Telangana: సామాన్యంగా మనం ఏ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి చూసిన అక్కడ ఉండే గోడలపై మనకు కనిపించేవి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటనలు   లేక దేశంలోని మహానుభావుడు అయినటువంటి మహాత్మా గాంధీ, చాచా నెహ్రూ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ల బొమ్మలు పెయింటింగ్ వేసి ఉంటాయి. వాళ్లు  చెప్పిన మంచి మాటలు గోడలపై రాసి ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం రైలు బోగీని తలపించే విధంగా ఈ పాఠశాల ముందు పెయింటింగ్ వేసి ఉంటుంది...


అది చూస్తే ఇళ్ల మధ్యలో రైలు ఉంది ఏంటి అనుకుంటున్నారేమో... అలా అనుకుంటే ముమ్మాటికి తప్పే... ఇది రైలు బోగీని తలపించే ప్రభుత్వ పాఠశాల. అదేంటి పాఠశాలకు ఇలా రైలు బోగిలా తయారు చేయడం ఏంటి అనుకుంటున్నారేమో... ఇది విద్యార్థులను ఆకర్షించేందుకు ఒక కొత్త రకమైన ట్రెండ్ అనే చెప్పవచ్చు.


Also Read: మున్సిపల్ సిబ్బంది వీధి కుక్కలను పట్టుకెళ్లి ఏం చేస్తారు? ఒకటి పట్టుకుంటే ఎంత ఇస్తారు?


ప్రభుత్వ పాఠశాలలు అంటే పగుళ్లతో ఉండే గోడలు, పెయింటింగ్ పోయిన బ్లాక్ బోర్డ్, పెచ్చులు ఊడిపోయే ఉండే స్లాబులు, కింద కూర్చోబెట్టి చదివించే సాంప్రదాయం ఇవన్నీ ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రభుత్వ పాఠశాలలు కూడా కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారు ఇందులో భాగంగానే విద్యార్థులను ఆకర్షించేందుకు కొంతమంది ఉపాధ్యాయులు తమ సొంత ఆలోచనతో విద్యార్థులను ఆకర్షించేందుకు వినూత్న తరహాలో ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు...


అయితే ప్రస్తుతం మనం చూస్తున్నది కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. ఈ పాఠశాల ముందు వైపు నుంచి చూస్తే అచ్చం రైలుబోగిలా కనిపిస్తుంది కానీ లోపలికి వెళితే తెలుస్తుంది. లోపల కూర్చుని విద్యార్థులు వారికి బోధించే ఉపాధ్యాయులను చూస్తే తెలుస్తుంది ఆహా ఇది పాఠశాల అని. అయితే ఈ ప్రాథమిక పాఠశాలలో గతంలో విద్యార్థులు సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఈ క్రమంలోనే విద్యార్థులను ఆకర్షించాలని ఒక వినూత్న ఆలోచనతో ఇలా రైలు బోగి పెయింటింగ్ వేయించారని అంటున్నారు పాఠశాల హెడ్మాస్టర్ రాజేందర్.


రామడుగు మండలంలో ఉండే ప్రాథమిక పాఠశాలలో 2019లో ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టారు రాజేందర్. అప్పుడు విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఒక వినూత్నమైన ఆలోచనతో ఇలా రైలు బోగి లాంటి పెయింటింగ్ వేయించి విద్యార్థులను ఆకర్షించేందుకు తన వంతు కృషి చేస్తున్నానని అంటున్నారు. అయితే పెయింటింగ్ వేయించిన కొద్ది రోజులకే కరోనా మహమ్మారి సోకడంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ వచ్చిందని అన్నారు. లాక్ డౌన్ తర్వాత పాఠశాలలు తెరిచాక విద్యార్థుల సంఖ్య కొంతవరకు పెరిగిందని అన్నారు. అయితే ఇది గమనించిన విద్యాశాఖ అధికారులు తన వినూత్నమైన ఆలోచనను అభినందించారని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Also Read: సిరిసిల్లలో పవర్ లూం క్లస్టర్ ను మంజూరు చేయండి, కేంద్రాన్ని కోరిన బండి సంజయ్


అయితే ఈ పాఠశాల లోపల ఉండే క్లాస్ రూముల్లో కూడా విద్యార్థులకు కావలసిన తరగతులు యొక్క సిలబస్ కూడా వాల్ పెయింటింగ్ రూపంలో ఉంటుందని ఒకవేళ విద్యార్థులు పుస్తకాలు తెచ్చుకోకపోయినా వాల్ పెయింటింగ్ చూస్తూ చదువుకోవచ్చని అన్నారు అయితే ఈ పెయింటింగ్ కూడా వేసింది ఒక ఉపాధ్యాయుడే అని అన్నారు. అయితే ఈ పెయింటింగ్ కావలసిన ఖర్చు కూడా కొంతవరకు తమ సొంత డబ్బునే ఉపయోగించామని విద్యార్థుల సంఖ్య పెరగడానికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఉపాధ్యాయుడు రాజేంద్రన్నారు.


అయితే మేము ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాము, జీతం తీసుకుంటున్నాము, మా పని అయిపోయింది, అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ తమ సొంత డబ్బుతో డెవలప్ చేయాలనుకునేవారు కొంతమంది ఉంటారు అయితే ఇటువంటి వారికి మరింత ప్రోత్సాహం కల్పిస్తే రెట్టింపు ఉత్సాహంతో కర్తవ్యం నిర్వహించే అవకాశం ఉంటుంది అయితే ఇలా చేసేవారికి మనం ఒక హాట్సాఫ్ చెప్పాల్సిందే...


Also Read: కరీంనగర్ జిల్లాలో వర్షానికి కూలిన వంతెన, కిలోమీటర్ల మేర నడుస్తూనే ఉన్న ప్రజలు