అమ్మాయిల మధ్య స్నేహం అబ్బాయిల కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఇద్దరు అమ్మాయిల మధ్య స్నేహం ఎలా ఉన్నా పెళ్లి మాత్రం అబ్బాయిలతోనే జరుగుతుంది. ఇది ప్రకృతి ధర్మం. అలా కాకుండా వేరేలా జరిగేందుకు వీలులేదు. ఒకవేళ అలా జరిగితే దానిని పెళ్లి అనరు మరోలా గుర్తిస్తుంది సొసైటీ. విదేశాల్లో అబ్బాయి అబ్బాయినే పెళ్లి చేసుకోవడం, అమ్మాయి అమ్మాయినే పెళ్లి చేసుకున్న ఘటనలు చాలానే చూశాం. కానీ, ఇండియాలో ఈ ట్రెండ్‌ వచ్చేసిందనే చెప్పాలి. రాజుల వంశానికి చెందిన వారి నుంచి దిగ్గజ అథ్లెట్స్‌తో పాటు సాధారన ప్రజల వరకు గే, లెస్బియన్‌ పెళ్లీలు చేసుకుంటున్నారు. ఇందుకు సొసైటీ అలాగే  భారత చట్టాలు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా డోంట్‌ కేర్‌ అంటూ గ్రాండ్‌గా వివాహం చేసుకుంటున్నారు. అయితే తాజాగా వెల్లడైన ఓసర్వే ప్రకారం.. ప్రపంచదేశాలతో పాటు భారత్‌లోనూ ఇలాంటి పెళ్లి ఎక్కువగా జరుగుతున్నాయని తెలిసింది. అంతేకాదు.. లవ్‌ అండ్‌ రిలేషన్‌ షిప్‌లో యువకుడికి యువకుడు.. యువతికి యువతే ఉన్నారని వెల్లడైంది. 


స్వలింగ వివాహాలకు ఇరుకుటుంబాలు అంగీకారం:
ప్రస్తుత కాలంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు మారిపోతున్నాయి. ఇటీవల లింగభేదంతో సంబంధం లేకుండా వివాహాలు చేసుకుంటున్నారు. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఇలా ఎవరికి ఇష్టం వచ్చిన వారిని పెళ్లి చేసుకుంటున్నారు. కాలానుగుణంగా సమాజం కూడా వాటిని అంగీకరిస్తోంది. ఇందుకు తగ్గట్లుగా ఎన్నో దేశాలు స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేశాయి. మొన్నామధ్య.. ఒక అమ్మాయి తనను తానే పెళ్లి చేసుకుని సంచలనం సృష్టించింది. గుజరాత్‌లో ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు.. ఇటు ఏపీలోనే ఇలాంటి సీన్‌ రిపీట్‌ అయింది. ఇద్దరు అమ్మాయిలు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.


ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ ట్రెండ్‌ కొనసాగుతుంది. అంతేకాదు.. స్వలింగ్ సంపర్కాన్ని అడ్డు చెప్పిన పాత చట్టాలను కొట్టేస్తే కొత్త చట్టాలను తిరిగి తీసుకొచ్చాయి చాలా దేశాలు. కొద్ది రోజులక్రితం సింగపూర్‌ ప్రభుత్వం స్వలింగ సంపర్కాన్ని నేరం కాదని వెల్లడించింది. సింగపూర్ ప్రభుత్వం ఎన్నో దశాబ్దాలుగా వివాదాస్పద 377ఏ చట్టాన్ని అమలుచేస్తోంది. ఇది బ్రిటిష్ పాలన నుంచి సంక్రమించింది చట్టం.   ఈ చట్టం ప్రకారం ఇద్దరు పురుషుల మధ్య స్వలింగ సంపర్కం నిషేధం. స్వలింగ సంపర్కం ఆమోదయోగ్యం కాదన్నది సింగపూర్ సమాజం అభిప్రాయమని, ఈ చట్టం దాన్ని ప్రతిబింబిస్తుందని అధికారులు ఏళ్ల తరబడి చెబుతూ వచ్చారు. కానీ, గత వారం సింగపూర్ పార్లమెంట్ ఈ చట్టాన్ని రద్దు చేసింది. అంతకు కొన్ని నెలల క్రితం సింగపూర్ ప్రధానమంత్రి లీ షెన్ లోంగ్ ఈ చట్టాన్ని రద్దు చేయనున్నట్టు ప్రకటించారు.


