Karimnagar News: పర్యావరణానికి, ఆరోగ్యానికి ప్లాస్టిక్ ప్రమాదకరంగా మారడంతో... ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వ్యర్ధాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిషేధిత జాబితాలోకి తీసుకొచ్చాయి. ఈ ఏడాది జులై 1 నుంచి పకడ్బందీగా అమలు చేసేలా చేపట్టినప్పటికీ.. తనిఖీలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. జిల్లాలోని నగర, పురపాలికల్లో ప్లాస్టిక్ నిషేధం అంతంత మాత్రంగా మారుతుంది. రోజురోజుకు తగ్గవలసిన పాలిథిన్ వాడకం మరింత ఎక్కువైంది. కూరగాయల మార్కెట్లో, మాంసం వ్యాపారం, కిరాణా దుకాణాలు, చిరు వ్యాపారులు, పండ్ల బండ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్ ప్రాంతాల్లో ఒకసారి వాడిపడే కవర్లు ఇష్టం వచ్చినట్టు గా వాడుతున్నారు. కొద్ది రోజుల పాటు హడావుడి చేసిన అధికార యంత్రాంగం ఆ తర్వాత వదిలేయడంతో ఎవరి చేతిలో చూసిన ఒకసారి వాడి పారేసే సంచులే దర్శనమిస్తున్నాయి. 


నాలుగున్నర లక్షల జరిమానా విధింపు..


కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో రోజుకు 25 టన్నుల వ్యర్థాలు బయటకు వస్తున్నట్లుగా చెబుతున్నారు. నగర పరిధిలో నాలుగు రోజుల కిందట శాస్తి రోడ్ లోని నాలుగు ప్లాస్టిక్ దుకాణాలను తనిఖీ చేయగా.. చాలా గొడవ జరిగింది. 340 కిలోల ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేసుకొని 4,45000 వేల జరిమానా విధించారు. కానీ సదరు వ్యాపారులు చెల్లించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజులు గడుస్తున్నా కేసు నమోదు కానీ, జరిమాన చెల్లించడం కానీ ఎలాంటి చర్యలు లేకపోగా... రాజకీయ ఒత్తిడి భరించలేక కింది స్థాయి సిబ్బంది తనిఖీ చేయాలంటే ఆందోళన చెందుతున్నారు. 50 మైక్రాన్ ల మందం గల ప్లాస్టిక్ కవర్లు ఇప్పటికే నిషేధించగా ఒకసారి వాడి పడేయకుండా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 75 మైక్రాలకు పెంచింది. డిసెంబర్ నుంచి 120 మైక్రాల కవర్లను కూడా నిషేధిత జాబితాలో చేర్చింది. ఒకసారి వాడి పడేస్తే ప్లాస్టిక్ వస్తువుల తయారీ అమ్మకం వాడకం నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 


250 రూపాయల నుంచి 5000 వరకు జరిమానా


తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్దేశించిన మైక్రాన్ ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్లు తయారు చేసిన వారికి 50,000 అమ్మినవారికి 2500 నుంచి లక్ష రూపాయలకు పైగా, వాడిన వ్యక్తులకు 250, రూ. 500 నుంచి 5000 వరకు జరిమాన విధించడంతోపాటు, జైలు శిక్ష కూడా విధించనుంది. ఇవన్నీ ఉన్న బహిరంగ మార్కెట్లో మాత్రం యథావిధిగా వాడుతున్నారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ సంచులను వస్తువులను పూర్తిగా నిషేధిత జాబితాలోకి చేర్చడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో సిటీ లెవెల్ స్టార్ స్పోర్ట్స్ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో కమిషనర్, శానిటరీ సూపర్ వైజర్లు, ఇన్స్పెక్టర్లు, ఎన్జీవో, పోలీసులు కానిస్టేబుల్ కమిటీలో ఉంటారు. వీరంతా క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేయడంతో పాటు జరిమాన విధిస్తారు. 


కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో శానిటేషన్ సిబ్బంది వెళ్లి రావడం తప్ప పక్కాగా కమిటీ మాత్రం పర్యవేక్షణ చేయడం లేదు. పైగా రాజకీయ ఒత్తిళ్లతో ఆ వైపే కన్నెత్తి చూడటం లేదు. అడపా దడపా రావడం తప్ప నిషేధంలో చిత్తశుద్ధి కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధిత నగరాల్లో కరీంనగర్ ఉంది. ప్లాస్టిక్ నిషేధం ఎలా జరుగుతుందనే విషయంపై కేంద్ర ప్రభుత్వం సర్వే చేయనుంది. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న వ్యర్ధాలు జరిమానా ప్రజల అభిప్రాయాలను నమోదు చేయనున్నారు. దీని ఆధారంగా స్వచ్ఛ సర్వేక్షన్ లో ర్యాంకులో ప్రాథమిక కల్పించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.