Minister Piyush Goyal: తెలంగాణ నుంచి బియ్యం సేకరణను ఆపేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. తక్షణమే బియ్యం సేకరణ ప్రారంభించాలని ఎఫ్ సీఐని ఆదేశించినట్లు వెల్లడించారు. బియ్యం నిల్వల్లో అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై చర్యలు తీసుకోవాలన్న కేంద్రం సూచనలను పెడచెవిన పెట్టడం, ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద్ ఏప్రిల్, మే నెలల్లో ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయకపోవడం వల్ల గతంలో ఆంక్షలు విధించినట్లు స్పష్టం చేశారు. 


లిఖితపూర్వక హామీ ఇవ్వడంతోనే...


జూన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీని మొదలు పెట్టడం, అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆంక్షలను ఉహసంహరించుకున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అలాగే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో కలిసి మాట్లాడారు. పేదలకు ప్రతి నెలా 5 కిలలో ఉచిత బియ్యం పంపిణీని తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం దయ లేకుండా నిలిపివేసిందని పేర్కొన్నారు. అందుకే బాధాతప్త హృదయంతో రాష్ట్రంలో బియ్యం సేకరణ కార్యక్రమాన్ని ఆపేయాని జూన్ 7వ తేదీన ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు. 


అందువల్లే ఇలా చేయాల్సి వచ్చింది..


పేదలకు తిండి గింజలు దొరకకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆపేయడం ఘోరమని ఆయన అన్నారు. ఇలాంటి అన్యాయం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ చేయకూడదని భావించి తెలంగాణ నుంచి బియ్యం సేకరణ ఆపేస్తామని ఒత్తిడి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. పేదల హక్కులను లాక్కునే ఇలాంటి ఘోరమైన అన్యాయాన్ని ఏ ప్రభుత్వమూ చేయకూడదన్నారు. ఆపేసిన ఈ పథకాన్ని మళ్లీ ప్రారంభించాలని పదే పదే రాష్ట్ర మంత్రులు, అధికారులకు విజ్ఞప్తి చేసినా వాళ్లు పట్టించుకోలేదన్నారు. బియ్యలు నిల్వలు సరిగా నిర్వహించడం లేదని, ఉన్న దాంట్లో కూడా కల్తీ చేశారని రాష్ట్రంలో ఆడిట్ చేసినప్పుడు తేలిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు విధానాలను బంద్ చేయడానికి ఇలా చేయాల్సి వచ్చిందన్నారు. 


రాష్ట్ర మంత్రులు చెప్పినవన్నీ అబద్ధాలే..


రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు పనుల వల్ల రైతులకు నష్టం జరగకూడదు అన్న ఉద్దేశంతోనే తక్షణ బియ్యం సేకరణ ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వివరించారు. అలాగే రబీ సమయంలో నూకలు వస్తే వాటిని తెలంగాణ ప్రజలతోనే తినిపించాలని నేను అన్నట్లు రాష్ట్ర మంత్రులు చేసిన వాఖ్యల్లో నిజం లేదన్నారు. ఎవ్వరూ వారి మాటలు నమ్మొద్దని తెలిపారు. పత్రికల్లో వారి వ్యాఖ్యలు, ప్రకటనలు చూశార ఎంతో ఆందోళనకు గురయ్యానని చెప్పారు. అలాంటి వారితో సమావేశం కావడం కూడా మంచిది కాదేమో అనిపిస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. పేదలకు తిండి గింజలు ఇవ్వకుండా మాకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని రాష్ట్ర మంత్రులకు తెలిపారు. 


ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తతప్పుల నుంచి ప్రజలు పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. జూన్ లో మేం బియ్యం సేకరణ ఆపేయడంతో వాళ్లు పేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేయడం ప్రారంభించారు. జులై కోటా త్వరలో పంపిణీ చేస్తామని చెప్పారు. కేంద్రం నుంచి తీసుకొని పేదలకు ఇవ్వని ఏప్రిల్, మే నెలల కోటానూ పంపిణీ చేయాలని చెప్పినట్లు కేంద్ర మంత్రి వివరించారు. తెలంగాణ ప్రభుత్వానికి పేదలకు సేవ చేయడం కంటే రాజకీయాలపైనే ఎక్కువ ఆసక్తి అంటూ వివరించారు.