తెలంగాణలో సంచలనంగా మారిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ కేసులో నిందితుల పెన్‌డ్రైవ్‌లో 15 ప్రశ్న పత్రాలు ఉన్నట్లు సిట్‌ గుర్తించింది. సిట్ గుర్తించిన ప్రశ్నపత్రాల్లో గ్రూప్-1 ప్రిలిమ్స్‌; ఏఈఈ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ పేపర్లు; డీఏవో జనరల్ స్టడీస్, మ్యాథ్స్ పేపర్లు; ఏఈ జనరల్ స్టడీస్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ పేపర్లు; ఏఈ సివిల్, ఎలక్ట్రికల్ పేపర్ 2; టౌన్ ప్లానింగ్ పరీక్ష పేపర్లు ఉన్నాయి. అదేవిధంగా జులైలో జరగాల్సిన జేఎల్‌ ప్రశ్నపత్రాలు నిందితుల పెన్‌డ్రైవ్‌లో లభ్యమయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే 15 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. లక్షల రూపాయల డబ్బు చేతులు మారినట్లు సిట్‌ దర్యాప్తులో వెల్లడైంది.


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో లక్షల్లో డబ్బు చేతులు మారినట్లు ఇప్పటికే సిట్ అధికారుల దర్యాప్తులో తేలడంతో త్వరలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగంలోకి దిగనుంది. ఈ మేరకు కేసు నమోదుకు ఈడీ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో తొలి కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దాన్ని సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 15 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో కొందరిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. గ్రూప్‌-1 పరీక్షలో 100 మార్కులకు పైగా సాధించిన అభ్యర్థులను సైతం విచారిస్తున్నారు. ఈ వ్యవహారంపై నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా నిధుల మళ్లింపునకు సంబంధించి ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనుంది. దీంతోపాటు సైబరాబాద్ పోలీసులు బయటపెట్టిన డేటా లీకేజీపైనా మరో కేసు ఈడీ నమోదు చేసింది.


రాష్ట్రంలో 'గ్రూప్-1' ప్రిలిమ్స్ సహా పలు పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటైన 'సిట్' చేపట్టిన దర్యాప్తులో పలు కీలక ఆధారాలు లభించాయి. టీఎస్‌పీఎస్సీ మొత్తం ఏడు పరీక్షలు నిర్వహించగా వాటిలో అయిదు ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లు నిర్ధారణ అయింది. వీటన్నింటికి సంబంధించిన లావాదేవీల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. కమిషన్ కార్యదర్శి వద్ద పీఏగా పనిచేస్తున్న ప్రవీణ్.. తన స్నేహితురాలు రేణుకకు ఏఈ ప్రశ్నపత్రం ఇచ్చి ప్రతిఫలంగా రూ.10 లక్షలు తీసుకున్నట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది. రేణుక, ఆమె భర్త డాక్యానాయక్‌లు దీన్ని మరో అయిదుగురికి అమ్ముకొని దాదాపు రూ.25 లక్షల వరకూ వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇంకొందరికీ ప్రశ్నపత్రం అమ్ముకొని ఉండవచ్చని భావిస్తున్నారు. గ్రూప్-1 ప్రశ్నపత్రానికి సంబంధించిన లావాదేవీల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ లావాదేవీల గుట్టు రట్టు చేసేందుకే ఈడీ రంగంలోకి దిగుతోంది. ప్రశ్నపత్రాల లీకేజీపై రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ తాజా పరిణామం చోటుచేసుకోనుడడం గమనార్హం.


హవాలా ట్రాన్సాక్షన్స్ జరిగాయా?


పేపర్ లీకేజీ వ్యవహారంపై రంగంలోకి దిగాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) భావిస్తోంది. లక్షల రూపాయలు చేతులు మారినట్టు గుర్తించిన ఈడీ.. అవన్నీ హవాలా మార్గంలో నడిచాయని అనుమానిస్తోంది. ఇప్పటికే పోలీసుల నుంచి పూర్తి వివరాలు సేకరించింది. సిట్ నుంచి FIR తీసుకుని, ECIR నమోదు చేసి, సిట్ దర్యాప్తు జరిపిన పత్రాలను కోర్టు నుంచి తీసుకునే ఆలోచనలో ఈడీ ఉంది. ఈ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా జరిపిందని ఈడీ భావిస్తోంది. జైల్లో వున్న నిందితులను విచారిస్తే ఆర్థిక లావాదేవీలు, హవాలా ట్రాన్సాక్షన్స్ అన్నీ బయట పడతాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు భావిస్తున్నారు.