Maoists Arrest: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గడ్చిరోలి బాంబు పేలుడు కేసులో మావోయిస్టు నర్మదక్క అలియాస్ ఉషారాణి పోలీసులకు లొంగిపోయారు. డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట ఆమె సరెండర్ అయ్యారు.  గడ్చిరోలిలో బాంబు పేలుడు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అందులో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 15 మంది పోలీసులు ఉన్నారు. ఇందులో నర్మదక్క అలియాస్ అల్లూరి ఉషారాణి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈమెపై రూ. 20 లక్షల రివార్డు కూడా ఉంది. 




దాదాపు రెండు దశాబ్దాల పాటుు..


నర్మదక్క ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు గురవాడ గ్రామానికి జన్మించారు. ఆమెకు సుజాతక్క, ఉషారాణి అనే పేర్లు కూడా ఉంది. దాదాపు 2 దశాబ్దాల పాటు మావోయిస్టు, నక్సలైట్ దళాల్లో పలు ర్యాంకుల్లో పని చేశారు నర్మదక్క. మావోయిస్టుల చాలా ఆపరేషన్లలో ఆమె పాలు పంచుకున్నారు. అలా సంస్థలో నర్మదక్క పైకి ఎదిగారు. సీపీఐ(మావోయిస్టు) కు సౌత్ గడ్చిరోలి డివిజన్ కార్యదర్శిగా పని చేశారు. తన ఆపరేషన్ ప్రాంతంలో ఐదు ప్లాటూన్ లను ఏర్పాటు చేసుకున్నారు. అనేక మావోయిస్టు కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహించారు. సీపీఐ(మావోయిస్టు)లో యువతులనూ చేర్చుకున్న ఘతన ఆమెకే దక్కింది. ఆమె సీపీఐ(మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యురాలిగా కూడా పని చేశారు. 2012 డిసెంబర్ లో గడ్చిరోలి జిల్లా హిదూర్ సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్ లో నర్మదక్క చనిపోయిందని మొదట పోలీసులు భావించారు. ఆమె భౌతిక కాయాన్ని ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్ జిల్లా మాల్వాడ గ్రామంలో ఖననం చేశారని అనుకున్నారు. కానీ తర్వాత నర్మదక్క చనిపోలేదని తెలిసింది. 


కొంతకాలంగా నర్మదక్క క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు సమాచారం. ఆమె కీమో థెరపీ కూడా చేయించుకున్నారని తెలుస్తోంది. దీని వల్ల నర్మదక్క తనకు తాను నడవలేనంత బలహీనంగా మారారు. ఆమె ఆరోగ్య కారణాలతో 2018 చివరలో మావోయిస్టు ర్యాంక్ ను విడిచిపెట్టినట్లు సమాచారం. 


నర్మదక్కపై పలు రకాల కేసులు..


నర్మదక్క తండ్రి పేరు భుజంగరావు. ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేశారు. ఆయన విరసంలోనూ పని చేశారని పోలీసులు తెలిపారు. తర్వాత వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకుని దండకారణ్యంలో చేరారు. డెన్ కీపర్ గా పని చేశారు. పీపుల్స్ వార్ పట్ల ప్రభావితం అయిన ఉషారాణి అజ్ఞాతంలోకి వెళ్లారు. పీపుల్స్ అనుబంధ గ్రూపుల్లోనే ఆమె విద్యాభ్యాసం సాగింది. 1991లో దళంలో జాయిన్ అయ్యారు. రాచకొండ దళ కమాండర్ గా పనిచేశారు. 2002 నుండి 2011 ప్లేటూన్ కమాండర్ గా.. 2011 మొబైల్ పొలిటికల్ టీచర్ గా పని చేశారు. అలాగో పొలిటికల్ మ్యాగజైన్స్ కు ఎడిటర్ గా కూడా చేశారు. నర్మదక్కపై 5 అటాక్ కేసులు, 3 బ్లాస్టింగ్ కేసులు, 2 అసాల్ట్ కేసులు, 3 కాల్పుల కేసులు ఉన్నట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. 


నర్మదక్క భర్త ముక్కా వెంకటేశ్వర్ గుప్తా అలియాస్ కిరణ్ అలియాస్ సుధాకర్ సీపీఐ(మావోయిస్టు) ప్రచురణ విభాగంలో పని చేశారు. పోలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా చేశారు. కిరణ్ ప్రభాత్ పత్రికను చూసుకున్నారు. ఆయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ(DKSZC) సభ్యుడిగా, గడ్చిరోలి జిల్లా ఇంఛార్జ్ గా కూడా పని చేశారు. కిరణ్ విజయవాడకు చెందిన వారు. అయితే ఈయన 1998వ సంవత్సరం నవంబర్ లో మరణించారు.


లొంగిపోతే సరైన వైద్యం అందిస్తాం..


మావోయిస్టు పార్టీ అస్తిత్వాన్ని కోల్పోయిందని తెలంగామ డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. మావోయిస్టు పార్టీలో ఓ క్షణమైనా, ఏమైనా జరిగే అవకాశం ఉందన్నారు. పార్టీలో విభేదాల పరిష్కారానికి అగ్ర నాయకులెవరూ లేరని చెప్పారు. ఎన్సీసీ, మావోయిస్టుల మధ్య విబేధాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. అయితే మావోయిస్టు పార్టీలో అగ్ర నేతలందరూ అనారోగ్యం పాలయ్యారని.. లొంగిపోతే వారందరికీ వైద్యం అందిస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ పోలీస్ శాఖ ప్రకటనతో ఇప్పటికే పలువురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారని ఆయన చెప్పారు.