Nizamabad DCCB Chairman: నిజామాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నామినేటెడ్ పోస్టులను రద్దు చేసింది. కార్పొరేషన్ పదవులను సైతం సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్కార్ రద్దు చేసింది, ఇటీవల 37 కార్పొరేషన్లకు హడావుడిగా చైర్మన్లకు సైతం నియమించింది. అయితే బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించిన మరికొందరు ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు పోచారం భాస్కర్ రెడ్డి (Pocharam Bhakar Reddy) తన పదవికి రాజీనామా చేశారు. 




నిజామాబాద్ జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఛైర్మన్, డైరెక్టర్ పదవికి పోచారం భాస్కర్ రెడ్డి రాజీనామా చేశారు. తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని కో ఆపరేటివ్ విభాగం కమిషనర్‌ను కోరారు. ఈ మేరకు కో ఆపరేటివ్ శాఖ కమిషనర్ కు తన రాజీనామా లేఖ పంపించారు. తనను నమ్మి డీసీసీబీ బ్యాంక్ చైర్మెన్‌గా బాధ్యతలు అప్పగించిన కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. పదవులు వస్తుంటాయి, పోతుంటాయి నాకు పార్టీ కంటే పదవి గొప్పది కాదని అభిప్రాయపడ్డారు.