వందల ఏళ్ల చరిత్రకు ప్రతీకలు.. విశిష్టమైన శిల్పాలు.. అరుదైన నాణేలు... అలనాటి ఆయుధాలు.. పురాతన గ్రంథాలు.. సంస్మృతిని ప్రతిబింబించే శాసనాలు.. నిజాం కాలంలో వాడిన వ‌స్తులు.. నిజామాబాద్ చరిత్ర.... ఇలా ఒక్కటేమిటి వందల సంఖ్యలో అపురూప వస్తువులతో నిండి ఉన్న పురావ‌స్తు ప్ర‌ద‌ర్శ‌న‌శాల. అలనాటి చరిత్ర ఆనవాళ్లు మరుగున పడిపోయాయ్. గ‌త ఏడేళ్లుగా మూత‌బ‌డింది.. దీంతో భావి త‌రాల‌కు చ‌రిత్ర‌కు సంబంధిన వ‌స్తువులు.. నాణేలు.. గ్రంథాలు చూసే ఆవకాశం లేకుండా పోయింది.


నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తిలక్ గార్డెన్‌లో ఉన్న పురావస్తు ప్రదర్శనశాల గత ఏడేళ్లుగా మూతపడిపోయింది. ఇందులో ఇందూరు చ‌రిత్ర‌కు సంబంధిన వ‌స్తులు.. నాణేలు.. నైజం కాలంలో వాడిన వస్తులు.. ప‌రిక‌రాలు.. గ్రంథాలు.. ఇలా ఎన్నో విషయాల‌కు సంబంధిన ఆధారాలు ఈ మ్యూజియంలో  ఉన్నాయి. అయితే గ‌తంలో స్కూల్ విద్యార్థుల‌కు నాటి చరిత్రను ఈ మ్యూజియం ద్వారా తెలిపేవారు. దీంతో విద్యార్థులు తెలియ‌ని విష‌యాలు తెలుసుకునే వారు.. న‌గ‌ర న‌డి బొడ్డున ఉండ‌డంతో ఎప్పుడు జనంతో  నిండి ఉండేది. అయితే 2015 నుంచి ఈ మ్యూజియం పూర్తిగా ముసుగు వేసింది. భవనం శిథిలావస్థకు చేరిందంటూ మ్యూజియంను ఏడేళ్ల‌లుగా మూసేశారు. నాటి నుంచి నేటి వరకు అపురూప శిల్పాలు, అరుదైన శాసనాలను చూసే అవకాశమే లేకుండా పోయింది. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఏడేళ్లుగా మ్యూజియంను సందర్శించి అవకాశం జిల్లాకు చెందిన విద్యార్థులు, ప్రజలకు దక్కడం లేదు.


అసలు మ్యూజియంలో పురాతన వస్తువులు, గ్రంథాలు, శాసనాలు ఉన్నాయా లేవా అన్న అనుమానాలు కలుగుతున్నాయ్. అసలే జిల్లాలో పర్యాటక ప్రదేశాలు తక్కువ. ఉన్నవాటిని కూడా ఉపయోగించుకోలేక పోవటం బాధాకరం అంటున్నారు స్థానికులు. చరిత్రను తెలిపే ఇలాంటి వాటికి పురావస్తు శాఖ పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు వస్తున్నాయ్. ఇకనైనా అధికారులు.. ప్ర‌జా ప్ర‌తినిధులు మ్యూజియంను తెరిపించాలని కోరుతున్నారు స్థానిక ప్ర‌జ‌లు. 


ఆ ఊరిలో తొలి మొక్కులు గాంధీజీకే- అనాధిగా వస్తున్న ఆచారం


గాంధీజి అంటే ఇష్టపడని వారు ఉండరు. కానీ బాపూజీ నీ దేవునితో సమానంగా భావించి నిత్య పూజలు జరిపే గ్రామం ఒకటి ఉంది. గాంధీజి అంటే ఆ గ్రామస్తులకు ఎంతో ఇష్టం. స్వాతంత్ర భారతం కోసం ఆయన చేసిన త్యాగాలు, ఆయన చూపిన మార్గాలు ఆ గ్రామస్తులను ఎంతగానో ప్రభావితం చేశాయి. అందుకే తరతరాలుగా బాపూజీ నీ దేవునితో సమానంగా కొలుస్తారు ఆ ఊరి ప్రజలు. కేవలం గాంధీ జయంతి నాడో, స్వాతంత్ర దినోత్సవం రోజో గాంధీజీ సేవలను స్మరించుకుని ఊరుకోరు. ప్రతి నిత్యం గాంధీజీనీ తలుచుకుంటూ ప్రత్యేక పూజలు చేస్తారు. ఊర్లో ఏ శుభకార్యం ఉన్నా, పండగలు ఉన్న బాపూజీకే తొలిపూజలు చేయటం ఈ ఊరి ప్రత్యేకత.






