ఉన్నట్టుండి ఓ పెద్ద సినిమా సెలబ్రిటీ మీ ప్రాంతంలోకి వస్తే ఎలా ఉంటుంది. సరిగ్గా అలాంటి అనుభూతే రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలోని ఎమ్మార్వో కార్యాలయంలోని అధికారులు, ఉద్యోగులకు కలిగింది. ఎందుకంటే అక్కడికి ఓ పెద్ద సినీ సెలబ్రిటీ వచ్చారు. ఆయన ఎవరో కాదు.. టాలీవుడ్ యంగ్ టైగర్, నటుడు జూనియర్ ఎన్టీఆర్. ఆయన వచ్చీ రావడంతోనే కార్యాలయంలోని అధికారులు, ఉద్యోగులంతా అవాక్కయ్యారు. తమ అభిమాన నటుడు తమ కళ్ల ముందు ప్రత్యక్షంగా కనబడేసరికి వారు ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇంకేముంది.. తమ సెల్‌ఫోన్లకు పని చెప్పారు. తారక్‌తో కలిసి సెల్ఫీలు, ఫొటోలు, గ్రూప్ ఫొటోలు దిగారు. అసలింతకీ జూనియర్ ఎన్టీఆర్ ఎమ్మార్వో కార్యాలయానికి ఎందుకు వచ్చారని అనుకుంటున్నారా..


ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్‌ పనులతో బిజీగా ఉన్నారు. తీరిక చేసుకుని ఎమ్మార్వో కార్యాలయానికి ఎందుకు వస్తారని అనుకుంటున్నారా..? ఎన్టీఆర్ ఇటీవలే శంకర్‌పల్లి ఎమ్మార్వో కార్యాలయం పరిధిలో ఆరున్నర ఎకరాల పొలం కొన్నారు. ఆ రిజిస్ట్రేషన్ పనుల కోసం ఎన్టీఆర్ శుక్రవారం శంకర్‌పల్లిలోని ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చారు. అక్కడ భూ కొనుగోలుకు సంబంధించి సంతకాలు, ఫొటోలు దిగడం పూర్తయ్యాక తిరిగి వెళ్లిపోయారు.


Also Read: DGP Profile Picture Fraud: ఏకంగా డీజీపీ పేరుతో మోసాలు.. ఆయన ఫొటో కూడా వాడేస్తున్న సైబర్ నేరగాళ్లు


ఎన్టీఆర్ రాకతో అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది. కార్యాలయంలోని ఉద్యోగులు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. రిజిస్ట్రేషన్‌ పనులు పూర్తైన వెంటనే కొంతమందితో ఫొటోలు దిగిన ఆయన మళ్లీ హైదరాబాద్‌కు వచ్చేశారు. సెల్ఫీలు దిగేందుకు తహసీల్దార్ సహా ఉద్యోగులు, అధికారులు పోటీ పడ్డారు. రిజిస్ట్రేషన్ అధికారి తహసీల్దార్ కృష్ణకుమార్, ఇతర అధికారులు, సిబ్బంది ఎన్టీఆర్‌తో ఫొటోలు, సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.


ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రాజెక్టు ప్రమోషన్ పనులతో బిజీగా ఉన్నారు. రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ పాన్ ఇండియా ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక వెంటనే ఆయన కొరటాల శివ దర్శకత్వంలో మూవీ చేయనున్నాడని టాక్. ఆ తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఓ మూవీ చేయనున్నారు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్నా.. ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’లో హోస్ట్‌గా కూడా ఎన్టీఆర్ సందడి చేయనున్నారు.


Also Read: KCR Black : కేసీఆర్‌కు ఆ రంగు నచ్చదు.. ఆ కలర్‌లో ఉన్న కాన్వాయ్‌ని ఏం చేశారంటే..