Nageshwar Rao Case: మారేడ్ పల్లి మాజీ ఇన్స్ పెక్టర్ నాగేశ్వర రావు కేసులో ఎస్ఓటీ పోలీసులు స్పీడు పెంచారు. ఈనెల 22 వ తేది వరకూ హయత్ నగర్ కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రెండు రోజుల పాటు సరూర్ నగర్ ఎస్ఓటీ కార్యాలయంలో అధికారులు విచారణను పూర్తి చేశారు. నాగేశ్వర రావు వద్ద పలు కీలక ఆధారాలను సేకరించారు. తాజాగా ఈరోజు నాగేశ్వర రావును తమ వాహానంలో తీసుకువెళ్లి ఆ రోజు ఏం జరిగిందనేది తెలుసుకునేందుకు సీన్ టూ సీన్ రీకన్ స్ట్రక్ట్ చేశారు. కోర్టు అనుమతించిన ఐదు రోజుల కస్టడీలో మొదటి రెండు రోజులూ టెక్నికల్ అవిడెన్స్ తో పాటు స్టేట్ మెంట్ రికార్డ్ చేయడం, కేసులో మొదటి నుండి ఏం జరిగింది అనే అంశాలపై దృష్టి సారించారు. ఆ క్రమంలోనే ఇన్స్ పెక్టర్ నాగేశ్వర రావుపై ఎస్ఓటీ పోలీసులు ప్రశ్నల వర్షం కురింపించారు.


రివాల్వర్ తో బెదిరించి తనపై అత్యాచారం చేశాడని.. అలాగే తన భర్త మహేష్ ను కూడా చంపేస్తానని బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. ఇందుకు తగిన ఆధారాల కోసం ఇన్స్ పెక్టర్ నాగేశ్వరావు స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. అలాగే కోర్టు ముందు తగిన ఆధారాలను ప్రవేశ పెట్టేందుకు అవసరమైన సమాచారాన్ని పూర్తి స్దాయిలో సేకరించే పనిలో పడ్డారు. ఈనెల 8వ తేదిన మారేడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వర రావుపై వనస్దలిపురం పోలీస్ స్టేషన్ లో బాధితరాలు ఫిర్యాదు చేసింది. 


అసలేం జరిగిందంటే..?


ఈనెల 7వ తేది రాత్రి తన భర్త ఇంట్లో లేని సమయంలో సీఐ నాగేశ్వర రావు తన ఇంటికి వచ్చి రివాల్వర్ తో బెదిరించి తనపై అత్యాచారం చేశాడంటూ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఆ సమయంలో ఇంటికి వచ్చిన భర్త, ఇన్స్ పెక్టర్ నాగేశ్వర రావును నిలదీయడంతో రివాల్వర్ తో కాల్చి చంపుతానని బెదిరించినట్లు వివరించింది. ఆ తర్వాత హైదరాబాద్ వదలి వెళ్లిపోవాలంటూ బలవంతంగా తనను, తన భర్తను ఇన్స్ పెక్టర్ నాగేశ్వర రావు అతడి సొంత కారులో ఎక్కించుకుని తీసుకెళ్తుండగా... కారు ప్రమాదం జరిగిందని పేర్కొంది. ఆ ప్రమాదం కారణంగానే తాము తప్పించుకుని వనస్థలిపురం పీఎస్ చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేసింది. 


అయితే ఈ మొత్తం వ్యవహారం ఎలా జరిగింది అనే అంశంపై దృష్టి సారించిన ఎస్ ఓటీ పోలీసులు సీన్ టూ సీన్ రీ కన్ స్ట్ర్ క్ట్ చేశారు. ఇందులో భాగంగానే హస్తినాపురం నుండి ఇబ్రహీపట్నం వరకూ నాగేశ్వర రావును తమ వాహనంలో తీసుకెళ్లి ఎలా జరిగిందో చూపించమంటూ అడిగి తెలుసుకున్నారు. అలాగే నిందితుడు చెప్తున్న వాటిని బాధితురాలు ఇచ్చిన వివరాలను పోల్చుకుంటూ పలు కీలక ఆధారాలను సేకరించారు. 


జూబ్లీహిల్స్ రాడిసన్ పబ్ కేసుతో పాటు రోడ్ నెంబర్ 7లో భూకబ్జా వంటి సంచలన కేసులు నాగేశ్వర రావు జూబ్లీహిల్స్ సీఐగా ఉండగానే జరిగాయి. అయితే ఇన్స్ పెక్టర్ నాగేశ్వర రావు కావాలనే తనను కేసులో ఇరికించారంటూ మాజీ ఎంపీటీసీ  వెంకటేశ్ సంచల ఆరోపణలు చేడం.. ఇలా ఇన్స్ పెక్టర్ నాగేశ్వర రావు వ్యవహారంలో రాజకీయ రంగు ఆపాదించడంతో కేసును సీరియస్ గా తీసుకున్నారు పోలీసు ఉన్నతాధికారులు. ఈ నేపథ్యంలో ఐదు రోజుల కస్టడీ మరో రెండు రోజుల్లో పూర్తి కానున్న నేపధ్యంలో కోర్టులో ఎదరుదెబ్బ తగలకుండా నాగేశ్వరావు కేసులో కీలక సాక్ష్యాలతో పాటు, టెక్నికల్ అవిడెన్సును సేకరించే పనిలో పడ్డారు.