Hyderabad: తెలంగాణ ఆర్టీసీ మరో సంచలనం దిశగా అడుగులు వేస్తోంది. టికెట్, బస్‌పాస్‌లు అన్నీ ఆన్‌లైన్ విధానంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. చిల్లర సమస్యను తగ్గించుకోవడంతోపాటు ఇతర సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొనేందుకు ఈ డిజిటల్ పేమెంట్ విధానం తీసుకురానుంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని రెండు డిపోల పరిధిలో ఈ డిజిటల్ పేమెంట్ విధానాన్ని అమలు చేస్తోంది. త్వరలోనే దీన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బస్‌లలో అమలు చేయాలని భావిస్తోంది. 


డిజిటల్ ఆర్టీసీ


తెలంగాణలోని ఆర్టీసీ బస్‌లన్నింటిలో డిజిటల్ పేమెంట్స్ విధానం అమలు చేసేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తోంది టీజీఎస్ఆర్టీసీ. ఆటోమేటిక్‌ ఫేర్ కలెక్షన్ సిస్టమ్‌(ఏఎఫ్‌సీఎస్‌) పేరుతో రూపొందించే ఈ సాఫ్ట్‌వేర్‌ త్వరలోనే అన్ని బస్‌లలో అమలు చేయనున్నారు. వీటితోపాటు ఇంటెలిజెన్స్ టికెట్ ఇష్యూయింగ్ మెషిన్స్ కూడా ఆర్డర్ చేస్తోంది ఆర్టీసీ యాజమాన్యం. 13వేల ఐటిమ్స్‌ను కొనుగోలు చేసి 9వేల బస్‌లలో అందుబాటులో ఉంచుతారు. మిగిలినవి బఫర్ స్టాక్‌లా ఉంచుతారు. ఏదైనా మెషిన్ పాడైతే వాటి స్థానంలో వేరేది ఉపయోగించేలా చేస్తారు. వీటిని కూడా డిజిటల్ పేమెంట్స్ కోసం వాడతారు. 


ప్రక్రియ ఆలస్యం


ప్రస్తుతానికి హైదారాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్, బండ్లగూడ డిపోల బస్సుల్లో మాత్రమే ఈ డిజిటల్ పేమెంట్ విధానం కొనసాగుతోంది. ఎప్పటి నుంచి హైదరాబాద్‌లోని అన్ని బస్‌లలో అమలు చేయాలని చూస్తున్నా ఆలస్యమవుతూ వస్తోంది. అయితే ఒక్క హైదరాబాద్‌కే కాకుండా పల్లెవెలుగులాంటి బస్‌లలో కూడా ఈ విధానం అమలు చేయాలని చూస్తోంది ప్రభుత్వం. అందుకే అమలు ప్రక్రియ ఆలస్యమవుతుందని అంటున్నారు. 


కొన్ని బస్‌లలో అమలు 


ఇంద్ర, గరుడ, రాజధాని, సూపర్ లగ్జరీ బస్‌లలో మాత్రం డిజిటల్ పేమెంట్ సిస్టమ్ అందుబాటులో ఉంది. దీన్ని పల్లెవెలుగులాంటి బస్‌లలో కూడా అమలు చేయాలని భావిస్తున్నారు. అందుకే ప్రక్రియ ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఆర్డర్ పెట్టిన ఐటిమ్స్‌తోపాటు సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి వస్తే ఇకపై పూర్తిస్థాయిలో డిజిటల్ పేమెంట్స్‌ కొనసాగుతాయి. 


Also Read: ఏపీ వెళ్లేవారికి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్, ఈ రూట్లో 10 శాతం డిస్కౌంట్ ప్రకటన


డిజిటల్ బస్‌ పాస్‌లు


బస్‌ పాస్‌లను కూడా డిజిటల్ విధానంలోకి తీసుకురానుంది తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం. వివిధ వర్గాలకు ఇస్తున్న రాయితీ పాస్‌లతోపాటు రెగ్యులర్‌ పాస్‌లను కూడా డిజిటల్ విధానంలోకి తీసుకొస్తారు. వాళ్లందరికీ డిజిటల్ కార్డులు ఇస్తారు. వాటిని బస్ ఎక్కిన తర్వాత స్వైప్ చేయాల్సి ఉంటుంది. 


డేటా ఇంటిగ్రేషన్


ఇలా డిజిటల్ విధానంలో పాస్‌లు తీసుకున్న వాళ్లు ఎంతమంది, టికెట్ కొంటున్నవాళ్లు ఎంతమంది, డిజిటల్ పేమెంట్స్ చేస్తున్న వాళ్లు ఎంతమందో ఒకేచోట తెలుసుకునే వీలు ఉంటుంది. ఏ రూట్‌లలో ఏ టైంలో ఎంత మంది ట్రావెల్ చేస్తున్నారు. రద్దీకి సరిపడా బస్‌ల ఉన్నాయా లేదా అనేది తెలుసుకుని ఆ రూట్‌లో సర్దుబాటు చేసేందుకు వీలు కలుగుతుందని యాజమాన్యం భావిస్తోంది. రద్దీ లేని ప్రాంతాల్లో బస్‌లు తగ్గించి రద్దీ ఉన్న ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంటుందని అంటున్నారు అధికారులు. 


Also Read: ఫ్లిక్స్ బ‌స్ బంప‌ర్ ఆఫ‌ర్ రూ. 99ల‌కే బెంగ‌ళూరు-హైద‌రాబాద్ బ‌స్సు ప్ర‌యాణం