Saidabad Girl Rape Case Update: సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి హత్యాచార నిందితుడిపై రూ.10 లక్షల రివార్డ్ ప్రకటించారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రివార్డ్ అందిస్తామని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. పోలీసులు నిందితుడి ఆనవాళ్లను విడుదల చేశారు. పది బృందాలను ఏర్పాటు చేసి రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.  ప్రస్తుతం హైదరాబాద్,  నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


హైదరాబాద్ నగరంలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై దారుణంగా హతమార్చిన ఘటనపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును సీరియస్ గా తీసుకుంది. ఇదివరకే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని మంత్రి కేటీఆర్ ట్వీట్ పై సైతం దుమారం రేగింది. మంత్రి చెప్పినా నిందితుడు రాజు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదంటూ ఆ ప్రాంత వాసులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో తెలంగాణ పోలీస్ శాఖ ఇదివరకే హైదరాబాద్ సరిహద్దు జిల్లాల్లో నిందితుడు రాజు కోసం గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకపోవడంతో భారీ రివార్డు ప్రకటించారు. రూ.10 లక్షల మేర రివార్డ్ ప్రకటించడంతో పాటు నిందితుడి ఫొటో, వివరాలను సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు.


Also Read: సైదాబాద్ చిన్నారి హత్యాచార కేసు.. నిందితుడు ఎక్కడ.. సాయం చేసింది అతడి ఫ్రెండేనా?


సింగరేణి బాలిక హత్యాచార కేసు నిందితుడి వివరాలు ఇవే..   
1) వయసు 30 ఏళ్లు 
2) ఎత్తు- సుమారుగా 5.9 అడుగులు
3) జుట్టు-  పెంచిన జుట్టును రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాడు
4) నిందితుడి మెడకు ఎరుపు రంగు కండువా ధరించాడు. తలపై క్యాప్ ఉంది 
5) రాజు రెండు చేతుల మీద మౌనిక అనే పేరుతో టాటూ ఉంటుంది
6) అతనికి గడ్డం కేవలం గవద వద్ద మాత్రమే ఉంది
7) ఫార్మల్ షర్ట్ మరియు ఫార్మల్ పాయింట్ ధరించి ఉన్నాడు
8) మద్యం సేవించే అలవాటు ఉంది, రోడ్ల పక్కన, బస్టాండ్ ప్రాంగణంలో నిద్రిస్తుంటాడు 


నిందితుడు రాజు ఆచూకీ తెలిస్తే డీసీపీ ఈస్ట్ జోన్ కు 9490616366 నెంబర్లో గానీ, డీసీపీ టాస్క్ ఫోర్స్‌కు 9490616627 నెంబర్‌లో సంప్రదించి వివరాలు తెలపాలని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ సూచించారు. 



యాదాద్రి భువనగిరి జిల్లా చందంపేట్ మండలానికి చెందిన పల్లకొండ రాజు జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చాడు. ఆటో డ్రైవర్ గా పని చేస్తునే చోరీలకు పాల్పడేవాడు. సైదాబాద్ ఏరియాలో చుట్టుపక్కల వారితోనూ నిందితుడు చాలా దురుసుగా ప్రవర్తించేవాడు. చుట్టుపక్కల ఇంట్లో ఉండే ఆరేళ్ల పాపను చాక్లెట్ ఆశచూపి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై చిన్నారిని దారుణంగా హత్య చేసి తన గదిలోనే శవాన్ని ఉంచాడు. ముందు పాప గురించి అడిగితే తనకు తెలియదని చెప్పాడు. అతడిపై అనుమానంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా చిన్నారి విగతజీవిగా కనిపించడంతో విషాదం నెలకొంది. మరోవైపు అంతకుముందే రాజు తన స్నేహితుడి సహాయంతో అక్కడి నుంచి పరారయ్యాడని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలని, అతడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్లు పెరిగిపోతున్నాయి. 


Also Read: Cheating Couple : వీళ్ల వేషాలు చూసి ఫ్లాటయితే బుక్కయినట్లే ! ఈ జంట ఎన్ని కోట్లకు జనాల్ని ముంచారో తెలుసా..?