తెలంగాణలో మున్సిపల్ శాఖ పరిధిలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు, పనులకు గానూ కేంద్ర వాటా కోరుతూ ఆ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. అందుకు గానూ వచ్చే కేంద్ర బడ్జెట్‌లో రూ.7,778 కోట్లు కేటాయించాలని లేఖలో కోరినట్లుగా కేటీఆర్ వివరించారు. గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో మంత్రి కేటీఆర్.. కేపీహెచ్‌బీ-కోకాపేట్-నార్సింగి కారిడార్, వరంగల్ మెట్రో-నియో ప్రాజెక్ట్‌తో పాటు మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఎమ్మార్‌టీఎస్), మెట్రో నియో నెట్‌వర్క్‌తో సహా రాష్ట్రంలోని కొన్ని ప్రాజెక్టులకు కేంద్రం తరపున నిధులు కోరారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్ఆర్డీపీ) రెండో విడత, మూసీ నది రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌తో పాటు ఈస్ట్ వెస్ట్ ఎక్స్‌ప్రెస్ వే, ఎలివేటెడ్ కారిడార్ల అభివృద్ధి, ఎస్టీపీ ప్రాజెక్ట్‌లు, హైదరాబాద్‌లో ఫేజ్-1 మురుగునీటి నెట్‌వర్క్ ప్రాజెక్ట్‌లు, ఔటర్ రింగ్ రోడ్  వరకు కవర్ చేసే STP ప్రాజెక్ట్‌లు, నగరంలో మిస్సింగ్ లింక్ రోడ్ల నిర్మాణం వంటివి పేర్కొన్నారు. 


కేంద్రం నుండి నిధులు కోరిన ప్రతి ప్రాజెక్ట్ వివరాలను లేఖలో వివరించారు. ఎమ్మార్టీఎస్ ప్రాజెక్టు కోసం ప్రాథమిక అంచనాలు రూ.3,050 కోట్లు అని కేటీఆర్ తెలిపారు. రూ.450 కోట్లతో పని చేసే ప్రాజెక్ట్ వ్యయంలో 15 శాతం మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కేటీఆర్ కోరారు.


2030 నాటికి ఎమ్మార్టీఎస్ ప్రాజెక్టు 5 లక్షల మంది ప్రయాణికుల అంచనాతో సుమారు 30 కిలో మీటర్లకు విస్తరించనుందని మంత్రి సూచించారు. ఇది నార్సింగిలో ప్రతిపాదిత ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌తో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ప్రస్తుత మెట్రో నెట్‌వర్క్‌తో కూడా అనుసంధానం అవుతుందని చెప్పారు. వరంగల్ మెట్రో-నియో ప్రాజెక్టుకు రూ.184 కోట్లు (20 శాతం) కావాలని కోరుతూ, టైర్-2 నగరంలో ప్రజా రవాణాలో ఈ ప్రాజెక్ట్ ప్రధాన మైలురాయిగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అనే కేంద్ర విధానానికి అనుగుణంగా తెలంగాణలో మెట్రో-నియో కోచ్‌లను తయారు చేసే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్వేషిస్తోందని ఆయన చెప్పారు.


కేంద్రం గుడ్ న్యూస్
ఇదిలా ఉంటే.. ఆర్థిక కష్టాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర పన్నుల వాటాను డబుల్ చేసి రిలీజ్ చేసింది. ప్రతి నెలా విడుదల చేసే కేంద్ర పన్నుల్లో వాటాను ఈ సారి రెట్టింపు చేశారు. అంటే.. మరో నెల వాయిదాను ముందుగానే ఇస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు కలిపి ఈ నెల పన్ను వాటా కింద రూ. 47,541 కోట్ల నిధులు ఇవ్వాల్సి ఉంది. అయితే రూ. 95,082 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. అంటే వచ్చే నెల పన్నుల వాటాను కూడా ఒక నెల ముందుగానే ఇస్తోంది. 


ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పన్నుల వాటాను రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. ఈ ప్రకారం ఈ నెల విడుదల చేస్తున్న రూ. 95,082 కోట్లలో తెలుగు రాష్ట్రాలకు 5,840 కోట్లు అందనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క నెల పన్నుల వాటా కింద రూ. 1,923.98 కోట్లు వస్తుంది. అయితే ఈ సారి రూ. 3,847.96 కోట్లు విడుదల చేసింది. వచ్చే నెల పన్నుల వాటాను కూడా ముందుగానే జమ చేసింది. తెలంగాణ రాష్ట్ర పన్నుల వాటా నెలకు రూ. 999.31 కో ఇప్పుడు అడ్వాన్స్ కలిపి  రూ. 1,998.62 కోట్లువిడుదల చేసింది.


Also Read: ఉద్యోగుల ఉద్యమం లైట్.. ఏపీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు.. బిల్లులు రెడీ చేయాలని ట్రెజరీలకు ప్రభుత్వం ఆదేశాలు !


Also Read: సమ్మెలోకి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు.. 21న సీఎస్‌కు నోటీసు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.