రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన 'ఖుషి'(Kushi) మూవీ ఇప్పటికీ ఓటీటీలో అదరగొడుతోంది. ఈనెల ఆరంభంలో నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన ఈ మూవీ ఇప్పటికీ టాప్ 10 ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఇండియాలోనే ఎక్కువమంది చూసిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. డీటెయిల్స్ లోకి వెళ్తే.. 'లైగర్' వంటి భారీ డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ సమంతతో కలిసి నటించిన చిత్రం 'ఖుషి'. 'నిన్నుకోరి', 'మజిలీ' వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ ని తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


విడుదలకు ముందే సాంగ్స్ తో ఆడియన్స్ లో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పరవాలేదనిపించింది. ఆడియన్స్ నుంచి సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చినా కలెక్షన్స్ పరంగా డీలా పడింది. సినిమాకి భారీ ఓపెనింగ్స్ దక్కినా ఆ తర్వాత నుంచి ఒక్కసారిగా కలెక్షన్స్ పడిపోవడంతో ఈ మూవీ నెల రోజుల్లోనే ఓటీటీ లోకి అందుబాటులోకి వచ్చింది. అక్టోబర్ 1 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన 'ఖుషి' మూవీ ఇప్పటికీ టాప్ వ్యూస్ తో అదరగొడుతోంది. తాజాగా నెట్ ఫ్లిక్స్ లో ఈ వారం టాప్ 10 లో ఒకటిగా నిలిచి మరో రికార్డు క్రియేట్ చేసింది. ఇండియాలోనే ఈ వారం ఎక్కువ మంది చూసిన సినిమాల లిస్టును నెట్ ఫ్లిక్స్ తాజాగా విడుదల చేయగా అందులో హిందీ భాషలో 'ఖుషి' టాప్ సెవెన్ లో నిలిచింది.


అలాగే తెలుగులో టాప్ 10 లో నిలిచింది. ఇక టాప్ 10 లో మొదటి స్థానంలో బాలీవుడ్ మూవీ 'డ్రీమ్ గర్ల్ 2' ఉండగా రెండో స్థానంలో అక్షయ్ కుమార్ 'ఓమైగాడ్ 2' నిలిచింది. అలాగే నవీన్ పోలిశెట్టి, అనుష్క నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా టాప్ 5 లో ఉండడం విశేషం. థియేటర్లో పర్వాలేదు అనిపించుకున్న 'ఖుషి' ఓటీటీలో మాత్రం దుమ్ము రేపుతోంది. 'ఖుషి' మూవీ ఇంకా ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోందనే విషయం బయటకు రావడంతో రౌడీ హీరో ఫ్యాన్స్ ఈ విషయం తెలిసి సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ సినిమా తర్వాత సమంత మరో సినిమాను ప్రకటించలేదు. సినిమాలకు బ్రేక్ తీసుకొని ఆరోగ్యం పై పూర్తి శ్రద్ధ పెట్టింది.


ఇక విజయ్ దేవరకొండ విషయానికొస్తే.. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా, 'గీత గోవిందం' డైరెక్టర్ పరశురాంతో మరో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి 'ఫ్యామిలీ స్టార్'(Family Star) అనే టైటిల్ ని ఫైనల్ చేస్తూ రీసెంట్ గా విడుదల చేసిన గ్లిమ్స్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.


Also Read : వంద కోట్ల క్లబ్‌లో 'భగవంత్ కేసరి' - అసలైన దసరా విన్నర్ బాలయ్యే!




Join Us on Telegram: https://t.me/abpdesamofficial