Konda Surekha: కొండా సురేఖ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు. వరంగల్ తూర్పు (Warangal East) నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తుండగా.. నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆమె గెలుపు కోసం భర్త కొండా మురళీ కూడా ఎత్తులు వేస్తున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంపై మాజీ ఎమ్మెల్సీ మురళి (Konda Murali) ఫోకస్ పెట్టారు. భార్యను గెలిపించేందుకు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు బలహీనపర్చేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తోన్నారు. అందులో భాగంగా బీఆర్ఎస్‌లోని నేతలందరికీ తనవైపుకు తిప్పుకునేందుకు వారితో చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్‌ (Congress Party)లో చేరి కొండా సురేఖ గెలుపుకు సహరించాలని కోరుతున్నారు.


ఈ క్రమంలో పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌ పరిధిలో కీలక నేతగా ఉన్న డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ దంపతులతో పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఇప్పటికే కాంగ్రెస్‌వైపు తీసుకొచ్చారు. అలాగే మరో 11 మంది కార్పొరేటర్లు కొండా మురళీ సూచనతో కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దమవుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీలోని నేతలందరినీ తమవైపు తిప్పుకోవడం ద్వారా బీఆర్ఎస్‌ ఆత్మస్థైర్యం దెబ్బతీయవచ్చని మురళీ భావిస్తున్నారు. ఎన్నికల వేళ ఏ పార్టీకైనా నేతలు కీలకమని చెప్పవచ్చు. ఎన్నికల సమయంలో కార్యకర్తలను సమన్వయం చేసుకోవడం, పార్టీకి ఓట్లు వేయించేలా చేయడం, పోల్ మేనేజ్‌మెంట్ నిర్వహించేందుకు నేతలు అవసరం. కానీ పోలింగ్‌కు మరో 20 రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో నేతలు ఒక్కొక్కరిగా వెళ్లిపోతుండటంతో బీఆర్ఎస్‌కు ఏమీ అర్థం కావడం లేదు. 


పార్టీ నేతలను ఎలా కాపాడుకోవాలో తెలియక సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. తన మార్క్ రాజకీయంతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు కొండా మురళీ వరుస షాక్‌లు ఇస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి మరోసారి బీఆర్ఎస్ నుంచి నరేందర్ పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి కొండా సురేఖ, బీజేపీ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్ రావు పోటీ చేస్తోన్నారు. ముగ్గురు నేతలకు స్థానికంగా పట్టు ఉంది. దీంతో ఈ సారి నియోజకవర్గంలో త్రిముఖ పోరు జరగనుందని విశ్లేషకులు చెబుతుున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్‌కు బీఆర్ఎస్ పెద్దల నుంచి అండదండలు ఉండగా.. కొండా సురేఖకు మాజీ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. సురేఖ ఎప్పటినుంచో రాజకీయాల్లో ఉన్నారు. అలాగే ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు కూడా నియోజకవర్గంలో ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. ప్రదీప్ రావు 15 ఏళ్ల పాటు వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్‌గా పనిచేశారు. దీంతో వ్యాపారులు, ప్రజలతో సన్నిహితం సంబంధాలు ఏర్పడ్డాయి.


2018లో ఎర్రబెల్లి ప్రదీప్ రావు ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఇప్పుడు మరోసారి పోటీ చేస్తుండటంతో సానుభూతి కలిసొచ్చే అవకాశముంది.  ముగ్గురికి ప్రజల్లో బలం ఉండటంతో.. ఈ సారి టఫ్ ఫైట్ నడవనుంది. కానీ బీజేపీకి నియోజకవర్గంలో పట్టు లేకపోవడం ప్రదీప్ రావుకు మైనస్‌గా మారింది. ఇక కొండా సురేఖ గత కొన్నేళ్లుగా ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టారు.  పాదయాత్ర ద్వారా గడపగడపకు తిరిగారు.