TS Cabinet Meet : ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ అయింది. ఈ సమావేశంలో కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర పోలీసు శాఖ‌లో కొత్త పోస్టుల భ‌ర్తీకి మంత్రివ‌ర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసు శాఖను దేశానికే ఆదర్శంగా నిలిపేలా మరింత పటిష్టం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. కొత్త సాంకేతికత, మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పోలీసు శాఖను పటిష్ఠం చేయాలన్నారు. నేరాల తీరు మారుతున్న కారణంగా నేరాల అదుపునకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని, అందుకు తగిన విధంగా సిబ్బందిని నియమించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. నార్కోటిక్ డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్‌ను దెబ్బతీస్తున్నాయని, శాంతిభద్రతల సమస్యకు దారితీస్తున్నాయని మంత్రి వర్గం చర్చించింది. 





పోలీస్ శాఖలో ఉద్యోగాలు 


మాదక ద్రవ్యాల నేరాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, తెలంగాణ సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో 3966 పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివ‌ర్గం నిర్ణయించింది. ఈ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని హోంశాఖను కేబినెట్‌ ఆదేశించింది. వీటితోపాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో శాంతి భద్రతలను మరింతగా మెరుగుపరిచేందుకు పోలీసు వ్యవస్థను పటిష్ఠం చేయాలని నిర్ణయించింది. కొత్త పోలీస్ స్టేషన్లు, సర్కిల్ లు, డివిజన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 






కేబినెట్ కీలక నిర్ణయాలు 


రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు పలు రంగాల్లో రోజు రోజుకూ పెరుగుతున్న అభివృద్ధికి అనుగుణంగా రోడ్లు భవనాల శాఖలో పని విస్తృతి పెరుగుతున్నదని, అందుకు అనుగుణంగా శాఖలోని పలు విభాగాలను పటిష్టం చేయాలని, ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ దిశగా సీఎం కేసీఆర్ తీసుకున్న పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రోడ్లు భవనాల శాఖలో అధికార వికేంద్రీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన అదనపు ఉద్యోగ నియామకాలను చేపట్టాలని, అవసరమైన మేరకు నూతన కార్యాలయాలను ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆదేశించింది. అందుకోసం అదనపు నిధులను కూడా మంజూరు చేసింది. ఇందులో భాగంగా రోడ్లు భవనాల శాఖ చేసిన పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతే కాకుండా అత్యవసర సమయాల్లో అధికారులు స్వీయ నిర్ణయంతో ప్రజావసరాలకు అనుగుణంగా పనులు చేపట్టేందుకు కేబినెట్ అవకాశమిచ్చింది. 


ఆర్అండ్ బీ శాఖలో ఉద్యోగాలు 
 
రోడ్లు భవనాల శాఖలో పెరిగిన పనికి అనుగుణంగా శాఖను పునర్ వ్యవస్థీకరించేందుకు కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆర్ అండ్ బి శాఖలోని పలు విభాగాల్లో మొత్తం 472 అదనపు పోస్టులను కేబినెట్ మంజూరు చేసింది.  ఇందులో కొత్తగా 3 చీఫ్ ఇంజనీర్ పోస్టులు, 12 సూపరిండెంట్ ఇంజినీర్ పోస్టులు, 13 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు, 102 డి.ఈ.ఈ పోస్టులు, 163 అసిస్టెంట్ ఈ.ఈ పోస్టులు, 28 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులతో పాటు పలు టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బంది పోస్టులున్నాయి. ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చేపట్టాలని రోడ్లు భవనాల శాఖను కేబినెట్ ఆదేశించింది. దాంతో పాటు సత్వరమే పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. పెరిగిన నూతన ఉద్యోగాలతో పాటు, ఆర్ అండ్ బీ శాఖలో పరిపాలన బాధ్యతల వికేంద్రీకరణకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాల నిర్మాణం, మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆర్ అండ్ బి శాఖ లోని, రోడ్లు, భవనాలు, ఎలక్ట్రికల్, జాతీయ రహదారుల విభాగాల్లో 3 చీఫ్ ఇంజినీర్ కార్యాలయాలను, 10 సర్కిల్ కార్యాలయాలను, 13 డివిజన్ కార్యాలయాలను, 79 సబ్ డివిజన్ కార్యాలయాలను  ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి శాఖను కేబినెట్ ఆదేశించింది.


ఆర్ అండ్ బీ శాఖకు నిధులు 


 రోడ్లు భవనాల శాఖను మరింత పటిష్టం చేసేందుకు ఈ ఆర్థిక సంవత్సరానికి అదనంగా నిధులను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదించింది. ఇందులో భాగంగా కాలానుగుణంగా చేపట్టే రోడ్ల మరమ్మతుల కోసం  రూ. 1865 కోట్లను మంజూరు చేసింది.  వానలు, వరదలు తదితర ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా రోడ్లు తెగిపోవడం, కొట్టుకుపోవడం వంటి సందర్భాల్లో  ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగు పరిచే దిశగా తక్షణమే పనులు చేపట్టేందుకు రూ. 635 కోట్ల నిధులను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. వానలు వరదలు తదితర ప్రకృతి విపత్తుల సందర్భంలో  ప్రజావసరాలకు అనుగుణంగా, అసౌకర్యాన్ని తొలగించి యుద్దప్రాతిపదికన పనులు చేపట్టేందుకు డి.ఈ.ఈ నుంచి పై స్థాయి సీఈ వరకు స్వతంత్ర నిర్ణయాధికారానికి కేబినెట్ ఆమోదించింది. విచక్షణతో కూడిన స్వీయ నిర్ణయాలను తీసుకుని పనులు చేపట్టేందుకు డి.ఈ.ఈ కి ఒక్కొక్క పనికి రూ. 2 లక్షలు (సంవత్సరానికి 25 లక్షలు), ఈఈకి 25 లక్షల వరకు (ఏడాదికి 1.5 కోట్లు),  ఎస్.ఈ పరిధిలో 50 లక్షలు (సంవత్సరానికి 2 కోట్లు), సీ.ఈ పరిధిలో  రూ. 1 కోటి వరకు (సంవత్సరానికి 3 కోట్ల వరకు) పనులు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అత్యవసర సమయాల్లో ఈ పనులను అవసరమైతే నామినేషన్ పద్దతుల్లో చేపట్టేందుకు అధికారాలను కల్పించింది. ఇందుకోసం ఏడాదికి రూ. 129 కోట్లు  ఆర్ అండ్ బీ శాఖ ఖర్చు చేసేందుకు కేబినెట్ అవకాశం కల్పించింది. ఇదే పద్దతిని అనుసరిస్తూ భవనాల విభాగంలో కూడా అత్యవసర సమయాల్లో రిపేర్లకు ఖర్చు చేసేందుకు అవకాశం కల్పించింది.