YS Sharmila: వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 21న మరోసారి ఢిల్లీ వెళ్లబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఈడీకి లేదా జలశక్తి శాఖకి ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో  లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ ఇప్పటికే ఆమె సీబీఐకి ఫిర్యాదు చేశారు. 


కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన షర్మిల


కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరిపించాలంటూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇదే నెల 7వ తేదీన సీబీఐని ఆశ్రయించారు. త్వరగా విచారణ జరపాలంటూ ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఓ కాంట్రాక్ట్‌ సంస్థతో కలిసి కాళేశ్వరంతో పేరుతో భారీగా అవినీతికి పాల్పడ్డారని షర్మిల ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో లక్ష కోట్ల అవినీతి జరిగిందని వివరించారు. ఓ కంపెనీతో కలిసి లక్ష కోట్లు దోచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈనెల 6వ తేదీన ఢిల్లీ వెళ్లారు. మొదటన తన వద్ద ఉన్న సాక్ష్యాలతో సీబీఐకి ఫిర్యాదు చేశారు. మరికొందరు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కూడా సమావేశం అవుతారు. పాదయాత్రను మధ్యలో ఆపి మరి ఢిల్లీకి వెళ్లిన షర్మిల.. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ సీబీఐకి ఫిర్యాదు చేశారు.






ఇదే విషయమై మొన్నటికి మొన్న వైఎస్ షర్మిల.. గవర్నర్ తమిళిసైకి కూడా ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలోని సమస్యల గురించి ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్మాణాల్లో అవినీతి జరిగిందని తెలిపారు. అలాగే కాళేశ్వరం ముంపు, వర్షాల వల్ల కల్గిన నష్టం గురించి కూడా గవర్నర్ కు వివరించారు. తాజాగా షర్మిల ఢిల్లీ వెళ్లడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాత్రమే చర్చిస్తారా లేక ఏపీ రాజకీయాల గురించి కూడా మాట్లాడతారా అనే డిస్కషన్ జరుగుతోంది.  


ఇటీవలే తన తండ్రిని కుట్రచేసి చంపారని తనను కూడా చంపే అవకాశాలు ఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలన్నింటి మధ్య ఢిల్లీ వెళ్లడం తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా కనిపిస్తోంది. ఢిల్లీలో సీబీఐతోపాటు బీజేపీ ఏ స్థాయి నేతలతో సమావేశం అవుతారన్నదానిపై స్పష్టత లేదు.


దమ్ముంటే సీఎం కేసీఆర్ సీబీఐ ఎంక్వైరీని ఎదుర్కోవాలి..


డీఐజీ ర్యాంక్ ఆఫీసర్‌తో విచారణ జరిపిస్తామని సీబీఐ డైరెక్టర్ హామీ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. కేసీఆర్‌కి చిత్తశుద్ధే ఉంటే సీబీఐ ఎంక్వైరీని ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. దివంగత వైఎస్ఆర్ రూ.38వేల కోట్లతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కట్టి 16లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని భావిస్తే.. సీఎం కేసీఆర్ డిజైన్లు మార్చి, పేరు మార్చి రూ.1.20 లక్షల కోట్లకు ప్రాజెక్టు వ్యయం పెంచారని చెప్పారు. లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేని ప్రాజెక్టుకు.. కరెంట్ బిల్లులే వేల కోట్లు కడుతున్నారని ఆరోపించారు.