పొలిటికల్ పార్టీలు ఎన్నికల్లో డబ్బు పంచే అవకాశాలున్నాయని ఇన్కమ్ టాక్స్ డీజీ సంజయ్ బహదూర్ అన్నారు. బషీర్ బాగ్ లోని ఆయకార్ భవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేలా పని చేస్తున్నామన్నారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి చెకింగ్ చేస్తున్నామని వెల్లడించారు.


అక్కడక్కడ పట్టుకున్న డబ్బు, బంగారం, వస్తువులను వివరాలను ESMS యాప్ లో నమోదు చేస్తున్నామని చెప్పారు. ఎవరైనా వ్యక్తులు సరైన నగదుకు డాక్యుమెంట్స్ చూపించకుంటే సీజ్ చేసి, ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని అన్నారు.  ఇప్పటివరకు 10 లక్షలకు పైగా సీజ్ చేసిన డబ్బుల విషయంలో తాము ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని వెల్లడించారు.


 శంషాబాద్, బేగంపేట ఎయిర్ పోర్ట్ లల్లో తమ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రైవేట్ ప్లేసెస్ లో తిరిగే హెలికాప్టర్స్ పైన నిఘా ఉంచామన్నారు. గ్రౌండ్ లెవెల్ లో పట్టుబడ్డ మనీ అంతా సీజ్ చేసినట్లు కాదని, పట్టుబడిన డబ్బుల వివరాలపై ఇన్వెస్టిగేట్ చేసి... ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుంటే అప్పుడు సీజ్ చేస్తామని చెప్పారు.


నిన్నటివరకు 53.93 కోట్ల డబ్బు పట్టుబడిందని, అందులో ఎలాంటి డాక్యుమెంట్స్ లేని 1.76 కోట్లు సీజ్ చేశామని వెల్లడించారు. అందులో సరైన డాకుమెంట్స్ చూపించిన 10 కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చేశామని తెలిపారు. మిగిలిన డబ్బు పై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని అన్నారు. 156 కిలోల గోల్డ్, 454 కిలోల వెండి పట్టుబడిందని చెప్పారు. అంతే కాకుండా ఇప్పటివరకు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ గా రైడ్స్ చేసి 14.8 కోట్లు సీజ్ చేసిందని, బ్యాంక్ అకౌంట్స్ పై నిఘా ఉంచామని వెల్లడించారు. 


పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చేస్తున్నామని ఇన్కమ్ టాక్స్ డీజీ సంజయ్ బహదూర్  అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరిస్తూ.. నిబంధనలు ఎక్కడా ఉల్లంఘించకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పోలీస్‌, పలు విభాగాల అధికారులతో కలిసి సమన్వయ సమావేశాలు నిర్వహించి ఆయా విభాగాల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులపై దృష్టిసారించారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడా నిబంధనలకు విఘాతం కలుగకుండా ప్రత్యేక బృందాలతో నిఘాను ఏర్పాటు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.


ప్రత్యేక బృందాలతో నిఘా 


ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆయా రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో చేస్తున్న పనులపై ప్రత్యేక దృష్టి సారించామని డీజీ సంజయ్ బహదూర్ అన్నారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చులు, ప్రచారతీరు, ప్రలోభాల నియంత్రణకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని చెప్పారు. స్టాటిక్‌ బృందాలు, ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్‌, సర్వోలెన్స్‌ బృందాలు, వీడియో వ్యూయింగ్‌ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్‌ ప్రక్రియపై రాజకీయ పార్టీల నేతలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. నామినేషన్‌ వేసినప్పటినుంచి ఎన్నికలు ముగిసేవరకు నాయకుల కదలికలు పరిశీలించడంతో పాటు అభ్యర్థుల ప్రచార వ్యయం, ప్రచార సరళి, ప్రలోభాలకు పాల్పడే అంశాలపై దృష్టిసారించామని చెప్పారు. నగదు, ఇతర బహుమతులు పంపిణీలపై ప్రత్యేక నిఘాను పెట్టామని తెలిపారు. ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘిస్తే నాన్‌బెలేబుల్‌ వారంటీలు, బైండోవర్‌, పీడీ చట్టాన్ని ప్రయోగిస్తామని హెచ్చరించారు.