హైదరాబాద్ మెట్రో రైల్ రెండోదశ ప్రస్తుత తరుణంలో సాధ్యం కాదంటూ కేంద్రం చేతులెత్తేయడంపై మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి ఘాటైన లేఖ రాశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరికి లెటర్ పంపారు. అత్యంత రద్దీ కలిగిన హైదరాబాదులో మెట్రో రైల్ ప్రాజెక్టు రెండోదశ సాధ్యం కాదని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలమైన నగరాలకు మాత్రం పక్షపాతధోరణితో మెట్రో ప్రాజెక్టులు ఇస్తున్న విషయాన్ని కేటీఆర్ లేఖలో ప్రస్తావించారు. గాంధీనగర్, కొచ్చి, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో పాటు చాలా తక్కువ జనాభా కలిగిన లక్నో, వారణాసి, కాన్పూర్, ఆగ్రా, ప్రయాగ్ రాజ్, మీరట్ వంటి ఉత్తరప్రదేశ్‌లోని చిన్నపట్టణాలకు మెట్రో ప్రాజెక్టులను కేంద్రం కేటాయించిన విషయాన్ని కేటీఆర్ లేఖలో గుర్తుచేశారు.


జనాభా రద్దీ తక్కువ ఉన్న నగరాలకు అన్ని అర్హతలు ఉంటే, హైదరాబాద్ నగరానికి మాత్రం ఏం తక్కువ అని కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. మెట్రో రైల్ విస్తరణ అర్హత లేదని చెప్పడంతో ఆశ్చర్యపోయానని కేటీఆర్ అన్నారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో నగరంగా హైదరాబాద్ ఉందని, ఇలాంటి నగరంలో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండే అవకాశం ఉందన్న వాదన అర్ధరహితమని ఆయన లేఖలో స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అనేక చిన్న నగరాలు, పట్టణాలు మెట్రో రైల్ ప్రాజెక్టులకి అర్హత సాధించినప్పుడు.. హైదరాబాద్ మెట్రో నగరం మాత్రం ఎందుకు ఆ అర్హత పొందదని కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పక్షపాత దృక్పథంతో తీసుకున్న నిర్ణయమేనన్న భావన కలుగుతోందని కేటీఆర్ లేఖలో తెలిపారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి అన్ని అర్హతలు, అనుకూలతలు ఉన్న వివిధ రంగాల్లోని ప్రాజెక్టులు, కేటాయింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షను అనేకసార్లు సీఎం కేసీఆర్ తోపాటు స్వయంగా తాను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చామన్నారు. అయినా కేంద్రం నుంచి ఇప్పటిదాకా ఎలాంటి సానుకూల స్పందన రాలేదన్నారు.  


ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వ పట్టణ అభివృద్ధి శాఖకు మెట్రో రైల్ రెండో దశకు అవసరమైన అన్ని రకాల సమాచారాన్ని అందించడంతోపాటు డీటెయిల్డ్ ప్లానింగ్ రిపోర్ట్ (డిపిఅర్) సైతం అందించామన్నారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ, PHDT గణాంకాలు, ఇతర అర్హతలను, సానుకూలతలను అనేకసార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామన్నారు. ఇందుకు సంబంధించి తెలంగాణ మున్సిపల్ శాఖ తరపున గతంలో అందించిన సమాచారానికి సంబంధించిన నివేదికలను కేటీఆర్ జత చేశారు. కేంద్ర ప్రభుత్వానికి అవసరమైన అన్ని రకాల సమాచారం అందించినా, తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెబుతున్న క్రమంలో మరోసారి సమగ్ర సమాచారాన్ని, అన్ని రకాల పత్రాలను నివేదికలను కేంద్రానికి పంపుతున్నట్లు కేటీఆర్ తెలిపారు.                


కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పూరీని వ్యక్తిగతంగా కలిసి హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో ప్రాధాన్యతను వివరించేందుకు అనేకసార్లు ప్రయత్నించినా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన రాలేదని కేటీఆర్ అన్నారు. అయితే కేంద్రమంత్రి హరదీప్ సింగ్ పూరి నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా పట్టణాభివృద్ధి శాఖ హైదరాబాద్ నగర మౌలిక వసతుల ప్రాజెక్టులు విషయంలో ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా, అవసరాలే ప్రాతిపదికగా సరైన నిర్ణయం తీసుకొని తెలంగాణకు ప్రాజెక్టులు కేటాయిస్తారని ఆశించిన్నట్లు కేటీఆర్ తెలిపారు. అయినప్పటికీ హైదరాబాద్ నగర మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండోదశ ప్రతిపాదనలో ఉన్న సానుకూలతలను దృష్టిలో ఉంచుకొని, సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదముద్ర వేస్తుందని ఆశిస్తున్నట్లు, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలున్నా నివృత్తి చేసేందుకు, అవసరమైన సమాచారాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని కేటీఆర్ తన లేఖలో సవివరంగా పేర్కొన్నారు.