నిజామాబాద్‌లో యువతకు సామాజిక సేవ పేరుతో కరాటే శిక్షణ ఇస్తూ మతపరమైన దాడులకు పాల్పడేలా అబ్దుల్ ఖాదర్ అనే కరాటే మాస్టర్ అరెస్ట్ అయ్యాడు. మతం పేరిట నిజమాబాద్‌లో దాదాపు ఇప్పటి వరకు 200 మందికి పైగా ఖాదర్ శిక్షణ ఇవ్వగా ఇందులో హైదరాబాద్, క‌ర్నూలు, నెల్లూరు, క‌డ‌ప, వరంగల్‌తో బాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువకులు ఉన్నట్లు గుర్తించారు. ఖాదర్ నివాసంలో మ‌ర‌ణాయుధాలు, నిషేధిత సాహిత్యం, నోట్ బుక్స్ లభ్యమయ్యాయి. 


ఈ ఘటనపై నిఘా వర్గాలు పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. సమయానికి పోలీసులు స్పందించారు కానీ ఖాదర్ వ్యవహారం 90ల దశకంలో దేశవ్యాప్తంగా పలు బాంబు దాడులకు తెగబడి పదుల సంఖ్యలో ప్రాణాలు తీసి చివరకు జగిత్యాలలో పోలీసు కాల్పుల్లో మరణించిన కరుడుగట్టిన లష్కరే తోయిబా ఉగ్రవాది ఆజాంఘోరీని గుర్తుతెస్తోంది.


ఎవరీ ఆజం ఘోరీ???


1990ల దశకంలో ఆజం ఘోరీ పీపుల్స్ వార్ గ్రూప్‌లో యాక్టివ్ మెంబర్‌గా ఉన్నాడు. వరంగల్‌లో జరిగిన ఓ బాంబు దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి పారిపోయి పాకిస్థాన్‌కు వెళ్లి లష్కరే తోయిబాలో చేరాడు. చురుకైన యువకుడు కావడంతో లష్కరే తోయిబాకి చెందిన ఉగ్రవాద నాయకుల దృష్టిలో పడ్డాడు. దీంతో ప్రత్యేకంగా అతన్ని ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల వద్ద శిక్షణ కోసం లష్కరే నాయకులు పంపించారు. 


ఇక 1992 లో ఘోరీ భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత తన ఉగ్రవాద దాడులకు వ్యూహరచన చేసాడు. మొదట యువతను ఆకట్టుకునేలా పలు శారీరక శిక్షణా కార్యక్రమాలు రహస్యంగా నిర్వహించేవాడు. ఈ విషయం తెలిసిన హైదరాబాద్‌ అదనపు పోలీసు సూపరింటెండెంట్ జి కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలోని బృందం అతని అడ్డాపై రైడ్ చేసింది. అప్పుడే ఘోరీ జరిపిన కాల్పుల్లో కృష్ణప్రసాద్ మరణించారు. దీనితో పోలీసు , నిఘా వర్గాల్లో ఆజం ఘోరీ పై ఫోకస్ మరింత పెరిగింది.


ఇక 1993లో ఘోరీ తన మకాం బొంబాయికి మార్చాడు. బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత 250 మందికిపైగా మరణాలూ... 700 మంది తీవ్రంగా గాయపడటానికి కారణమైన బొంబాయి వరుస బాంబు పేలుళ్లను నిర్వహించిన క్రిమినల్ గ్రూప్‌లో అతను కూడా కీలకంగా వ్యవహరించాడు. దీంతో ప్రాసిక్యూషన్ నుంచి తప్పించుకోవడానికి ఘోరీ మళ్లీ పాకిస్తాన్‌ పారిపోయాడు. ఈసారి మరింత ఆధునిక ఆయుధ శిక్షణ పొందాడు. ఇక తిరిగి భారతదేశంలోకి అక్రమంగా చొరబడ్డ ఘోరీ పలు ప్రాంతాలలో తన నెట్వేర్క్‌ని విస్తరించాడు. 


హైదరాబాద్‌ వచ్చిన ఘోరీ భారతదేశంలో విధ్వంసక కార్యకలాపాలకు పాల్పడటానికి చురుకైన ముస్లిం యువకులను ఎంపిక చేసి వారిని కీలక బాధ్యతలకై నియమించడం ప్రారంభించాడు. "భారతదేశం నుంచి పాశ్చాత్య సంస్కృతిని నిర్మూలించాలనే" ఉద్దేశ్యంతోనూ ఇక్కడ కూడా ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలంటూ భారతీయ ముస్లిం మహమ్మదీ ముజాహిదీన్ ( IMMM)సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ పూర్తిగా ఉగ్రవాద కార్యకలాపాలకు అంకితమై పలు ప్రాంతాల్లో దోపిడీలకి పాల్పడి నిధులు సమకూర్చునేది. దోపిడీలు, హత్యలు, దొంగతనం వంటి 60 తీవ్ర నేరాలలో ఘోరీ పాల్గొన్నట్లు పోలీసు రికార్డులు చూపిస్తున్నాయి. ఇక సానుభూతిపరుల నుంచి కూడా ఆర్ధికంగా సహాయం పొందడంతోపాటు కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఇండియన్ ముజాహిదీన్ ఆశ్రయం కూడా పొందేది.


ఆజం ఘోరీ చురుకుగా వ్యవహరించడం చూసి లష్కరే తోయిబా అగ్ర నాయకులు అతన్ని  దక్షిణ భారత దేశ కమాండర్ గా నియమించారు. కేంద్ర నిఘా వర్గాల దృష్టిలో అప్పటికే హిట్ లిస్ట్ లో ఉన్న ఘోరీని వేటాడేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పోలీసు ఉన్నతాధికారులు. అతను అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో ఉన్నట్లు గుర్తించిన టాస్క్ ఫోర్స్ బృందం 6 ఏప్రిల్ 2000న అదను చూసి బస్టాండ్ ప్రాంతంలో ఘోరీపై కాల్పులకు దిగింది. దీంతో ఘోరీ ఫైరింగ్ జరపడానికి తన 7.65 ఎంఎం మౌజర్ పిస్టల్‌ని తీసి, కాల్పులు జరపగా పోలీసులు కూడా అదే స్థాయిలో బదులిచ్చారు. దీంతో అక్కడికక్కడే మరణించాడు ఆ కరుడుగట్టిన ఉగ్రవాది.


అప్పటి ఆజం ఘోరీ ఉగ్ర జీవితాన్ని గుర్తు చేస్తూ మొక్కలా మొదలైన అబ్దుల్ ఖాదర్ వ్యవహారం మొదట్లోనే పోలీసుల దృష్టిలో పడటంతో పలువురు అమాయక యువత జీవితాలు నాశనం కాకుండా అయ్యాయని భావిస్తున్నారు స్థానికులు. అయితే ఇప్పటికే మానసికంగా అతని మాటలకు సిద్ధపడిన యువతను గుర్తించి ,తిరిగి వెనక్కి తీసుకురావడానికి పోలీసులకు సవాల్ గా మారిందనే చెప్పవచ్చు.