నిజామాబాద్ జిల్లాలో మరోసారి పసుపు బోర్డు వ్యవహారం తెరపైకి వచ్చింది. తాజాగా దీని గురించి పార్లమెంటులో ఈ విషయం గురించి ప్రస్తావన రావడంతో నిజామాబాద్ రైతులు కదం తొక్కారు. ఈ సారి వినూత్నంగా నిరసనకు దిగారు. పసుపు బోర్డుకు పంగనామం పెట్టిందని ఆరోపిస్తూ నిజామాబాద్ రైతులు కన్నెర్ర చేశారు. పసుపు బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ పార్లమెంటులో ప్రకటించిన తర్వాత రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పార్లమెంటు వేదికగా మోసం మరోసారి బయటపడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకు నిరసనగా స్థానిక బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ నిర్వాకాన్ని ఎండగట్టారు. 


పసుపు రంగులో ఫ్లెక్సీలు
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడా “పసుపు బోర్డు.. ఇది మా ఎంపీ గారు తెచ్చిన పసుపు బోర్డు” అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పసుపు రంగులోనే ఉన్న ఫ్లెక్సీలను రైతులు కట్టారు. పసుపు బోర్డు తెస్తానని చెప్పి తమను స్థానిక ఎంపీ అర్వింద్ మోసం చేశారని రైతులు ఆరోపిస్తున్నారు.


గత 2019 పార్లమెంటు ఎన్నికల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్న ధర్మపురి అర్వింద్ తమను మోసం చేశారని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్న సంగతి తెలిసిందే. బాండ్ పేపరు రాసిచ్చినా ఇప్పటికీ పసుపు బోర్డును సాధించకపోవడమే కాకుండా బోర్డును ఏర్పాటు చేయలేమని కేంద్రం చెప్పినా ఏమీ పట్టనట్టు ఉండడం పట్ల రైతులు విస్మయం చెందుతున్నారు. పసుపు బోర్డు తీసుకురాకపోతే రాజీనామా చేస్తానని అర్వింద్ ఎన్నికల సమయంలో తెలిపారని, మరి నాలుగున్నర సంవత్సరాలు గడిచినా బోర్డు సాధించలేకపోతే ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్రాన్ని ఒప్పించలేని బీజేపీ నాయకులు ప్రజల్లో తిరిగే నైతిక హక్కు లేదని అంటున్నారు. బీజేపీ అగ్ర నేతలు కేంద్రం మంత్రి రాజ్ నాథ్ సింగ్, రామ్ మాధవ్ వంటి వారు కూడా గత ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని మోసపూరిత హామీ ఇచ్చారని గుర్తు చేశారు.


పసుపు బోర్డు కోసం గత కొంత కాలంగా రైతులు నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఎన్నోసార్లు ధర్మపురి అర్వింద్ ను అడ్డుకున్నారు. ఆయన ఇంటి ఎదుట ఇసుక కుప్పలు పోసి మరీ నిరసన తెలియజేశారు. తమను ఇంకెంత కాలం మోసం చేస్తారని రైతులు నిలదీశారు. ఇక నుంచి పసుపు బోర్డు కోసం ఆందోళనలను ఉదృతం చేస్తామని, ధర్మపురి అర్వింద్ ను ఇంకా గట్టిగా నిలదీస్తామని రైతులు తేల్చి చెబుతున్నారు.