Minister Harish Rao: పేదలకు సాయం చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పని చేస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. పేదలే బీఆర్ఎస్ పార్టీకి ఆత్మ బంధువులని అన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే కేక్ కట్ చేసి క్రైస్తవులు, ఫాస్టర్లకు తినిపించారు. మంత్రి మాట్లాడుతూ.. దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో క్రిస్మస్ పండుగను అధికారికంగా జరిపిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా రెండ్రోజులు సెలవు ప్రకటించిన ప్రభుత్వం తెలంగాణ బీఆర్ఎస్ దేనని వెల్లడించారు. భారత దేశం భిన్నత్వంలో ఏకత్వం అని.. అన్ని కులాలు, మతాలు కలిసి ఉన్న దేశమని తెలిపారు. సిద్దిపేట సీఎస్ఐ చర్చి 150 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉత్సవాలను జరుపుతున్న సందర్భంగా సంపూర్ణ సహకారం అందిస్తారని తెలిపారు. నియోజక వర్గాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వివరించారు. 


ఆందోళన వద్దు... అప్రమత్తంగా ఉండండి


కరోనా పట్ల ఆందోళన వద్దని, అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. పలు దేశాల్లో కరోనా వ్యాప్తిని గమనిస్తున్నామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు.  ప్రజలందరూ బూస్టర్‌ డోసు వేసుకోవాలని సూచించారు. కొత్త వేరియంట్‌పై ప్రజలు భయాందోళనకు గురికావొద్దన్నారు. ఇప్పటికే పలు దశల్లో కరోనాను విజయవంతంగా ఎదుర్కొన్నామన్నారు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో తెలంగాణ అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచిందన్నారు. కరోనా వ్యాప్తి అంతగాలేకపోయినా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. మందులు, ఆక్సిజన్‌, ఐసీయూ పడకలు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. కరోనా పాజిటివ్‌ నమూనాలు  జీనోమ్‌ సీక్వెన్స్‌ కోసం గాంధీ ఆసుపత్రికి పంపాలన్నారు. శంషాబాద్‌  ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించాలని  మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.


ఐఎమ్ఏ సూచనలు..!


ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ పలు మార్గదర్శకాలు జారీ చేయగా..ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కూడా పలు సూచనలు చేసింది. తక్షణమే ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటించడం మొదలు పెట్టాలని తెలిపింది. విదేశీ ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని చెప్పింది. ప్రస్తుతానికి భారత్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా లేదని, భయపడాల్సిన పని లేదని వెల్లడించింది. "కొవిడ్ సోకాక చికిత్స అందించడం కంటే అది రాకుండానే చూసుకోవడం మంచిది. అందుకే ప్రజలందరూ కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నాం" అని ప్రకటించింది IMA.


1. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించండి. 
2. భౌతిక దూరం పాటించాలి. 
3. సబ్బు, నీళ్లు లేదా శానిటైజర్‌లతో తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. 
4. పెళ్లిళ్లు, రాజకీయ సమావేశాలు, ఇతరత్రా మీటింగ్‌ల లాంటి సామూహిక కార్యక్రమాలు నిర్వహించకూడదు. 
5. విదేశీ ప్రయాణాలు మానుకోవాలి. 
6. జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, విరేచనాలు లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. 
7. వీలైనంత త్వరగా ప్రికాషనరీ డోస్‌ను తీసుకోవడం మంచిది. 
8. ప్రభుత్వాలు ఇచ్చే మార్గదర్శకాలను తుచ తప్పకుండా పాటించాలి.