LPG eKYC News: దేశంలో డొమెస్టిక్ గ్యాస్ వినియోగదారులకు ఉపశమనం కలిగించే వార్త ఒకటి కేంద్ర మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో గ్యాస్ వినియోగదారుల సంఖ్య పెరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత గ్యాస్ సిలిండర్లు, సబ్సిడీకే సిలిండర్లు అంటూ ఎన్నికల్లో హామీలు ఇచ్చాయి. అయితే నకిలీ ఖాతాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండంటంపై కేంద్రం దృష్టి సారించిన సంగతి తెలిసిందే.


ఈ క్రమంలో నేడు కేంద్ర పెట్రోలియం & న్యాచురల్ గ్యాస్ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కోట్లాది ఎల్‌పీజీ సిలిండర్ వినియోగదారులకు ఉపశమనం అందించే ప్రకటన ఒకటి చేశారు. దీని ప్రకారం ఇకపై గ్యాస్ వినియోగదారులు తమ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఎలాంటి కాలవ్యవధి లేదా గడువు లేదని పేర్కొన్నారు. వాస్తవానికి నకిలీ ఖాతాలను తొలగించడానికి, వాణిజ్య సిలిండర్ల మోసపూరిత బుకింగ్‌లను నిరోధించడానికి చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈకేవైసీని అమలు చేస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా మంత్రి స్పష్టం చేశారు. అనేక మంది కమర్షియల్ సిలిండర్ల యూజర్లు తమ వినియోగానికి డొమెస్టిక్ సిలిండర్లను వాడటాన్ని అరికట్టాలని సదరు ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి. 


సంబంధిత గ్యాస్ ఏజెన్సీల్లో దీన్ని చేయాలన్న నిబంధన వల్ల సాధారణ ఎల్‌పీజీ హోల్డర్లకు అసౌకర్యం కలుగుతుందని సతీషన్ లేఖ ద్వారా తెలిపారు. 8 నెలలకు పైగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని, నిజమైన వినియోగదారులకు మాత్రమే ఎల్‌పీజీ సిలిండర్లు అందేలా చూడటమే లక్ష్యంగా పెట్టుకున్నామని పూరీ స్పష్టం చేశారు. గతంలో కూడా మే నెల చివరితో దీనికి సంబంధించిన గడువు ముగుస్తుందనే అనేక పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ వినియోగదారుల ఆధార్ కార్డును వారి LPG కనెక్షన్‌తో లింక్ చేసేందుకు ఎలాంటి అదనుపు రుసుములు ఉండవని గుర్తుంచుకోండి. అలాగే ఇండియన్ గ్యాస్ వినియోగదారులు తమ ఈకేవైసీ ప్రక్రియను కంపెనీ అధికారిక యాప్ ఇండియన్ ఆయిల్ డౌన్‌లోన్ చేసుకుని ఆధార్ ధ్రువీకరణను ఇంటి వద్ద నుంచే సులువుగా పూర్తి చేయవచ్చు.


గ్యాస్ వినియోగదారులు తమ ఈకేవైసీ ప్రక్రియను ఎలా చేయాలనే విషయంపై కేంద్ర మంత్రి పూరి మాట్లాడుతూ.. సిలిండర్ డెలివరీ సమయంలో గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది కస్టమర్ల ఇంటి వద్దే ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తారని పేర్కొన్నారు. ఆ సమయంలో డెలివరీ సిబ్బంది తమ మొబైల్ ఫోన్లలో యాప్ ద్వారా కస్టమర్ ఆధార్ వివరాలను క్యాప్చర్ చేస్తారు. అలాగే కస్టమర్ OTP వస్తుంది. తర్వాత బయోమెట్రిక్ తీసుకుంటారన్నారు. దీనికి తోడు కస్టమర్లు తమ సౌలభ్యం మేరకు డిస్ట్రిబ్యూటర్ షోరూమ్‌ను కూడా సంప్రదించవచ్చు.


యాప్‌ ద్వారా సొంతంగా eKYC పూర్తి చేయటం:
దేశంలో కోట్లాది సంఖ్యలో గ్యాస్ వినియోగదారులు ఉన్న నేపథ్యంలో.. ఎల్‌పీజీ వినియోగదారులు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం వంటి కంపెనీల యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుని సొంతంగా e-KYC ప్రక్రియను వారు ఇంటి నుంచే పూర్తి చేయవచ్చు. వినియోగదారులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూసేందుకు దేశంలోని చమురు కంపెనీలు ఈ విషయంపై పత్రికా ప్రకటన సైతం జారీ చేశాయి.