Telangana Viral News: కాలం మారింది... కంప్యూటర్‌ యుగం వచ్చింది... అయినా ఆడపిల్లలపై ఉన్న వివక్ష మాత్రం పూర్తిగా పోలేదు. ఆడపిల్ల అంటే భారమే అనుకునే తల్లిదండ్రులకు కూడా ఇంకా ఉన్నారు. సమాజంలో లింగవివక్ష..  అక్కడో ఇక్కడో ఎక్కడో ఉంటూనే ఉంది. ఎన్ని చట్టాలు వచ్చినా... గుట్టుచప్పుడు కాకుండా లింగనిర్ధారణ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. కడుపులో ఆడపిల్ల ఉందని తెలిస్తే... కడుపులో చంపేస్తున్న వాళ్లూ ఉన్నారు. అంతేకాదు... ఆడపిల్ల  పుట్టిందని ముఖం మాడ్చుకునే తండ్రులూ ఉన్నారు. అమ్మాయి పుట్టిందని... పురిటిలోని బిడ్డను చెత్తకుప్పల్లోనే.. చెత్తకుండీల్లో పడేస్తున్న సంఘటనలు అప్పుడప్పుడూ కనిపిస్తూనే... వినిపిస్తూ ఉన్నాయి. అంటే.. సమాజంలో ఇంకా..  అమ్మాయిల పట్ల వివక్ష పోలేదు. ఆడపిల్ల పుడితే... అంతా ఖర్చే అన్న ధోరణి మారలేదు. చదువుల ఖర్చు... పెళ్లిళ్ల ఖర్చు... అంతా భారమే అనుకుంటున్నారు చాలా మంది. ఆడపిల్లను కనేందుకు ఇష్టపడటం లేదు. పుట్టినా.. ఎలాగోనా  వదిలించుకుంటున్నారు చాలా మంది. 


పట్టణాల్లో కాకపోయినా... మారుమూల పల్లెల్లో ఆడిపిల్లలపై చిన్నచూపు కొనసాగుతూనే ఉంది. అలాంటి ఆడిపిల్లల సంరక్షణ కోసం... ఓ యువ జంట పెద్దమనస్సుతో ముందుకొచ్చింది. తమ గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల పేరుపై 2వేల  రూపాయలు డిపాజిట్‌ చేయాలని నిర్ణయించుకుని. ఇచ్చేది చిన్న మొత్తమే అయినా... వారి ఆలోచన మాత్రం ఎంతో మంది ఆదర్శవంతమైనది. తన దగ్గర డబ్బులు ఉంటే... బ్యాంకుల్లో దాచుకోవడమో... ఆడంబరాలకు ఖర్చు చేస్తున్నారు. ఆస్తులు  పెంచుకుంటారు. కానీ... ఈ దంపతులు మాత్రం సమాజం కోసం ఆలోచించారు. ఆడబిడ్డల భవిష్యత్‌ కోసం ముందడుగువేశారు. ఇంతకీ ఎవరా దంపతులు..? వారికి ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది..?


నిజామాబాద్‌ జిల్లా తాడ్వాయి మండలం ఏండ్రియల్‌ గ్రామంలో రెడ్డిగారి తిరుపతిరెడ్డి (Reddygari Tirupathi reddy)- శ్రావణలక్ష్మి (Sravana Lakshmi) దంపతులు ఉంటున్నారు. వారి పదో వార్షికోత్సవం(Tenth wedding Anniversary) సందర్భంగా.. సమాజం కోసం మంచి నిర్ణయం తీసుకున్నారు. జనవరి ఒకటి (January 1st), 2024 నుంచి తమ  గ్రామంలో... పుట్టిన ప్రతి ఆడపిల్ల పేరు మీద... 2వేల రూపాయలు (Two thousand Rupees) డిపాజిట్‌ చేయాలని నిర్ణయించుకున్నారు ఈ దంపతులు. పుట్టిన ఆడపిల్ల పేరుపై... సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana) ఖాతా తెరిచి.... 2 వేల రూపాయలు వేస్తున్నారు. తమ నిర్ణయం  అందరికీ తెలిసేలా ప్రచారం కూడా చేస్తున్నారు. పాంప్లేట్లు వేయించారు. ఆడపిల్ల పుట్టినవారు తమను సంప్రదించాలని కోరుతున్నారు. తమ 10వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా... జనవరి ఒకటి, 2024 నుంచి... ఏండ్రియల్‌ గ్రామం (Andreal village)లో పుట్టిన  ప్రతి ఆడపిల్లకు తమ తరపున సుకన్య సమృద్ధి ఖాతా తెరిచి 2వేల రూపాయలు జమ చేస్తామని చెప్తున్నారు. ఆడపిల్ల ఉన్నత చదువులకు, వారి పెళ్లికి ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా... పుట్టినప్పటి నుంచే తల్లిదండ్రులు పొదుపు చేయాలనే అవగాహన కల్పిస్తున్నామని అంటున్నారు ఆ దంపతులు. ఎందరికో ఆదర్శవంతంగా నిలుస్తున్నారు. ఈ దంపతుల్లా ఎంత మంది ఉంటారు. ఎంత మంది వీళ్లలా సమాజం కోసం ఆలోచిస్తారు. నిజంగా వాళ్లకు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే.