Hyderabad News : సైబర్ నేరగాళ్లకు సాయం చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. వీళ్లు సైబర్‌ నేరగాళ్లకు సిమ్‌ కార్డులు, బ్యాంకు ఖాతాలు సమకూరుస్తుండగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో ముగ్గురు సభ్యులు ఉన్నారు.  వారి నుంచి  నుంచి 113 సిమ్‌ కార్డులు, మూడు మొబైల్స్  స్వాధీనం చేసుకున్నారు. వీరు విదేశాలకు సిమ్ కార్డులు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.  వీరంతా హైదరాబాద్ కు చెందిన వారే.  హైదరాబాదులో సిమ్ కార్డులను కొనుగోలు చేసి దుబాయ్, సింగపూర్, హాంకాంగ్, కెనడా పంపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా కంబోడియా, దుబాయ్‎లకు సిమ్ కార్డులను పంపించి సైబర్ నేరాలకు పాల్పడుతుంది. కంబోడియా నుంచి లోక్‌ల్ సిమ్ కార్డుల ద్వారా ఫోన్ చేస్తున్నట్లు క్రియేట్ చేస్తున్నారు.  


కంబోడియాకు అక్రమ రవాణా
ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతని కంబోడియాకు అక్రమ రవాణా ఘటన వెలుగు చూసింది. కంబోడియాలో ఉన్న తెలుగువాళ్లను పోలీసులు రక్షించి స్వదేశానికి తిరిగి తీసుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఇక్కడ కొనుగోలు చేసిన సిమ్ కార్డులను దుబాయ్‌లో ఉన్న విజయ్‌కి పంపుతున్నారు. చైనా కంపెనీల కోసం విజయ్ పనిచేస్తున్నట్లు పోలీసులు  గుర్తించారు. చైనా కంపెనీలు ఎక్కువ ధర ఇచ్చి సిమ్ కార్డులను కొంటున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇండియన్ సిమ్ కార్డులు ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్ సేల్స్ పేరుతో  విక్రయాలు జరుగుతున్నాయి.


నిందితులంతా హైదరాబాద్ వాసులే
ఈ ముఠాలో జగద్గిరిగుట్టకు చెందిన షేక్ సుభానీ , జీడిమెట్లకు చెందిన కె.నవీన్, ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు చెందిన ఎం.ప్రేమ్‌కుమార్ అలియాస్ మైఖేల్ అలియాస్ మైక్ టిస్సన్‌లు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  నిందితులు వివిధ వ్యక్తులు, సంస్థల ఐడీలను ఉపయోగించి సిమ్ కార్డులను సేకరించారు.  ఈ సిమ్ కార్డులు సైబర్ నేరగాళ్లకు ఇక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు. ప్రధానంగా దుబాయ్ మీదుగా ఎగుమతి చేస్తున్నారు. పట్టుబడ్డ ఈ ముగ్గురు నిందితులు వివిధ రాష్ట్రాల్లోని అనేక మంది వ్యక్తులు సిమ్ కార్డ్‌లను సేకరించి ఎగుమతి చేస్తున్నారు. 


దుబాయ్ లో ప్రధాన నిందితుడు 
దుబాయ్ లో ఉండే ప్రధాన నిందితుడు విజయ్ ఈ సిమ్ కార్డులను రిసీవ్ చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. పలువురి పేర్లతో సిమ్‌ కార్డులు తీసుకుని ఈ ముఠా దుబాయ్‌కి పంపిస్తున్నట్లు తెలిసింది. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఈ నేరాలలో భాగస్వాములైనట్లు పోలీసులు గుర్తించారు. దుబాయ్‌లో ఉన్న వ్యక్తులు భారత్‌లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని విచారణలో తేలింది. నిందితులు నకిలీ సిమ్ కార్డుల సాయంతో వాట్సప్‌ ఖాతాలు తెరిచి, కాల్ సెంటర్ల ద్వారా ఫోన్లు చేస్తూ భారతీయులకు ఎరవేస్తున్నారు.  ఇటీవల జరిగిన పలు కీలక సైబర్ నేరాల్లో ఈ వాట్సప్‌ నంబర్లనే ఉపయోగించినట్లు తేలింది.