కరోనా కాలంలో నష్టపోని రంగంలేదు…ఆర్థికంగా ఇబ్బంది పడని ఇల్లు లేదు. అయినప్పటికీ సొంతింటి కల నెరవేర్చుకునే దిశగా ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు హైదరాబాద్ వాసులు. ఎవరి తాహతుకు తగ్గట్లుగా వారు సొంతింటిని కొనుగోలు చేసుకుంటున్నారు.




తమ బడ్జెట్‌లో సొంత ఇంటిని కొనుగోలు చేయాలని చూస్తున్నారని ప్రముఖ ప్రాపర్జీ మెనేజ్‌మెంట్‌ సంస్థ 99 ఏకర్స్‌ డాట్‌ వెబ్‌సైట్‌ నివేదిక వెల్లడింది. 100 మందిలో 54 శాతం మంది టూ-బీహెచ్‌కే ఇళ్లను కొనుగోలు చేయాలని, మార్కెట్‌లో డిమాండు ఉంటే, 51 శాతం మాత్రమే సప్లయి శాతం ఉంది.




రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు మాత్రం త్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎక్కువగా విక్రయించేలా నిర్మాణాలు చేపడితే వాటికి డిమాండు 34 శాతం ఉండగా, సప్లయి మాత్రం 35 శాతంగా ఉందని వెల్లడించింది నివేదిక. ఉన్నత వర్గాలు ఎంపిక చేసుకుంటున్న ఫోర్ బీహెచ్ ఇళ్లకు డిమాండ్ 8 శాతం ఉంటే, సప్లయి 10 శాతంగా ఉందని ‘99 ఎకర్స్‌ డాట్‌కామ్‌’ వెల్లడించింది. ఓవరాల్ గా నగరంలోని టాప్‌ మోస్ట్‌ బిల్డర్లు చేపట్టిన ప్రాజెక్టుల్లో ఎక్కువగా త్రీ-బీహెచ్‌కే ఇళ్లు ఉన్నాయి.




నగరంలోని చాలా ప్రాంతాల్లో స్థిరాస్తుల ధరలు ఏప్రిల్‌ 2021 నుంచి జూన్‌-2021లో స్థిరంగా ఉన్నాయి. ప్రధానంగా ఐటీ కారిడార్‌ ప్రాంతాలైన గచ్చిబౌలి, నల్లగండ్ల, మణికొండ, ప్రగతినగర్‌, చందానగర్‌ వంటి ప్రాంతాల్లో 3 నుంచి 4 శాతం పెరుగుదల ఉందని నివేదికలో పేర్కొన్నారు. తమ అధ్యయనంలో ‘రెడీ టూ మూవ్‌’ ఇళ్లకే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నట్టు వెల్లడైంది. ఇక నగరంలో 40 లక్షల వరకు బడ్జెట్‌ వారు 42 శాతం ఉంటే, రూ.40 లక్షల నుంచి ఒక కోటి రూపాయలను వెచ్చించే వారు 36 శాతం వరకు ఉండగా, కోటి రూపాయల పైనే వెచ్చించే వారు 25 శాతం వరకు ఉన్నారని 99 ఎకర్స్ డాట్ కామ్ నివేదిక వెల్లడించింది.




‘99 ఏకర్స్‌’ వెబ్‌సైట్‌ మొదటి త్రైమాసిక నివేదికలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ప్రస్తావించారు. గత 2-3 నెలల కాలంలో నగరంలో నెక్లెస్‌ రోడ్‌ సమీపంలో అంబేద్కర్‌నగర్‌, ఇతర ప్రాంతాల్లో సుమారు 330 ఇళ్లను నిర్మించి లబ్దిదారులను అందజేసిందని పేర్కొంది. సుమారు రూ.28 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇళ్లను సమాజంలోని ఆర్థికంగా బలహీనమైన విభాగానికి చెందిన లబ్దిదారులకు అప్పగించారని పేర్కొంది. కాగా, ఒకవైపు సెకండ్‌ వేవ్‌ కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చినా, మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం ఎంతో చొరవ తీసుకొని పనులు చేపట్టిందన్నారు. హైటెక్‌ సిటీ, ఐటీ కారిడార్‌, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ వద్ద నాలుగు లింకు రోడ్లను ఈ సమయంలోనే ప్రారంభించారు. వీటితో పాటు మరో 20 ప్రాజెక్టులను ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా చేపడుతూ హైదరాబాద్‌లో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తోందని నివేదికలో పేర్కొన్నారు.