Ajmera Saketh Kumar: అతను ఎక్కడికీ, ఎలాంటి కోచింగ్ కోసం వెళ్లలేదు. కానీ చదవాలనే తపన, ఎలాగైనా కలెక్టర్ గా నిలవాలన్న ఆశయం అతడిది. అదే అతని అందలం ఎక్కించింది. ఇంట్లోనే ఉండి చదువుకుంటూ ఆలిండియా 35వ ర్యాంకు సాధించాడు. అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఇంత కష్టపడి ర్యాంకు సాధించిన ఈ గిరిజన యువకుడి కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


తల్లిదండ్రులను రోల్ మోడల్ గా తీసుకున్న సంకేత్ కుమార్


మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన సంకేత్ కుమార్ కు చిన్నప్పటి నుంచి చదువుపై అమితమైన ఇష్టం. సంకేత్ తల్లి సవిత ఇస్రోలో ఉద్యోగం చేస్తుండగా.. ఆయన తండ్రి ప్రేమ్ సింగ్ హార్టికల్చర్ డిపార్ట్ మెంట్ లో డిప్యూటీ డైరెక్టర్. అయితే తన అమ్మానాన్నలనే స్ఫూర్తిగా తీసుకున్న సంకేత్.. ఎలాగైనా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని చాలా కష్టపడ్డారు. తల్లిదండ్రులలాగా అందరూ గౌరవించే స్థాయిలో నిలవాలనుకున్నారు. ఈక్రమంలోనే బాగా కష్టపడి చదివాలని నిర్ణయించుకున్నారు. తల్లిదండ్రుల ఉద్యోగ రీత్యా వీళ్లు హైదరాబాద్ లో స్థిర పడ్డారు. అక్కడే భాష్యం పబ్లిక్ స్కూల్ లో 2011లో పదో తరగతి పూర్తి చేశారు. ఫిట్ జేఈఈ సైఫాబాద్ బ్రాంచ్ లో 2013లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. దిల్లీ ఐఐటీలో 2017లో బీటెక్ పట్టా పొందారు. ఆ తర్వాత జపాన్ లో రిసెర్చింగ్ లో ఉద్యోగం కూడా సంపాధించారు. కానీ సంతృప్తి కల్గక... సివిల్స్ సాధించాలని నిర్ణయించుకున్నారు. తల్లిదండ్రులు కూడా అందుకు ఓకే చెప్పడంతో వెంటనే ప్రిపరేషన్ మొదలు పెట్టాశాడు సంకేత్. 


Also Read: నిజామాబాద్ జిల్లా వాసులు ఇద్దరికి సివిల్స్‌లో ర్యాంక్లు- లైన్‌మెన్ కుమారుడికి 200 వ ర్యాంక్


ఒత్తిడిని తగ్గించుకునేందుకు హాకీ, బ్యాడ్మింటన్


అయితే చదువుకునేటప్పుడు కల్గే ఒత్తిడిని తగ్గించుకునేందుకు హాకీ, బ్యాడ్మింటన్ ఆడుతుండేవాడు. అలాగే ఇన్ని గంటలు చదవాలనే నియమాలేవీ పెట్టుకోకుండా ఇవి చదవాలి, ఇలా చదవాలని అనుకునేవాడు. తాను అనుకున్నట్లుగానే రోజూ ఇంట్లోనే ఉండి చదువుకునేవాడు. కోచింగ్ తీసుకోకుండా ప్రిపేర్ అయిన సంకేత్ కుమార్ మొదటి సారి ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు. కానీ అక్కడ సెలెక్ట్ కాలేకపోయాడు. అయితే అక్కడితో తన ప్రయత్నాన్ని ఆపకుండా ఎక్కడ పొరపాటు చేశాడో తెలుసుకొని రెండో సారి అది రిపీట్ అవ్వకుండా చూసుకున్నాడు. ఇలా తనమీద తనకున్న నమ్మకంతో ఆలిండియా స్థాయిలో 35వ ర్యాంకు సాధించాడు.


"12 నుంచి 14 గంటలు కాదు సమాజాన్ని చదవాలి"


అయితే చాలా మంది 12 నుంచి 14 గంటలు చదివితేనే సివిల్స్ సాధించగలని భావిస్తారు కానీ అలా చదివడం కంటే సమాజాన్ని చదివితేనే సివిల్స్ లో ర్యాంకు కొట్టొచ్చని సంకేత్ చెబుతున్నాడు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడున్నర దశాబ్దాలు అవుతున్నా నేటికీ అనేక గిరిజన తండాలు నాగరికతకు దూరంగా బతుకుతున్నాయని ఈ ఆలిండియా ర్యాంకర్ సంకేత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అందుకే గిరిజన తండాల కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే కలెక్టర్ అవ్వాలి అనుకున్నట్లు వివరించాడు. నాగరికతకు దూరంగా బతుకుతున్న గిరిజన తండాల్లో చైతన్యం నింపేందుకు తాను కృషి చేస్తానని వెల్లడించారు. తాను అనుకున్న లక్ష్యాలను కచ్చితంగా చేరుకోగలనని నమ్మకంగా చెబుతున్నారు. 


Also Read: వంట కార్మికురాలి కొడుకు సివిల్స్‌లో 410వ ర్యాంకర్‌ - అదరగొట్టిన దళిత బిడ్డ