'గే' మ్యారేజ్‌కు సమంత సపోర్ట్‌:
హైదరాబాద్‌ గత ఏడాది ఇద్దరు మగవారు పెళ్లి చేసుకున్నారు. సమాజం ఏమనుకుంటుందో అనే విషయం పక్కనబెట్టి తాము అనుకున్నది చేస్తున్నారు వాళ్లు. ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 377ను సుప్రీం కోర్టు తొలగించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మొదటి స్వలింగ సంపర్క వివాహం ఇదే కావడం విశేషం. అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోయిన్‌ సమంత ఈ గే న్యూస్‌ క్లిపింగ్‌ను ట్యాగ్‌ చేస్తూ.. సోషల్‌ మీడియాలో రియాక్ట్‌ అయింది. గే మ్యారేజ్ చేసుకుంటున్న వాళ్లిద్దరినీ ట్యాగ్ చేస్తూ సమంత విషెష్‌ తెలిపింది. అంతటితో ఆగకుండా ఆ తర్వాత కూడా రెండు మూడు పోస్టులు పెట్టింది సమంత. వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వైరల్ అయిపోయింది. ఈ ఘటనపై తీవ్రంగా మండిపడుతూ కామెంట్స్‌ చేస్తే, మరి కొందరు సమంతను సపోర్ట్‌ చేశారు.


హైదరాబాద్‌కు  చెందిన  సుప్రియో చక్రవర్తి, అభయ్ డాంగ్ తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి చేసుకున్న తొలి స్వలింగ సంపర్కులు వీరే కావడం విశేషం. వివాహం జరిగిన కొన్ని నెలల తర్వాత, ఈ జంట ప్రత్యేక వివాహ చట్టం, 1954 ప్రకారం స్వలింగ వివాహాన్ని గుర్తించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఈ పిల్‌ను విచారించింది. కులాంతర, మతాంతర జంటలు తమకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కులను సుప్రీంకోర్టు  కాపాడుతుంది. అలాగే స్వలింగ  జంటలను హక్కులను రాజ్యాంగంలో చేర్చడం ద్వారా మాకు రక్షణ కల్పించాలని సుప్రియో కోరుతున్నారు.


తన గర్ల్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన క్రీడాకారిణి:
భారత అథ్లెటిక్స్‌లో ఒడిశాకు చెందిన ద్యుతీచంద్ తన ప్రేయసి మోనాలిసాని పరిచయం చేసింది. ప్రస్తుతం దేశంలోనే నంబర్‌ వన్‌ స్ప్రింటర్‌గా కొనసాగుతున్న ద్యుతీ.. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఎన్నో ఆటుపోట్లను దాటుకొని వచ్చి స్టార్ అథ్లెట్‌గా ఎదిగింది. తాజాగా తన ప్రేయసి మోనాలిసాని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిన్నట్లు తెలుస్తోంది. వీళ్లద్దరు కలిసి ఉన్న ఫోటోను తన సోషల్‌మీడియాలో అకౌంట్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘నిన్న నిన్ను ప్రేమించా.  ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నా, ఈ ప్రేమ ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది’ అని పోస్టు చేసింది ద్యుతీ.


భారత్‌లో లెస్బియన్ వివాహాలు:
కేరళకు చెందిన ఆదిలా నసరీన్, ఫాతిమా నూరాలు ఇటీవల వార్తల్లో నిలిచారు. ఈ ఇద్దరు మహిళలు స్వలింగ సంపర్కులు (లెస్బియన్స్). సహజీవనం చేస్తున్న ఈ జంటను వారి వారి తల్లిదండ్రులు బలవంతంగా విడదీశారు. దీంతో ఈ ఇద్దరు యువతులు కోర్టును ఆశ్రయించగా.. సహజీవనం చేసే పూర్తి స్వేచ్ఛ వారికి ఉందంటూ కోర్టు వారిని మళ్లీ కలిపింది. ఇక తాజాగా ఇరువురూ వధువులుగా మారి వెడ్డింగ్ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. అయితే భారత్‌లో ఇటీవలి కాలంలో ఈ మహిళల తరహాలో పలు జంటలు ఇలాంటి ఫొటోషూట్‌లలో పాల్గొన్నాయి.


దేశంలో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించటాన్ని 2018లో సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఎల్‌జీబీటీక్యూ ప్లస్ బృందాలు, ఉద్యమకారులు దశాబ్దాల పాటు చేసిన సుదీర్ఘ పోరాటం ఫలితంగా ఈ మార్పు వచ్చింది. లింగ వైవిధ్యత గురించి, ఎల్‌జీబీటీ క్యూ ప్లస్ సముదాయాల గురించి ప్రజల్లో అవగాహన పెరిగింది. అయితే ఇప్పటికీ సమాజంలో వీరి పట్ల వివక్ష, విముఖతలు ఎదురవుతూనే ఉన్నాయి.