మూడు నెలల క్రితం గతంలో ఎన్నడూ చూడని విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. భారీ వర్షాలకు జిల్లాలోని కోనారావుపేట మండలం సుద్దాల గ్రామ శివారులో బుర్ర భూమయ్య గౌడ్, బుర్ర రమేష్ గౌడ్ ల వ్యవసాయ క్షేత్రంలో ఉన్న 70 ఎండ్ల మర్రి చెట్టు కూకటి వేళ్ళతో పెకిలి పోయింది. నీరు అందక కొద్ది రోజులకు మర్రి చెట్టు మోడు గా మారింది. చూపరులకు నిర్జీవంగా దర్శనం ఇస్తుంది.


అదే గ్రామానికి చెందిన ప్రకృతి ప్రేమికుడు, వృక్షో రక్షతి రక్షితః అనే మాటలను బలంగా నమ్మే వ్యక్తి డాక్టర్ దొబ్బల ప్రకాష్ ఈ దృశ్యాన్ని చూశాడు. మొన్నటి వరకూ... మహా వృక్షంగా ఠీవిగా నిలబడి ఎంతో మందికి నీడ నిచ్చి.. ప్రాణులు, పక్షులకు గూడు గా నిలిచిన చెట్టే ప్రకృతి వైపరీత్యానికి నిస్సహాయంగా, నిర్జీవంగా ఉండడం చూసి తట్టుకోలేకపోయాడు. ఆయువు తీరిందని ప్రజలు భావిస్తున్న మర్రి చెట్టుకు నీటిని అందిస్తే మర్టి వృక్షానికి ఆయువు తిరిగి పోయవచ్చు అని భావించాడు.


అనుకున్నదే తడవుగా... రైతు బుర్ర భూమయ్య గౌడ్, బుర్ర రమేష్ గౌడ్ ల తో మాట్లాడాడు. మోడు వారిన చెట్టుకు తిరిగి ప్రాణం పోసి ఇక్కడ నుంచే మరో చోటికి తరలిస్తాననీ తెలిపాడు. పక్కనే ఉన్న మరో రైతువ్యవసాయ క్షేత్రo లోని బావి నీటిని వాడుకునేందుకు అనుమతి తీసుకున్నాడు.


ప్రకాష్.. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజా సంబంధాల అధికారి కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే రెండు నెలల పాటు క్రమం తప్పకుండా చెట్టుకు నీటిని అందించాడు. ప్రకాష్ కృషి ఫలించింది. క్రమంగా చెట్టు తిరిగి చిగురించడం ప్రారంభించింది. ఆ విషయాన్ని గమనించిన ప్రకాష్ ఉత్సాహంగా నీటిని చెట్టుకు అందిస్తూనే ఉన్నాడు. అయితే కొన్ని వేళ్ళు బయట ఉండడంతో నీరు పడుతుంటే మట్టి కొద్ది కొద్దిగా ఊడి పోతుంది. చాలా కాలం ఇలాగే ఉంటే మట్టి పూర్తిగా తొలగి పోయి చెట్టు చనిపోయే ప్రమాదం ఉందని.. అలా జరగకుండా ఉండాలంటే సాధ్యమైనంత త్వరగా మర్రి చెట్టును ట్రాన్స్ ప్లాంటేషన్ పరిజ్జానంతో ఒకచోట నుంచి మరోచోటకు తరలించి నాటడమే పరిష్కార మార్గo అని చెబుతున్నాడు.


దాతల కోసం ఎదురు చూపు....


మర్రి చెట్టు ను తమ గ్రామంలోని స్కూల్ కు తరలించి విద్యార్థులకు నీడ నిచ్చేలా ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలన్నది ప్రకాష్ ఆలోచన. ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలంటే చెట్టును ట్రిమ్ చేయడం, లిఫ్ట్ చేయడం, వాహనంలో తరలించడం, తిరిగి నాటడం చేయాలి. అందుకు రూ. 50 వేల ఖర్చు అవుతుంది. మర్రి చెట్టుకు ప్రాణ మైతే పోయగలిగాడు.. గానీ.. అంత ఖర్చును వెచ్చించే డబ్బు తన వద్ద లేదు. దాతలు ఎవరైనా ముందుకు వస్తే... 70 ఏళ్ల వయస్సు ఉన్న మర్రి చెట్టును బతికించుకోవచ్చని చెబుతున్నాడు.  


గతంలోనూ... పచ్చదనం పెంచేందుకు ప్రకాష్ కృషి.


పద్మశ్రీ వనజీవి రామయ్య స్ఫూర్తితో ప్రకాష్.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పచ్చదనం పెంచేందుకు తనవంతుగా చాలాచోట్ల మెుక్కలను నాటాడు. వర్షాకాలంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గుట్టల్లో వాటిని జార విడిచి పచ్చదనం పెంచేందుకు కృషి చేశాడు. అతని సేవలను గుర్తించిన తమిళనాడు చెందిన ఓ విశ్వ విద్యాలయం సామాజిక సేవా విభాగంలో డాక్టరేట్ ను ప్రదానం చేసింది. పర్యావరణ పరిరక్షణకు ప్రకాష్ చేస్తున్న సేవలకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో  పురస్కారాలు సైతం పొందాడు.


Also Read: Omicron: తెలంగాణలో కొత్తగా 4 ఒమిక్రాన్‌ కేసులు... 7కు చేరిన మొత్తం కేసులు


Also Read: Minister Harish Rao: నిమ్స్ లో రికార్డు స్థాయిలో కిడ్నీ శస్త్ర చికిత్సలు... వైద్య సిబ్బందికి మంత్రి హరీశ్ రావు కితాబు


Also Read: Minister KTR: వరంగల్ కు జెన్పాక్ట్ ఐటీ కంపెనీ... మంత్రి కేటీఆర్ తో జెన్పాక్ట్ బృందం భేటీ...