Rajanna Sirisilla News : ఇంట్లో చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్యం పుణ్యం ఎగురని చిన్నారులు కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదానికి గురవుతుంటారు. తల్లిదండ్రులు ఎంత అప్రమత్తంగా ఉన్నా కొన్నిసార్లు చిన్నారులు ప్రమాదాల బారిన పడుతుంటారు. తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇలాంటి విషాద ఘటన చోటుచేసుకుంది. చిన్నారి ఆడుకోడానికి తల్లిదండ్రులు కట్టిన ఉయ్యాలే పాప పాలిట ఉరితాడైంది. అప్పటి వరకూ ఆడుతూ పాడుతూ తిరిగిన చిన్నారి విగతజీవిగా మారడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరు అవుతోంది. 


అసలేం జరిగింది?  


రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది.  గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన దిలీప్‌ దంపతులకు ఏడాది వయసు ఉన్న చిన్నారి ఉంది. చిన్నారి ఆడుకోడానికి తల్లిదండ్రులు ఇంట్లోనే ఉయ్యాల కట్టారు. ఉయ్యాల ఊగుతున్న చిన్నారి మెడ ఉయ్యాలలో చిక్కుకుని ఊపిరాడక మృతిచెందింది. వేరే గదిలో ఉన్న చిన్నారి తల్లిదండ్రులు గమనించే సరికి నష్టం జరిగిపోయింది. ప్రమాదాన్ని గమనించి చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే పాప మరణించిందని డాక్టర్లు తెలిపారు. అప్పటి వరకు సరదాగా ఆడుకుంటున్న చిన్నారి అంతలోనే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు.   


బెలూన్ సిలిండర్ పేలి చిన్నారి మృతి


మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో షిండి బుద్రుక్‌లో  విషాద ఘటన జరిగింది. తాతయ్యతో కలిసి బెలూన్లు కొనుక్కునేందుకు వెళ్లిన రెండేళ్ల చిన్నారి అనుకోని ప్రమాదంలో మృతి చెందింది. తాతతో కలిసి జాతరకు వెళ్లిన మనవరాలు బెలూన్లను చూసి కొనుక్కోవాలని ముచ్చటపడింది. మనవరాలి కోరికను కాదనలేక బెలూన్ కొనేందుకు జాతరలో బెలూన్లు అమ్మే వ్యక్తి వద్దకు వెళ్లారు. ఇంతలో బెలూన్లు అమ్మే వ్యక్తి వద్ద ఉన్న  గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. ఈ పేలుడులో చిన్నారితో స‌హా తాతకు తీవ్రగాయాలు అయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తాత మనవరాలు ఇద్దరూ మృతిచెందారు. ఈ ఘటనతో కుటుంబ స‌భ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 


జాతరలో పేలుడు 


ఈ విషాద ఘటన గ్రామంలో నిర్వహిస్తున్న పోలాల జాతర సందర్భంగా చోటుచేసుకుంది. పారి సాగర్ రోహి అనే రెండేళ్ల చిన్నారి తాతయ్యతో కలిసి ఊరిలో జరుగుతున్న పోలాల జాతరకు వెళ్లింది. ఈ జాతరలో చిన్నారుల వద్ద బెలూన్లు చూసి వాటిని కొనిపెట్టమని తాతయ్యను కోరింది. బెలూన్ అమ్మే వ్యక్తి వద్దకు వెళ్లగా  అక్కడి గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. పేలుడు చాలా తీవ్రంగా ఉండడంతో పారి, ఆమె తాతయ్య తీవ్రంగా గాయపడింది. తీవ్రంగా గాయపడిన పారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది.  ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారి తాతయ్య కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పేలుడు దాటికి  జాతరలో ప‌లువురికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ పేలుడుకు స‌మీపంలో ఉన్న కొన్ని ఇళ్లు కూడా స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.  ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  


Also Read : AP TS Power Issue : ఏపీకి డబ్బులు కట్టబోం - కేంద్రం ఆదేశాలపై కోర్టుకెళ్తామన్న జగదీష్ రెడ్డి


Also Read : మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు - డీహెచ్ శ్రీనివాసరావు