Karimnagar: తెలంగాణలో వీధి కుక్కల దాడులు అధికం అయ్యాయి. రోడ్లపై స్వైర విహారం చేస్తున్న గ్రామ సింహాలు కనబడ్డ వారిపై దాడి చేస్తున్నాయి. చిన్నాపెద్ద, ముసలి ముతక తేడా లేకుండా పిక్కలు పీక్కుతింటున్నాయి. వీధి కుక్కల దాడి బారిన పడిన ఎంతోమంది మృత్యువాత పడ్డారు. మరికొంతమంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఇటీవల హైదరాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో వీధి కుక్కల దాడికి మరణించిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. సిరిసిల్లలోని ఓ ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలిని ఇంట్లోకి వెళ్లి మరి వీధి కుక్కలు దాడి చేసి పిక్కు తిన్న ఘటన మనం చూశాం.


ఈ వీధి కుక్కల దాడులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ నియంత్రణ కార్యక్రమం పేరుతో కుక్కలను పట్టుకుంటున్నాయి. కుక్కల జనాభా పెరగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తుంది ప్రభుత్వం. అసలు ఆ వీధి కుక్కలను పట్టుకొని ఏం చేస్తారు? ఆ కుక్కలను పట్టుకునే ప్రక్రియ ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందా..? లేక ఏదైనా స్వచ్ఛంద సేవా సంస్థలకు కాంట్రాక్టు ఇస్తుందా? అసలు ఒక్క కుక్కను పట్టుకుంటే ఎంత చెల్లిస్తారు ? అనే విషయాలను ఏబీపీ దేశం తెలుసుకునే ప్రయత్నం చేసింది. 


Also Read: పాత ఫోన్‌లు అమ్ముతున్నారా? కొత్తగా జరుగుతున్న సైబర్ మోసం గురించి తెలుసా?


వీధి కుక్కలను పట్టుకొని ఏం చేస్తారు.?
మున్సిపల్ పరిధిలోగాని గ్రామాల్లోగాని  వీధి కుక్కలు స్వైరవిహారం ఎక్కువైనప్పుడు సంబంధిత అధికారులు వాటిని పట్టుకుంటారు. వాటికి కుటుంబ నియంత్రణ చేస్తారు. ప్రస్తుతం కరీంనగర్‌లో సుమారు 10 వేల కుక్కలు ఉంటాయని వెటర్నిటీ వైద్యులు చెబుతున్నారు. కరీంనగర్‌లో ఉన్న ఆసుపత్రిలో సౌకర్యం సరిగా లేకపోవడంతో రోజుకు 10 నుంచి 15 వీధి కుక్కలను తీసుకొచ్చి వైద్యం చేస్తున్నారు.


Also Read: కారు ఇంజన్ సమస్యలకు నూతన టెక్నాలజీతో చెక్- విప్పకుండానే పరిష్కారం!


ఆపరేషన్ చేసిన తర్వాత ఐదు రోజుల వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఏవైనా ఇతర రోగాలు ఉన్నట్లయితే వాటికి చికిత్స చేస్తున్నారు. మళ్లీ ఎవరినైనా కరిచినా ఎలాంటి అపాయం కలగకుండా ఉండేందుకు వ్యాక్సినేషన్ చేసిన తర్వతా మళ్ళీ పట్టుకున్న చోటే వదిలేస్తున్నారని వెటర్నరీ సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 


వీధి కుక్కలను పట్టుకునేది ఎవరు? ఒక్క కుక్కకి ఎంత ఇస్తారు...?
మున్సిపల్ పరిధిలోని వీధి కుక్కలను పట్టుకునేందుకు స్వచ్ఛంద సంస్థకు కాంట్రాక్ట్ ఇస్తారు. కరీంనగర్‌లో వీధి కుక్కలు పట్టుకునే పనిని హైదరాబాద్‌కు చెందిన అనిమల్ వెల్ఫేర్ సొసైటీకి అప్పగించారు. ఒక్క కుక్కని పట్టుకునేందుకు వీళ్లకు సుమారు 1650 రూపాయలు చెల్లిస్తారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ నిధులు విడుదల చేస్తారు. పట్టుకున్న ఆ కుక్కలను పశు వైద్యశాలలో చికిత్స అందిస్తారు. కుక్క ఉన్నన్ని రోజుల పాటు అయ్యే ఆహారం, వ్యాక్సినేషన్ ఖర్చులు పూర్తిగా కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థే భరిస్తుందని ఆ సంస్థ మేనేజర్ రామకృష్ణ ఏబీపీతో తెలిపారు.


Also Read: తెలంగాణలో వరదలకు ఐదు వేల కోట్లకుపైగా నష్టం- ప్రాథమిక అంచనాలు సిద్ధం చేసిన ప్రభుత్వం