నిజామాబాద్ జిల్లా బీజేపీలో అధిపత్య పోరు రసవత్తరంగా మారుతోంది. ఎన్నికల ముందు జిల్లాలో బీజేపీ పార్టీ పరిస్థితి వేరు. ధర్మపురి అర్వింద్ ఎంపీగా గెలిచిన తర్వాత ఇందూరు బీజేపీలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఎంపీ అర్వింద్ పార్టీలోకి రాకముందు మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ పార్టీ పెద్దదిక్కుగా ఉండేవారు. ధర్మపురి అర్వింద్ బీజేపీలోకి ఎంట్రీ తర్వాత పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. యెండల లక్ష్మి నారాయణ వర్సెస్ ధర్మపురి అర్వింద్ గా మారిపోయిందంటూ పార్టీ శ్రేణులు బాహటంగానే చెప్పుకుంటున్నాయి. యెండల లక్ష్మినారాయణ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే జిల్లాలో ఎంపీ అర్వింద్ పార్టీ కార్యక్రమాలు చేస్తే యెండల అతని వర్గీయులు అందులో ఉండరని... అలాగే యెండల పార్టీ కార్యక్రమాలు చేపడితే అర్వింద్ కనిపించరనేది పార్టీలో చర్చ. ఢిల్లీ అధిష్టానం ఓవైపు పార్టీ బలోపేతం కృషిచేస్తోంటే జిల్లాలో నేతల మధ్య అధిపత్య పోరు పీక్ స్థాయికి వెళ్లిందంటున్నారు. 


అరవింద్ అనుచరులకే అసెంబ్లీ ఇంఛార్జుల పగ్గాలు


తాజాగా నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఇంఛార్జులుగా ఎంపీ అర్వింద్ అనుచరులకే ఇప్పించుకున్నారంటూ... జిల్లా బీజేపీలో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. యెండల లక్ష్మినారాయణ అనుచరులకు ఎవరికీ అసెంబ్లీ ఇంఛార్జీల పోస్టు రాలేదని ఆయన వర్గీయులు అంటున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్ , బోధన్, ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల్ నియోజకవర్గాలు వస్తాయి. ఆయా నియోజకవర్గాల అసెంబ్లీ ఇంఛార్జులుగా అర్వింద్ కోరుకున్న వారికే పదవులు దక్కాయన్నది యెండల వర్గంలో చర్చకు దారితీసింది. యెండల అనుచరులకు ఏ ఒక్కరికి కూడా అసెంబ్లీ ఇంఛార్జీ పదవి దక్కకపోవటం ఆయన వర్గీయుల్లో అసంతృప్తి నెలకొందన్న వార్తలు వినిపిస్తున్నాయి. 


త్వరలో జిల్లా అధ్యక్షుడి మార్పు 


జిల్లా బీజేపీలో వర్గ విభేధాలు తారా స్థాయికి చేరుతున్నాయి. ఓ వైపు నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలో బీజేపీ 28 మంది కార్పోరేటర్లను గెలుచుకుంది. గతంలో ఎప్పుడూ ఈ సంఖ్య ఆ పార్టీకి రాలేదు. అయితే జిల్లా నేతల మధ్య సఖ్యత కొరవడటంతో ఇప్పటికే 11 మంది కార్పొరేటర్లు టీఆర్ఎస్ లో చేరిపోయారు. మరికొంత మంది కార్పొరేటర్లు కూడా పార్టీ వీడుతారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఎంపీ అర్వింద్ కు మొదట్నుంచి అండగా ఉంటూ వస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మినారాయణ సైతం ప్రస్తుతం యెండల పంచన చేరారన్న ప్రచారం జరుగుతోంది. అయితే త్వరలో బీజేపీ అధ్యక్ష పదవి మార్పు ఉంటుందని చర్చ జరుగుతోంది. మరోసారి బస్వ లక్ష్మినర్సయ్యకు అవకాశం ఇవ్వరన్న చర్చ జోరుగా సాగుతోంది. జిల్లా అధ్యక్ష పదవి సైతం ఎంపీ అర్వింద్ కు సన్నిహితుడికి వస్తుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అర్వింద్ గత ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో బస్వ పూర్తిగా అర్వింద్ గెలుపుకోసం కష్టపడ్డారని పార్టీ నేతలు చెప్పుకుంటారు. అలాంటిది ప్రస్తుతం బస్వ కూడా ఎంపీ అర్వింద్ తో అంటీ ముట్టనట్లు ఉంటున్నారన్న చర్చ పార్జీ వర్గాల్లో జరుగుతోంది. అయితే బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి మార్పు జరిగినట్లైతే గతంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా చేసిన పల్లె గంగారెడ్డికి బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. పల్లె గంగారెడ్డి అర్వింద్ తో సఖ్యతగా ఉంటున్నారని... గతంలో అధ్యక్షపదవి చేశారు. పార్టీ శ్రేణులతో మంచి సంబంధాలు ఉన్నాయన్న కోణంలో అర్వింద్ పల్లె వైపు మొగ్గు చూపుతారన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ బస్వ లక్ష్మీనర్సయ్యకు మళ్లీ బీజేపీ అధ్యక్షపదవి ఇవ్వకుంటే ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం సైతం జోరుగా సాగుతోంది. దీంతో ఇటు బస్వా లక్ష్మినర్సయ్య ఇటీవల కాలంలో యెండల లక్ష్మినారాయణతో క్లోజ్ గా  మూవ్ అవుతున్నట్లు పార్టీ క్యాడర్ చెప్పుకుంటోంది. మొత్తానికైతే ఇందూరు బీజేపీలో నేతల మధ్య ఆధిపత్య పోరు రసవత్తరంగా మారుతోందని చెప్పవచ్చు.