తెలంగాణ రాష్ట్రంలోని సిర్పూర్‌ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఒక్కసారి ఇక్కడ గెలిస్తే చాలు రెండోసారి కూడా వాళ్లదే విజయం. ఇది తథ్యం అంటారు ఇక్కడి ఓటర్లు. అంతేకాదు శాసనసభ నియోజకవర్గం తొలి నెంబర్‌ ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌ కి దక్కడం మరో విశేషం. అలాంటి ఈ నియోజకవర్గం ఇప్పుడు టాక్ ఆఫ్‌ ది పాలిటిక్స్‌ గా మారింది. 


సిర్పూర్‌.. ఈ పేరు వినగానే వెంటనే పేపర్‌ మిల్లు గుర్తుకువస్తుంది. సిర్పూర్‌ - కాగజ్‌ నగర్‌ పేపర్‌ మిల్లుకి పేరు గాంచింది. నియోజకవర్గాల పునర్ వ్యవస్ధీకరణలో భాగంగా ఇది కొమురం భీం జిల్లా కిందకు వచ్చింది. సిర్పూర్‌ తో పాటు ఆసిఫాబాద్‌ నియోజవర్గం కూడా ఆ జిల్లా పరిధిలోనిదే. కౌతల, బెజ్జూర్‌, కాగజ్‌ నగర్‌, సిర్పూర్‌, దహేగావ్, పెంచికల్‌ పేట్‌, చింతలమానేపల్లి మండలాలతో ఏర్పడిన ఈ నియోజవర్గంలో దాదాపు లక్షన్నర వరకు ఓటర్లు ఉంటారు. గిరిజనులు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో ఇంతకుముందు టీడీపీ - కాంగ్రెస్‌ ల మధ్య ప్రధాన పోరు ఉండేది. అయితే తెలంగాణ రాష్ట్ర విభజనతో టీఆర్‌ఎస్‌ (ప్రస్తుతం బీఆర్ఎస్) ఇక్కడ బలం పుంజుకుంది. గత ఎన్నికల్లో గులాబీపార్టీ నుంచి కోనేరు కోనప్ప విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో బహుజన సమాజ్‌ వాదీ నుంచి గెలుపొందిన కోనేరు కోనప్ప ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ లో చేరారు. అప్పటి నుంచి సిర్పూర్‌ ఎమ్మెల్యేగా ఉన్న కోనేరు కోనప్ప రానున్న ఎన్నికల్లో గెలుపొందుతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


సిర్పూర్ ఓటర్లకు వరసగా రెండుసార్లు అభ్యర్థులను గెలిపించే ఆనావాయితీ ఉంది. ఈ లెక్కన చూసుకుంటే కోనేరు కోనప్ప రెండుసార్లు గెలిచారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తారా లేదా అన్నది ఓటర్లపై ఆధారపడి ఉంటుంది. ఇక నియోజకవర్గం విషయానికొస్తే అధికారపార్టీ తరపున కోనేరు ఆశించిన స్థాయిలో పనిచేయలేదన్న టాక్‌ ఉంది. భూ కబ్జాలు, అవినీతి ఆరోపణలు కోనేరు కోనప్పపై ఉన్నాయి. పట్టణంలో డంప్‌ యార్డ్‌ కోసం కేటాయించిన స్థలాన్ని అధికార పార్టీ అండదండలతో వెంచర్లుగా మార్చి అమ్మేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నా ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న వాదన ఉంది. అంతేకాదు గత ఎన్నికల్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదన్న అసంతృప్తి ప్రజల్లో ఉంది. అలాగే కొన్ని నెలల క్రితం అటవీభూముల సాగు విషయంలో కోనేరు కోనప్ప సోదరుడు అటవీశాఖ అధికారులపై కర్రలతో దాడులకు దిగడం రాజకీయ వివాదంగా మారింది.


మరోవైపు ప్రాణహిత ప్రాజెక్టు ఇంతవరకు పూర్తికాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుతో దీని పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. దాదాపు 1 5ఏళ్లుగా ప్రాజెక్టు కోసం ఎదురుచూసిన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావాసుల కల కలగానే మిగిలిపోతోంది. ఫలితంగా తాగు, సాగునీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక విపక్షాల విషయం కొస్తే ఇక్కడ బీజేపీ కన్నా బీఎస్పీ హవా ఎక్కువగా ఉంది. 


2014 ఎన్నికల్లో బీఎస్పీ నుంచే కోనేరు కోనప్ప గెలిచి బీఆర్‌ఎస్‌ లో చేరారు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గమే ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆ ఓట్లే కీలకంగా మారడంతో రాజకీయపార్టీల చూపంతా ఆ వర్గంపై పడింది. తెలంగాణ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ వచ్చే ఎన్నికల్లో ఈ నియోజవర్గం నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. తన సామాజిక వర్గం నుంచి కాకుండా జనరల్‌ కేటగిరిలో పోటీ చేయాలన్న ప్లాన్‌ లో ఉన్నారట. ఆ కోణంలో ఇప్పటికే నియోజకవర్గంపై పట్టుసాధించే ప్రయత్నాలకు వ్యూహరచన చేశారని ప్రచారం. కార్యకర్తలు, జిల్లా నేతలతో సమావేశమై భవిష్యత్‌ కార్యచరణకు దిగుతున్నాని తెలుస్తోంది. అదీకాకుండా సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ పేపర్‌ మిల్లు ఉండటంతో కార్మిక కుటుంబాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మినీ ఇండియాగా పిలవబడే సిర్పూర్ లో దేశంలోని అన్నీ ప్రాంతాల ప్రజలు ఇక్కడ నివసిస్తారు. ఒక్కో రాష్ట్రం వారిది ఒక్కో కాలనీ ఉందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణేతరుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. సిర్పూర్ - కాగజ్ నగర్ ఫ్యాక్టరీ కారణంగా ఇక్కడ స్థిరపడినవారు ఎక్కువే ఉన్నారు.


ఇంకోవైపు బీజేపీ బలపడటానికి ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను రారమ్మని ఆహ్వానిస్తోంది. జిల్లా కాంగ్రెస్‌ నుంచి కీలకనేతలు కొందరు ఇప్పటికే బీజేపీలో చేరారు. అంతేకాదు ప్రజా సంగ్రామ యాత్రలతో ఇక్కడ బీజేపీ అధికార పార్టీ బీఆర్ఎస్ కి, బీఎస్పీకి చెక్‌ పెట్టాలని చూస్తోంది. ఇంకోవైపు కాంగ్రెస్‌ ఇక్కడ అంతగా ప్రభావం చూపలేకపోవడంతో రానున్న ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో బీజేపీ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీఎస్పీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు.