Fact Check Telangana :   తెలంగాణలో కేసీార్ ప్రారంభించిన మెడికల్ కాలేజీలు అన్నీ కేంద్రం ఇచ్చినవేనని జర్నలిస్ట్ సాయి అనే వ్యక్తి యూట్యూబ్‌లో చేసిన వీడియోపై తెలంగాణ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. జర్నలిస్ట్ సాయి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపింది. ఆ వీడియోలో మెడికల్ కాలేజీలను కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించినట్లుగా చెప్పారని.. కానీ ఒక్క పైసా కూడా కేంద్రం ఇవ్వలేదని.. పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ నిధులతోనే నిర్మించినట్లుగా ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. 





దేశంలోని వివిధ రాష్ట్రాలకు 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం, తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీని కూడా కేటాయించలేదు. అయినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు 12 మెడికల్ కాలేజీలు స్వంత నిధులతో ఏర్పాటు చేసింది. వీటికి కేంద్రప్రభుత్వం ఏలాంటి నిధులు మంజూరు చేయలేదని డాక్యుమెంట్లను ఫ్యాక్ట్ చెక్ విడుదల చేసింది. 



తెలంగాణలో 8 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏమీ లేనప్పటికీ, కేవలం అనుమతులు మంజూరు చేయడాన్ని, కేంద్ర ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినట్టు అర్థం వచ్చేలా తప్పుదోవ పట్టించే విధంగా వీడియోలు చేయవద్దని జర్నలిస్ట్ సాయికి ఫ్యాక్ట్ చెక్ సూచించింది.


మూడు రోజుల కిందట కేసీఆర్ ఎనిమిది మెడికల్ కాలేజీల్లో తరగతులను వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో కాలేజీల సంఖ్య తెలంగాణాలో 17కు పెరిగాయి.  వచ్చే ఏడాది 9, ఆ తర్వాత వచ్చే ఏడాది మరో 8 మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటుచేయనున్నది. దీంతో జిల్లాకో మెడికల్‌ కాలేజీ కల నెరవేరనున్నది. కొత్త కాలేజీలతో రాష్ట్రంలో అదనంగా 1,150 సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి. 2014లో 850గా ఉన్న ఎంబీబీఎస్‌ సీట్లు ఇప్పుడు 2,790 కి పెరిగాయి. పీజీ సీట్లు 531 నుండి 1122 కు పెరిగాయి. సూపర్‌ స్పెషాలిటీ సీట్లు 76 నుండి 152 కు పెరిగాయి. కొత్త మెడిక‌ల్ కాలేజీల‌తో ప్రజ‌ల‌కు నాణ్యమైన వైద్యం అందనుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. 


 ఈ మెడిక‌ల్ కాలేజీల ద్వారా నాణ్యమైనవైద్య సేవలు ప్రజ‌లకు అందనున్నాయి. ఇందులో మొత్తం 35 వైద్య విభాగాలు సేవ‌లందిస్తాయి. అత్యాధునిక వైద్య ప‌రిక‌రాలు, ల్యాబ్స్ ఉంటాయి. 449 మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారు. 600 పైగా పారామెడిక‌ల్ సిబ్బంది సేవలు అందించనున్నారు. అయితే పెద్ద పెద్ద వ్యాధులు వచ్చిన ప్రతిసారి హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరంలేకుండా .... ప్రజలు ఇకనుంచి తమ సమీపంలోని ఈ మెడికల్ కాలేజీలకు వెళ్లి నాణ్యమైన వైద్యం పొందే అవకాశం ఉంది. మరోవైపు కొత్త మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటుతో రాష్ట్రంలోని ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 8 ఏళ్లలో మూడు రెట్లకుపైగా పెరిగాయి. దీంతో రాష్ట్ర విద్యార్థులు స్థానికంగా చదువుకునే అవకాశాలు లభించనుంది. అయితే వీటి క్రెడిట్ కేంద్రానిదేనని.. కేంద్రం ఇవ్వకపోతే కాలేజీలు ఎక్కడి నుంచి వస్తాయని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.