Nizamabad News: తండ్రి అనే పదానికి మచ్చ తెచ్చాడో మనిషి. 60 వేల రూపాయలకు ఆశపడి తన 13 ఏళ్ల కూతురిని 45 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. అప్పటికే ఆ వ్యక్తి పెళ్లి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా చిన్నారి జీవితం గురించి ఏమాత్రం ఆలోచించకుండా చేసిన పని చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు. 


అసలేం జరిగిందంటే..?


నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్ గ్రామానికి చెందిన అబ్బాపూర్(బి) తండాలో దారుణం జరిగింది. పోలీసులు, అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన ఓ వ్యక్తి తన 13 ఏళ్ల కూతురుని ఫకీరాబాద్ గ్రామానికి చెందిన 45 ఏళ్ల మలావాత్ సాయెబ్ రావుకు ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే అతడికి అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ 60 వేలకు ఆశపడిని ఆ తండ్రి ఇదంతా చేసినట్లు తెలుస్తోంది. వివాహానికి ముందుగానే సాయెబ్ రావు వద్ద నుంచి సదరు వ్యక్తి వేల రూపాయలు తీసుకున్నాడు. శుక్రవారం రోజు అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి జరిపించేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న తండా యువకులు బాలిక తండ్రిని నిలదీశారు. ఈక్రమంలోనే బాలికను తీసుకొని పెళ్లి కొడుకు పరారయ్యాడు.


వెంటనే తండావాసులు హెల్ప్ లైన్ ద్వారా పోలీసులకు, ఐసీడీఎస్ కు సమాచారం ఇచ్చారు. దీంతో డీసీపీఓ చైతన్య కుమార్, చైల్డ్ హెల్ప్ లైన్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ జ్యోత్స్నదేవి, ఐపీడీఎస్ సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి గ్రామానికి వెళ్లి విచారించారు. బాలిక తండ్రి అందుబాటులో లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయెబ్ రావుతో పాటు పెళ్లికి సహకరించిన పెద్దలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనపై జీపీ కార్యదర్శి షేక్ అహ్మద్ పాషా ఫిర్యాదు చేశారు. 


రోజుకి సగటున మూడు చొప్పున 


తెలంగాణలో బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడటం లేదు. ప్రభుత్వం, అధికారులు ఎన్ని కట్టుదిట్ట చర్యలు తీసుకుంటున్నా బాల్య వివాహాలు ఆగడం లేదు. బాలికల ఉన్నత విద్య కోసం ప్రభుత్వం గురుకులాలు ఏర్పాటు చేసినా, కల్యాణలక్ష్మి ఇస్తున్నా కొన్ని చోట్ల గుట్టుచప్పుడు కాకుండా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. కరోనాతో ఆర్థిక ఇబ్బందులతో తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్లిళ్లు చేసి, బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. రాష్ట్రంలో రోజుకి సగటున మూడు చొప్పున రెండేళ్ల వ్యవధిలో 2,399 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. మహిళల కనీస వివాహ వయస్సు 21 ఏళ్లు చేసేందుకు కేంద్రం చర్యలు చేపడుతుంది. అయినా రాష్ట్రంలో 18 ఏళ్లలోపు వారికి బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి.


చట్టం పూర్తి స్థాయిలో అమలు అవుతుందా?  


రాష్ట్రంలో బాల్యవివాహాల నిరోధక చట్టం-2006 పూర్తి స్థాయిలో అమలు కావడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. బాల్య వివాహాలను అడ్డుకునేందుకు చైల్డ్‌లైన్‌ కమిటీలు, జిల్లా బాలల సంరక్షణ యూనిట్లు, బాలల సంరక్షణ కమిటీలకు క్షేత్ర స్థాయిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి బాధ్యుడిగా ఉంటారు. జిల్లా, మండల, గ్రామీణ స్థాయిలో బాల్య వివాహాల నిరోధక కమిటీలు ఏర్పాటు చేసినప్పటికీ బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచి, గ్రామ కార్యదర్శి, అంగన్‌వాడీ సిబ్బంది కుటుంబ సభ్యులు దాడికి పాల్పడతారన్న భయంతో వెనకడుగు వేస్తున్నారు. బాల్య వివాహాలపై అంగన్‌వాడీ సిబ్బంది ద్వారా లేదా మహిళా సహాయ కేంద్రం 181, పోలీసు హెల్ప్‌లైన్‌ నంబరు 100 ద్వారా ఎక్కువ మంది ఫిర్యాదు చేస్తున్నారు.