Asifabad News: కూతుళ్లు లేకపోవడంతో కోడళ్లనే కుమార్తెలుగా భావించాడు. చాలా బాగా చూసుకున్నాడు. ఈ క్రమంలోనే కోడలు మృతి వార్త ఉన్న ఓ మామ.. గుండె పోటుతో మృతి చెందాడు. ఒకే రోజు ఇంట్లో ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


ఆస్పత్రికి వెళ్తుండగా తీవ్రరక్తస్రావం


కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలం తలోడి గ్రామానికి చెందిన జాడి లాగాన్ బాయి, జులాజీ దంపతులకు ఇద్దరు పిల్లలు. వీరిలో పెద్ద కొడుకు గోపాల్ భార్య పేరు లలిత. గోపాల్ కు ఏడేళ్ల కొడుకు విఠల్ ఉన్నాడు. లలిత ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి. గతంలో ఈమెకు మూడు సార్లు అబార్షన్ అయింది. ఈ క్రమంలోనే గత శనివారం లలితను మంచిర్యాలలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. ఇంతలో కాగజ్‌నగర్‌ కు వెళ్లే సరికి లలితకు రక్త స్రావం కావడంతో ఆమెను కాగజ్‌నగర్‌ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ లలితను పరీక్షించిన వైద్యులు... ఆమె గర్భంలో ఉన్న నాలుగు నెలల శిశువు మృతి చెందినట్లు గుర్తించి తొలగించారు.


చికిత్స పొందతూ మృతి


ఆ తర్వాత లలితకు ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు గర్భసంచి తొలగించారు. అయితే ఆస్పత్రిలో చూపించుకునేందుకు మాత్రమే వచ్చిన భర్త.. డబ్బులు తీసుకురావడానికి ఇంటికి వెళ్లాడు. ఇంతలోనే మంగళ వారం ఉదయం భార్య లలిత ఆరోగ్య పరిస్థితి విషమంగా మారినట్లు గోపాల్ కు బంధువులు సమాచారం ఇచ్చారు. దీంతో హుటా హుటినా ఆస్పత్రికి వెళ్లిన గోపాల్ కు.. మెరుగైన చికిత్స కోసం లలితను మంచిర్యాల ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. వెంటనే ఆయన అంబులెన్స్ లో మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే అక్కడికి చేరేలోపే లలిత ప్రాణాలు కోల్పోయింది. ఇదే విషయాన్ని వైద్యులు గోపాల్ కు తెలిపారు. వెంటనే ఆయన ఇంటికి ఫోన్ చేసి లలిత మరణ వార్తను కుటుంబ సభ్యులకు తెలియ జేశాడు. 


కోడలు మరణ వార్త విని గుండెపోటుతో మామ మృతి


అప్పటికే అనారోగ్యంతో బాధ పడుతున్న 75 ఏళ్ల బాలాజీ.. కోడలు మరణ వార్త విని తట్టుకోలేకపోయాడు. ఒక్కసారిగా గుండెపై చేసువేసుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఒకే రోజు ఇంట్లో ఇద్దరు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాలాజీ మృతి వార్తను గ్రామస్థులు, బంధువులు గోపాల్ కు ఫోన్ చేసి చెప్పారు. కోడలు చనిపోయిందన్న వార్త విని షాక్ కు గురై గుండె పోటుతో చనిపోయాడని గోపాల్ కు చెప్పారు. తండ్రి మరణ వార్త విన్న గోపాల్.. ఆస్పత్రిలోనే కుప్పకూలాడు. భార్య మరణంతో ఇప్పటికే తీవ్ర విషాదంలో మునిగిన గోపాల్ కు తండ్రి మరణా వార్త చెవున పడటంతో గుండెలు పగిలేలా ఏడ్చాడు. తనను, తన కొడుకును అనాథగా వదిలి ఇద్దరూ ఒకే రోజు వెళ్లి పోయారా అని తీవ్రంగా ఆవేదన చెందాడు. అక్కడే ఉన్న బంధు మిత్రులు గోపాల్ ను ఓదార్చడానికి ప్రయత్నించారు. తర్వాత గోపాల్ ను, తన భార్య మృతదేహాన్ని బంధువులు స్వగ్రామానికి తరలించారు. ఇంటి ముందు ఒకవైపు సొంత తండ్రి మృతదేహం, మరో వైపు జీవితాంతం తోడు ఉంటుందనుకుని మధ్యలోనే వదిలి వెళ్లిపోయిన భాగస్వామి మృతదేహాన్ని చూసి తట్టుకోలేక గోపాల్ తీవ్రంగా కన్నీరు పెట్టుకున్నాడు.