BSP Telangana Chief RS Praveen Kumar: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లోని సిర్పూర్ ప్రాంతాన్ని ఆంధ్ర పాలకుల దోపిడీ నుండి విముక్తి కల్పించి తెలంగాణలో కలుపుతామన్నారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దోపిడీ, దందాలు ఆగాలంటే ప్రతి ఒక్కరూ బీఎస్పీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తనను గెలిపిస్తే ఆంధ్ర పెత్తందారుల పాలన నుంచి విముక్తి చేసి ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. 
అనంతరం కాగజ్ నగర్ పట్టణంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. సిర్పూర్ ప్రాంతాన్ని ఎమ్మెల్యే ఆయన అనుచరులు, కాంట్రాక్టర్లు, కబ్జాదారులు,గుండాగిరి చేస్తూ కబలిస్తున్నారన్నారు. బిల్లులు తీసుకుంటున్నారు కానీ పనులు చేయడం లేదని అందవేల్లి బ్రిడ్జి నిర్మించి ప్రారంభం కూడా కాకుండానే కూలిందని తెలిపారు. కాగజ్ నగర్ పేపర్ మిల్లుకు 13 రకాల రాయితీలిచ్చి లాభాలన్ని మింగుతున్నారని విమర్శించారు. పొరుగు రాష్ట్రానికి చెందిన వారికి అధిక జీతమిచ్చి స్థానికులకు తక్కువ జీతాలిస్తున్నారని మండిపడ్డారు. పేపర్ మిల్ యాజమాన్యంతో ఎమ్మెల్యే కోనప్ప కుమ్మక్కయ్యారని విమర్శించారు.
ఎమ్మెల్యే అనుచరులు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి అధికారులపై దాడులు చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ ప్రాంతంలోని నోటిఫైడ్ భూములు, ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందడం లేదన్నారు. ఇప్పటికీ ఇక్కడి ప్రజలు చెలిమెలు తోడుకొని నీరు తెచ్చుకుంటున్నారని తెలిపారు. ఇక్కడి ప్రాంతాలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళిత బంధు, ఇతర పథకాలేవీ అందడం లేదని తెలిపారు. గతంలో బిఎస్పి పార్టీ నుండి కోనప్పను గెలిపిస్తే మహనీయులను, బహుజనులను మోసం చేసి దొరలతో కలిశారని విమర్శించారు.


పోడు భూముల పట్టాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది ఆదివాసీలు దరఖాస్తులు చేస్తే కేవలం 1.5 లక్షల మందికి మాత్రమే ప్రభుత్వం పట్టాలిచ్చిందని అన్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఏజెన్సీ ఏరియాలో నివసించే బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ ప్రజలందరికీ పొడు పట్టాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఆదివాసి బిడ్డలు అత్యంత దుర్భరజీవితాలు గడుపుతున్నారన్న ఆయన దళిత బంధు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. 


బీజేపీ ప్రభుత్వానికి చెందిన నాయకులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో, ఆదివాసులపై మూత్ర విసర్జన చేశారని, అందుకే ఆదివాసులు ఆ పార్టీకి ఓటేయొద్దన్నారు. ముస్లింలు క్రైస్తవులు, పేదల అభిప్రాయాలను పట్టించుకోకుండా వారిని గౌరవించకుండా భిన్నత్వాన్ని ధ్వంసం చేస్తూ ఉమ్మడి పౌరస్మౄతి చట్టాన్ని తెస్తున్నారని అందుకే మైనారిటీలు, బహుజనులందరం కలిసి బీజేపీని తెలంగాణకు రానివ్వద్దని పిలుపునిచ్చారు. మణిపూర్ లో కూకి జాతికి చెందిన క్రైస్తవులను 220 మందిని బిజెపి పొట్టనపెట్టుకున్నదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలపైనే ఉపా చట్టం పెట్టి బెదిరిస్తుందని,ఆధిపత్య వర్గాలపై ఎందుకు ఈ కేసును నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సిర్పూర్ ప్రాంతంలోని మాలి కులస్థులను ఎస్టి జాబితాలో కలుపుతామని హామీ ఇచ్చి మోసం చేశారని గుర్తుచేశారు. కానీ బహుజన రాజ్యంలో ఖచ్చితంగా మాలిలను ఎస్టి జాబితాలో కలుపుతామని హామి ఇచ్చారు.


బహుజన్ సమాజ్ పార్టీ గెలిచిన వెంటనే ఈ నియోజకవర్గాన్ని దేశంలో అత్యుత్తమ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అదేవిధంగా కోనప్ప ఆగడాలపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. కేసీఆర్, ఎమ్మెల్యే కోనప్ప కలిసి ఈ ప్రాంతాన్ని దోచుకున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం 1951లో బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజీనామా చేసిన పత్రాన్ని మాయం చేసిందని, అలాంటి పార్టీకి బీఆర్ఎస్ సహకరిస్తుందన్నారు. అందుకే ఈ రెండు పార్టీలను ఓడించాలని ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సిడం గణపతి, నియోజకవర్గ అధ్యక్షులు రాంప్రసాద్, నియోజకవర్గ ఇంచార్జి అర్షద్ హుస్సేన్, దుర్గం ప్రవీణ్, సోయం చిన్నయ్య, మహిళా నాయకురాలు లీలా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial