit Polls 2023) కాంగ్రెస్ కు అనుకూలంగా రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఈ క్రమంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Sivakumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ సునాయాసంగా అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. 'కాంగ్రెస్ అభ్యర్థులను ట్రాప్ చేసేందుకు సీఎం కేసీఆర్ (CM KCR) ప్రయత్నిస్తున్నారు. మా పార్టీ అభ్యర్థులే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. అయితే, గెలిచిన వారిని క్యాంపులకు తరలించే అవసరం రాదు.' అని డీకే తెలిపారు.


హైదరాబాద్ కు డీకే


డిసెంబర్ 3న (ఆదివారం) తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు హస్తం వైపే మొగ్గు చూపిన నేపథ్యంలో తాజా పరిస్థితులపై అలర్ట్ అయ్యింది. గెలిచిన తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చర్యలు చేపట్టింది. కొన్ని సంస్థలు హంగ్ వస్తుందని అంచనా వేయగా, ఫలితం అలా వచ్చినా ఏం చేయాలనే దానిపై దృష్టి సారించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్ గా పేరొందిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను రంగంలోకి దించింది. తెలంగాణ ఎన్నికల ఫలితాల పర్యవేక్షణ బాధ్యతలను ఆయనకు అప్పగించింది. దీంతో శనివారం సాయంత్రం డీకే హైదరాబాద్ రానున్నారు. 2 రోజుల పాటు ఆయన ఇక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. గెలిచిన ఎమ్మెల్యేలను ఎక్కడికి తరలించబోమని, ఆ అవసరం రాదని ఇప్పటికే డీకే స్పష్టం చేశారు. గెలుపు అవకాశాలున్న నేతలకు ఆయన ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురి కాకుండా చూసుకునే బాధ్యతను డీకే తీసుకున్నట్లు సమాచారం.


ఇదే ఆయన సత్తా


డీకే శివకుమార్.. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి, అక్కడ రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేలా కీలక పాత్ర పోషించారు. ఎన్నికల్లో నెగ్గిన అభ్యర్థులు చేజారిపోకుండా అందరినీ ఏకతాటిపై ఉంచడంలో ఎక్స్ పర్ట్ అయిన ఈయన పాలిటిక్స్ లో ట్రబుల్ షూటర్ గా పేరొందారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ఫలితాల వేళ ఆయన సేవలను మరోసారి కాంగ్రెస్ అధిష్టానం వినియోగించుకుంటోంది. తాము గెలిచామనే ప్రకటన వచ్చేంత వరకూ, కొత్త ప్రభుత్వం కొలువుదీరేంత వరకూ పూర్తి బాధ్యతలను డీకే పర్యవేక్షించనున్నారు.


అదే వ్యూహమా.?


తెలంగాణ ఎన్నికల ఫలితాల రోజున టీకాంగ్రెస్ బిగ్ ప్లాన్ అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో ఏఐసీసీ ఓ పరిశీలకుడిని నియమించనుంది. సదరు అభ్యర్థి విజయం సాధించాక వారితో డీకే ఓ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సంపూర్ణ మెజార్టీ వస్తే ఇబ్బందే లేదు. లేకుంటే అమలు చేయాల్సిన వ్యూహాలపై పార్టీ సీనియర్ నేతలు, గెలుపొందిన అభ్యర్థులతో చర్చించనున్నట్లు సమాచారం. అయితే, గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ చెబుతుండగా, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈ అంచనాలతో నిజమైందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఏది డిసెంబర్ 3న ఈ ఉత్కంఠకు తెరపడనుంది.


Also Read: తెలంగాణలో రేపే కౌంటింగ్‌-ఉదయం 10గంటల్లోగా తొలి ఫలితం