Hyderabad News: హైదరాబాద్ లో విచ్చలవిడి పార్టీల సంస్కృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో ముజ్రా పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. 12 మంది యువకులతోపాటు నలుగురు అమ్మాయిలను అక్కడి నుంచి అరెస్ట్ చేశారు. ముజ్రా పార్టీ కోసం నలుగురు అమ్మాయిలను ఢిల్లీ నుంచి తీసుకువచ్చినట్లు బయటికి వచ్చింది. అయితే, నిందితులు కూడా పోలీసుల విచారణలో ఈ విషయాన్ని ఒప్పుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. వారంతా ఫామ్ హౌస్‌లో అసభ్యకర రీతిలో ఉండగా పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. 


పార్టీ పేరుతో ఫాం హౌస్‌లో అశ్లీలంగా అర్ధ నగ్నంగా డాన్సులు చేస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు ఈ దాడులు చేశారు. నిందితులను అరెస్టు చేసిన తర్వాత వారిని మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాల నిర్మూలన, రేవ్ పార్టీలు, వ్యభిచారంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎన్ని చర్యలు చేపట్టినా తప్పుడు పనులు చేసే వారు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. 


స్కూళ్లు, కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్, ఈ - సిగరెట్స్, గంజాయి వంటివి సరఫరా చేస్తున్న వారిని గుర్తించేందుకు టీ న్యాబ్ (తెలంగాణ యాంటీ నార్కొటిక్ బ్యూరో) కూడా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇక హైదరాబాద్ నగరంలోని పబ్ లలోనూ ఇటీవల డ్రగ్స్ తీసుకుని యువత పట్టుపడుతున్న సంగతి తెలిసిందే. దీంట్లో టీనేజీ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ యువత ఎక్కువగా ఉంటున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.