Prasanth Varma Tweet: ఒక డైరెక్టర్ కెరీర్ టర్న్ అయిపోవడానికి ఒక్క సినిమా చాలు. అలా ప్రశాంత్ వర్మ కెరీర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది ‘హనుమాన్’. ఈ మూవీ వల్ల ప్రశాంత్ వర్మకు టాలీవుడ్‌లో మాత్రమే కాదు.. బాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు లభించింది. అందుకే రణవీర్ సింగ్ సైతం ప్రశాంత్‌తో సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఓకే అయ్యింది? షూటింగ్ ఎప్పుడు ప్రారంభించారు? అని అందరూ ఆశ్చర్యపోయేలోపే మూవీ ఆగిపోయింది కూడా. తాజాగా ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ గురించే ఇన్‌డైరెక్ట్‌గా పోస్ట్ చేసినట్టుగా ఉందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


‘రాక్షస్’ ఆగిపోయింది..


ప్రశాంత్ వర్మ, రణవీర్ సింగ్ కలిసి సినిమా చేయాలని ఎప్పుడు డిసైడ్ అయ్యారో తెలియదు కానీ ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లో షూటింగ్ కూడా మొదలయ్యింది. దీని టైటిల్ ‘రాక్షస్’ అని కూడా ప్రచారం సాగింది. టాలీవుడ్‌లో టాప్ నిర్మాణ సంస్థల్లో ఒకటి అయిన మైత్రీ మూవీ మేకర్స్.. వీరి కాంబినేషన్‌లో సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చింది. కానీ కొన్నిరోజులకే రణవీర్ సింగ్.. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో సినిమా ఆగిపోయింది. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ స్వయంగా ప్రకటించారు. దీంతో ప్రశాంత్ వర్మ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌పై క్లారిటీ లేదు. ఇంతలోనే తను చేసిన ఒక ట్వీట్.. ఇన్‌డైరెక్ట్‌గా ఎవరినో టార్గెట్ చేసినట్టు ఉందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.






రిజెక్షన్ మంచిదే..


‘‘మీరు ఎదుర్కున్న ప్రతీ రిజెక్షన్ మారువేషంలో మీకు మంచే చేసిందని ఒకరోజు మీరే గ్రహిస్తారు’’ అని ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశాడు. దీంతో అసలు ఈ ట్వీట్ ఎందుకు చేశాడు? ఎవరిని ఉద్దేశించి చేశాడు? అని ఫ్యాన్స్‌లో చర్చలు మొదలయ్యాయి. తనతో కలిసి సినిమా చేస్తానని షూటింగ్ ప్రారంభించిన తర్వాత ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు కాబట్టి రణవీర్ సింగ్ గురించే ఈ ట్వీట్ చేసి ఉంటాడని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రశాంత్ వర్మ టేకింగ్‌కు ఫిదా అయిన ఫ్యాన్స్ మాత్రం తన అప్‌కమింగ్ మూవీ గురించి తెలుసుకోవడానికి ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అప్డేట్ ఇస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు.


క్లారిటీ లేదు..


ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ముందుగా ‘హనుమాన్’ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు ఈ యంగ్ డైరెక్టర్. దీని తర్వాత వెంటనే ‘జై హనుమాన్’ సినిమాను తను ప్రారంభించాల్సి ఉంది. దానికోసం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేశాడు. కానీ మధ్యలో ఏమైందో తెలియదు.. ‘రాక్షస్’ అంటూ రణవీర్‌తో మూవీ మొదలుపెట్టాడు. అది కూడా మధ్యలో ఆగిపోయింది. వీటితో పాటు ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీని కూడా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశాడని, ఆ షూటింగ్ దాదాపుగా అయిపోయిందని కూడా వార్తలు వచ్చాయి. మరి వీటిలో ప్రశాంత్ వర్మ నుంచి ఏ సినిమా ముందుగా వచ్చి ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.



Also Read: రేవంత్‌ రెడ్డి చెప్పినట్టే చేద్దాం- తన మాటలపై వివరణ ఇచ్చిన హీరో సిద్ధార్థ్‌