కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం సరికాదని మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏఐసీసీ సభ్యుడు మాజీ ఎమ్మెల్సి కొక్కిరాల ప్రేంసాగర్ రావ్ నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడంపై కేంద్ర ప్రభుత్వం తీరుపై కేంద్ర మాజీ మంత్రి విమర్శలు చేశారు. సూరత్ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు 30 రోజుల గడువు ఉన్నప్పటికీ 24 గంటలలో ఆయనపై బీజేపీ ప్రభుత్వం కావాల్సుకొని వేటు వేయడం సరికాదని బలరాం నాయక్ విమర్శించారు. 


రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు కోరినప్పటికీ, సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ను ప్రధానిగా చేశారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించకుండా ఎంతో మంది అడ్డుపడ్డ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమాలోచనలు చేసి తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో సమాచార హక్కు చట్టం పోడు భూములు రుణాల మాఫీ, జాతీయ రహదారులు ఆసుపత్రులు ఏకలవ్య నవోదయ పాఠశాలలు వంటి అభివృద్ధి పనులు చేసి దేశం కోసమే పాటుపడ్డ కుటుంబమని అన్నారు. అలాంటి కుటుంబానికి బీజేపీ ప్రభుత్వం రాజకీయ స్వార్థాల కోసం రాహుల్ గాంధీ పై వేటు వేయడం సరికాదన్నారు. సోనియా గాంధీ మహిళల కోసం 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరితే లాలూ ప్రసాద్ యాదవ్ ఆమె వ్యాఖ్యలపై ఎద్దేవా చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలలో ప్రజల మద్దతుతో అధికారంలోకి వస్తుందన్నారు.


ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యనే: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 
దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు ప్రాణ త్యాగాలు చేస్తే.... స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ సమగ్రతను కాపాడడానికి ఈ దేశాన్ని అభివృద్ధి చేయడానికి ప్రాణాలు అర్పించిన కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ డీసీసీ ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ నాయకత్వంలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ నియంతృత్వ ధోరణితో పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం కాకుండా ఏకం చేయడానికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేశారని దానికి ప్రజల నుంచి వచ్చిన స్పందనను జీర్ణించుకోలేక నరేంద్ర మోదీ.... రాహుల్ గాంధీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో నిరుపేద కుటుంబాలు బాగుపడడానికి కావలసిన ఒక్క పని కూడా చేయలేదు. విదేశాలలో ఉన్న నల్లధనాన్ని దేశానికి తీసుకురావడంలో విఫలం అవ్వడమే కాకుండా బడా వ్యాపారవేత్తలైన అదానీ, అంబానీలకు, లలిత్ మోదీ, నీరవ్ మోదీలకు అండగా నిలిచే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు జీవన్ రెడ్డి. మోదీ అధికారంలోకి రాకముందు రూ.50 వేల కోట్ల పెట్టుబడులతో ఉన్న అదానీ ఇప్పుడు రూ.10 లక్షల కోట్లకు పెరగడానికి మోదీయే కారణమన్నారు.