మంచిర్యాల నుంచి భైంసా వెలుతున్న బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళతో పాటు ఓ ఆదివాసీకి చెందిన ఇద్దరి బ్యాగులు తారుమారయ్యాయి. బ్యాగుల రంగు ఒకేలా ఉండటంతో బస్సు దిగే సమయంలో వారి బ్యాగులు బదిలీ అయ్యాయి. కడెం బస్టాండు లో దిగిన ఆదివాసీ కుటుంబం ఒక్కసారిగా బ్యాగును గమనించి.. ఇది మన బ్యాగు కాదని బస్సులో తారుమారయ్యాయని బ్యాగును విప్పి పరిశీలించారు. బ్యాగులో ఇతర దుస్తులు, కొంత బంగారం నగదు ఉండటంతో ఉలిక్కిపడ్డారు. వెంటనే కడెం పోలీస్ స్టేషన్ కి వెళ్ళి బ్యాగును అప్పగించారు. అంతలోనే కాసేపటికి బ్యాగు పోగొట్టుకున్న మహిళ కడెం పోలిస్ స్టేషన్ కు రాగా.. ఇద్దరు ఒకే చోట ఉండటంతో బ్యాగును చూసుకొని అందులోని బంగారం నగదు అలాగే ఉండటంతో ఆ మహిళ ఊపిరి పీల్చుకుంది. నిజాయితీ చాటుకున్న ఆదివాసీని, ఆ మహిళతో పాటు పోలీసులు అభినందించారు. 


అసలేం జరిగిందంటే..
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన మెస్రం లక్ష్మణ్..  ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ లో నూతన నాగోబా విగ్రహ ప్రతిష్ఠాపన, ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా వెళ్ళి నాగోబాను దర్శించుకొని తిరిగి తన స్వ గ్రామానికి బయలుదేరాడు. ఇంద్రవెల్లి నుండి బస్సులో జన్నారం మండలంలోని ఇందన్ పల్లి చౌరస్తా వద్దకు చేరుకొని అక్కడ నుండి భైంసా వెలుతున్న బస్సులో ప్రయాణిస్తున్నాడు. 
అదే సమయంలో నిర్మల్ జిల్లాలోని పెంబీ మండల కేంద్రానికి చెందిన జ్యోతి జన్నారం మండలం మురిమడుగు నుండి తన స్వ గ్రామానికి బయలుదేరేందుకు ఇందన్ పల్లి చౌరస్తా వద్దకు చేరుకుంది. తాను అదే మంచిర్యాల నుండి బైంసా వెలుతున్న బస్సులో ప్రయాణిస్తుండగా.. బస్సులో రద్దీ బాగా ఉండటంతో ముందు వైపున బ్యాగులను పెట్టారు. ఇరువురి బ్యాగులు ఒకే రంగులో ఉండడంతో ఇరువురు వేరువేరు చోట్ల బస్సు దిగారు. మెస్రం లక్ష్మణ్ ముందుగా కడెంలో బస్సు దిగగా.. బస్సు వెళ్లిపోయిన కొంతసేపటికి లక్ష్మణ్ బ్యాగును గమనించి బ్యాగ్ ఓపెన్ చేసి చూసేసరికి 7 తులాల బంగారం, రూ.3,500 రూపాయలు నగదు బట్టలను చూసి తమ బ్యాగు కాదని గుర్తించి వెంటనే లక్ష్మణ్ కడెం పోలీస్ స్టేషన్ కి వెళ్ళి బ్యాగును అప్పగించాడు. 


మెస్రం లక్ష్మణ్ (బ్యాగు ఇచ్చిన వ్యక్తి) - జ్యోతి (నగల బ్యాగు పోగొట్టుకున్న మహిళ)
బస్సులో ప్రయాణిస్తున్న జ్యోతి సత్తెనపల్లి వద్ద బస్సు దిగే సమయంలో ఇది తన బ్యాగు కాదంటు కండక్టర్ ను అడిగేసరికి కడెంలో కొందరు దిగారని అందులో సంబంధిత రంగు బ్యాగు వాళ్ళు ఉన్నట్టు తెలపడంతో బాధిత మహిళా కడెం బస్టాండ్ ప్రాంతంలో చూసి.. అక్కడ నుండి కడెం పోలీస్ స్టేషన్ కి వెళ్లి విషయం తెలపడంతో అప్పటికీ వారు ఆ బ్యాగ్ తో పోలీస్ స్టేషన్ లో ఉండడంతో ఇరువురి బాదలు తెలుసుకొని పోలీసులు ఆ బ్యాగులో బంగారం నగదు అన్ని ఉన్నాయా లేవా అని పరిశీలించుకొమని జ్యోతికి పోలీసుల సమక్షంలో బ్యాగును అప్పగించారు. నిజాయితీతో బంగారం నగదు ఉన్న బ్యాగును అప్పగించిన ఆదివాసీ మెస్రం లక్ష్మణ్ ను జ్యోతి తో పాటు పోలీసులు అభినందించారు.