 

గాంధీజీకి పూజలు చేసిన తరువాతనే దేవతలకు పూజ చేసి శుభకార్యాలు ప్రారంభిస్తారు. తరతరాలుగా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల అలవాట్లు ఆచారాలు మారుతున్నాయ్. టెక్నాలజీతో పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో సంప్రదాయాలు మరుగున పడుతున్నాయ్. కానీ ఆ గ్రామం మాత్రం అనాధిగా వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఓ మహాత్ముడికి తొలి పూజ చేయనిదే ఆ గ్రామంలో ఏ శుభకార్యం జరగదు. 

 

నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలోని నర్సింగ్ పూర్ గ్రామస్తులు అనాధిగా వస్తున్న ఆచారాన్ని ఫాలో అవుతున్నారు. అందరూ అక్టోబర్ 2 వచ్చిందంటే గ్రామాల్లో గాంధీ జయంతి సంబరాలు ఘనంగా జరుపుతారు. కానీ నర్సింగ్ పూర్ గ్రామంలో మాత్రం ఏ శుభకార్యం జరిగినా గాంధీజీకి పూజలు చేయటం అనావాయితీగా వస్తోంది. నర్సింగ్ పూర్ లో నర్సింహస్వామి ఆలయం ఉంటుంది. అందుకే ఈ గ్రామానికి నర్సింగ్ పూర్ అని పేరు వచ్చింది. ఆ గ్రామంలోని నర్సింహ స్వామికి పూజలు చేసే గ్రామస్థులు ఊళ్లో ఏ శుభకార్యం జరిగినా తొలి దైవంగా మహాత్మా గాంధీని కొలుస్తారు.





మహాత్మా గాంధీని ఈ గ్రామస్థులు ఏ శుభకార్యం జరిగినా ఎందుకు ఆయన్ను పూజిస్తారు. ఈ అఛారం ఎలా వచ్చిందన్న విషయాలు చాలా ఆసక్తి కలిగిస్తాయ్. ఈ గ్రామంలోని చావడిలో 1961 గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు భూమిపూజ చేశారు. అలా చేస్తున్న సమయంలో ఆ గ్రామంలోని ఓ వ్యక్తికి కొడుకు పుట్టాడు. భూమిపూజ చేస్తున్న సమయంలో బాబు పట్టడంతో గ్రామస్థులంతా సంతోషించారు. ఇది శుభ పరిణామంగా భావించిన గ్రామస్థులు అనాటి నుంచి ఊళ్లో ఏ శుభకార్యం అంటే ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ చేసుకున్నా... ఫస్ట్ గాంధీజీ విగ్రహానికి పూల మాల వేసి కొబ్బరికాయ కొట్టాల్సిందే. అయితే భూమి పూజ రోజు పుట్టిన చిన్నారికి గ్రామస్థులంతా కలిసి మహాత్మాగాంధీ అని పేరు పెట్టారు. ఎక్కడా లేని విధంగా గాంధీజీని దైవంగా భావిస్తున్నారు నర్సింగ్ పూర్ గ్రామస్థులు. ఊళ్లో పెళ్లిళ్లైనా ... పేరంటాళ్లైనా... ఏ పండగైనా ... ఫస్ట్ గాంధీజీకి పూజలు చేస్తామని చెబుతున్నారు గ్రామస్థులు..


చూసేవారికి కాస్త ఆశ్చర్యం కలిగినా... నర్సింగ్ పూర్ గ్రామస్థులు అనాధిగా వస్తున్న ఆచారాన్ని మాత్రం తూచాతప్పకుండా పాటిస్తున్నారు. దేశవ్యాప్తంగా గాంధీ జయంతి రోజు మహాత్మున్ని అందరూ స్మరించుకుంటారు. కానీ ఈ గ్రామస్థులు మాత్రం నిత్యం ఈ మహాత్మునికి పూజలు నిర్వహించుకుంటున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు పోరాడిన గాంధీజీని నర్సింగ్ పూర్ గ్రామస్థులు దైవంతో సమానంగా ఆరాధిస్తారు.