KCR Meeting In Nirmal: నిర్మల్ జిల్లాలకు సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. జిల్లా ఏర్పాటయ్యాక బ్రహ్మాండంగా కొత్త క‌లెక్టరేట్ నిర్మించుకున్నాం అన్నారు. జిల్లాలో ఉన్న 396 పంచాయతీలకు ప్రతి పంచాయతీకి రూ.10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించారు. వీటితో పాటు నిర్మల్, ముథోల్, ఖానాపూర్ మున్సిపాలిటీల‌కు రూ. 25 కోట్ల చొప్పున సీఎం కేసీఆర్ ప్రకటించారు. జిల్లాలోని 19 మండ‌ల కేంద్రాల‌కు రూ. 20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు.  అంతకుముందు నిర్మల్ జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.


రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో నిర్మల్ జిల్లా నంబ‌ర్ వ‌న్‌గా నిలిచింద‌ని కేసీఆర్ అన్నారు. ఇందుకుగానూ జిల్లాలోని టీచ‌ర్లను, విద్యార్థుల‌ను సీఎం అభినందించారు. బాస‌ర‌ స‌ర‌స్వతి అమ్మవారి ఆల‌యాన్ని మరింతగా అభివృద్ధి చేయబోతున్నాం. త్వరలోనే పునాది రాయి వేసేందుకు మరోసారి వస్తాను. మారుమూల జిల్లా, అడ‌వి జిల్లా అని పేరున్న ఆదిలాబాద్ జిల్లాలో 4 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం అన్నారు. ఇలాంటి చోట ఒక్క మెడికల్ కాలేజీ ఉండగా.. కొత్తగా మూడు మెడిక‌ల్ కాలేజీలు వచ్చాయన్నారు. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ లోనూ కొత్తగా మెడికల్ రావడం ఆనందంగా ఉందన్నారు.



ప్రభుత్వం పేదల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో 2000 ఇళ్లకు ఇదివరకే తాను శంకుస్థాపన చేసినట్లు కేసీఆర్ తెలిపారు. అవి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు. రాష్ట్రంలోని పేదల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. భూముల విషయంలో స్కామ్ లు జరిగేవని, కానీ ధరణి పోర్టల్ ను తీసేసి బంగాళాఖాతంలో వేయాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. అదే జరిగితే వీఆర్వోలు, వీఆర్ఏలు వస్తారు, మళ్లీ మీరు పైరవీలు చేయాల్సి ఉంటుందన్నారు. రైతు బంధు తీసుకుంటే బ్యాంక్ ఖాతాలోకి నేరుగా నగదు జమ చేస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒకవేళ రైతు చనిపోతే రైతు బీమా నగదు ఆఫీసుకు వెళ్లే అవసరం లేకుండానే.. చెక్ ద్వారా రూ.5 లక్షల చెక్ ఇంటికి వస్తుందన్నారు. వడ్లు అమ్మితే గతంలో రైతులు రోజుల తరబడి కష్టాలు పడేవారు, కానీ 7 వేల కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల బ్యాంకు ఖాతాకు నగదు చెల్లిస్తున్నామని కేసీఆర్ అన్నారు. అలాంటి ధరణిని తీసేయాలని చెబుతున్న నేతలను బంగాళాఖాతంలో కలపాలంటూ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 


నిర్మల్‌ కలెక్టరేట్‌ను ప్రారంభించిన కేసీఆర్‌
నిర్మల్ జిల్లా ఏర్పాటయ్యాక తొలిసారి జిల్లాకు వచ్చారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా నిర్మల్‌ జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. మొదట కలెక్టరేట్‌ శిలాఫలకాన్ని ప్రారంభించగా.. అనంతరం కలెక్టరేట్ లో జరిగిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. రూరల్ మండలంలోని ఎల్లపెల్లి గ్రామ శివారులో రూ.56 కోట్లతో ప్రభుత్వం కలెక్టరేట్‌ను నిర్మించింది. 16 ఎకరాల్లో 1.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు పైన 2 అంతస్తులు ఉండేలా కలెక్టరేట్‌ను నిర్మించారు. మొదటి అంతస్తులో వివిధ శాఖల కార్యాలయాలు ఉంటాయి.  దాదాపు 500 మందితో ఒకేసారి సమావేశం నిర్వహించేలా సువిశాల కాన్ఫరెన్స్‌ హాల్‌ను గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నిర్మించారు.